Tuesday, June 2, 2020

గురు చరిత్ర అధ్యాయము -42



అధ్యాయము  -42



శ్రీ గణేశాయనమః                             

శ్రీ సరస్వత్యేనమః                                                                                                  

శ్రీ గురుభ్యోనమః 



కథారంభము 





                వారిద్దరూ కాశీ చేరిన తర్వాత త్వష్ణకు అవధూత బోధించిన కాశీయాత్రా విధానం గురించి నామధారకునితో సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు: " విశ్వేశ్వరుని దర్శనము,  అంతర్ గృహ యాత్ర, దక్షిణ ఉత్తర మానస యాత్ర, పంచక్రోశయాత్ర,  స్నానము,  దానము,  అర్చన, శ్రాద్ధము, అన్నపూర్ణ- విశ్వేశ్వర- బిందుమాధవ- డుండి  వినాయక- దండపాణి- కాలభైరవ- గుహ - గుహకాశీ- మణికర్ణిక- మొ || నవి దర్శించి,  పూజ చేసి,  నీ పేరు మీదుగా ఒక లింగ ప్రతిష్ట చేసుకో. ఇలాచేస్తే నీగురు భక్తి దృఢమై,  ఈశ్వర సాక్షాత్కారమవుతుంది. కనుక నీవు నిస్సందేహంగా నీ మనస్సులో గురు చరణాలను స్థిరంగా నిలుపుకో',  అని చెప్పి,  రెప్పపాటులో అవధూత అదృశ్యమయ్యారు. త్వష్ణ ఆశ్చర్యచకితుడై, 'ఆహా,  ఈ మహాత్ముడు నా గురు కృపవలన సాక్షాత్కరించిన విశ్వేశ్వరుడే,  సందేహము లేదు. తనను నేను ఆరాధించుకున్నా,  ఆయన ప్రసన్నుడవటము గురుకృప వల్లనే కదా! లేకపోతే ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసినా ప్రసన్నుడు కానీ ఈశ్వరుడు నాకెందుకు ప్రసన్నుడౌతాడు?' అనుకుని యధావిధిగా కాశీ యాత్ర,  లింగ ప్రతిష్ఠ చేశాడు. అతడు ధ్యానించగానే విశ్వనాథ లింగములో శంకరుడు  దర్శనమిచ్చి, వరం కోరుకోమన్నాడు. అతడు తన గురువు,  గురుభార్య మొదలైన వారు అడిగినవి విన్నవించాడు. శంకరుడు వరమిచ్చి,  'నాయనా, నీ గురు భక్తికి మెచ్చాను. నీవు 'విశ్వకర్మ' అనే సృష్టికర్తవు అవుతావు.' అని ఆశీర్వదించి అదృశ్యమయ్యాడు.


                 త్వష్ణ సంతోషించి తన గురువు,  గురుపత్ని,  పిల్లలు కోరినవన్నీ సృష్టించి సమర్పించుకున్నాడు. గురువు సంతోషించి,  అతనికి జ్ఞానము,  సర్వసిద్ధులు,  నవనిధులు,యశస్సు కలిగేలా ఆశీర్వదించారు. కనుక గురుభక్తి వలన సాధ్యము కానిది ఏదీలేదు. గురుభక్తునికి ముగ్గురు మూర్తులూ  వశులవుతారు. గురువు లేక మోక్షము సిద్ధించదు."              


                         శ్రీ గురుడు గురుసేవ ప్రాశస్త్యం  చెప్పడమయ్యేసరికి సూర్యోదయమైంది. సాయం దేవుడు,  శ్రీగురునికి నమస్కరించి ఆనంద పారవశ్యంతో, 'ఓ  కృపామూర్తీ! నాకిప్పుడు ఒక అపూర్వమైన దర్శనమైంది. మీరి కథలో భాగంగా కాశీయాత్ర వివరిస్తుంటే నేను మీతోకలిసి కాశీక్షేత్రం దర్శించినట్లు అనుభవమైంది. అది నిద్రావస్తొ, లేక  స్వప్నమో తెలియటం లేదు. జగద్గురూ! మీ నిజతత్వము తెలియని మూడులకు విశ్వేశ్వరలైన మీరు మానవులుగా కనిపిస్తున్నారు. మీరు ఎక్కడ ఉంటే అదే కాశీ' అంటూ ఉంటే అతని శరీరమంతా రోమాంచితమై కంఠం గద్గదమైంది. అతడిలా శ్రీగురుని స్తుతించాడు:       


                '(1). మొదట అద్వయులుగా ఉండి, సంకల్పమాత్రాన ఈ బ్రహ్మాండ రూపం ధరించి,  మరలా దానిని పాలించడానికి అవతరించిన,  ఓ నృసింహ సరస్వతీ ! మీ పాద పద్మములకు వందనములు (2). కలి ప్రభావం వలన ధర్మం నశించి, యజ్ఞయాగాదులు కరువైనప్పుడు దేవతల ప్రార్థనలననుసరించి,  భూమిపై అవతరించి,  ధర్మాన్ని పునరుద్ధరిస్తూ లోకానికి జ్ఞానజ్యోతిని అనుగ్రహిస్తున్న ఓ నృసింహ సరస్వతీ! మీ పాద పద్మములకు నమస్కారములు.(3). సంసార సాగరంలో మునిగిఉన్న భక్తులను తరింప చేయడానికి అవతరించి,  చతుర్దాశ్రమం  స్వీకరించి లోకోద్ధరణ చేస్తున్న ఓ నృసింహ సరస్వతీ ! మీ పాద పద్మములకు నమస్కారములు(4). స్వామీ,  మీ చరిత్ర చిత్రమైనది. మీ కీర్తి భూమండలమంతా వ్యాపించింది. మూగవానికి మాట్లాడే శక్తిని అనుగ్రహించారు. గుడ్డివారికి దృష్టి, గొడ్రాలికి  సంతానము, ఎండు కట్టెకు  ప్రాణం, విధవరాలికి  సౌభాగ్యము,  భక్తులకు సిరిసంపదలు ప్రసాదించారు. ఓ నృసింహ సరస్వతీ ! మీ పాదపద్మములకు నమస్కారములు(5). పాపాన్ని,  దారిద్యాన్ని పోగొట్టి జగత్తుకు జ్ఞానజ్యోతి ప్రసాదిస్తూ,  కామదేనువు మరియు కల్పవృక్షాల వలె భక్తులు కోరినవన్నీ నెరవేరుస్తూ, ముముక్షువులకు ముక్తిని కూడా మీరు అనుగ్రహిస్తున్నారు. వేదాలకుకూడా అతీతమైన స్వరూపంగల ఓ నృసింహ సరస్వతీ! మీ పాద పద్మములకు నమస్కారములు. (6) ఓ గురుమూర్తి! మీ పాదపద్మములను నిత్యము స్మరించేవారికి సర్వతీర్థక్షేత్రాలను  సేవించిన ఫలితము,  వాటిని దర్శించిన వారికి వేలాది అశ్వమేదాదియాగాలు చేసిన ఫలితము  ప్రసాదిస్తున్న ఓ నృసింహ సరస్వతీ! మీ పాదపద్మములకు నమస్కారములు. (7). వేదాలకుకూడా మీ నామ మహత్యం అంతుపట్టనిది. సకల భువనాధిపతులైన మీ పాదద్వయాన్ని నా హృదయ కమలంలో నిలుపుకొని మనసారా మరల మరల నమస్కరిస్తున్నాను. ఓ నృసింహ సరస్వతీ! మీ పాదపద్మములకు నమస్కారములు. శ్రీ సద్గురూ! నన్ను రక్షించు,  వేదాలకు గూడా అంతు పట్టని మీ పరిశుద్ధమైన చరిత్రను నేనేమీ వర్ణించగలను?  మీరు ఓంకార స్వరూపులు. పంచభూతాలు,  సూర్య చంద్రులు,  జీవాత్మ అనే ఎనిమిది రూపాలలో మీరు విశ్వరూపం ధరించారు.ఓ నృసింహ సరస్వతీ ! మీ పాద పద్మములకు నమస్కారములు. (8). ఈ కలియుగంలో భక్తులనుద్దరించడానికి దండకమండలుధారియైన యతీశ్వరుని రూపంలో అవతరించి,  భీమా - అమరజా సంగమంలో శ్రీ నృసింహ సరస్వతియను పేర నివసించిన శ్రీగురూ! మీ  పాదపద్మములకు నమస్కారములు. ఈ ప్రపంచంలోని భక్తులందరినీ తరింపచేయడానికి, యోగులకు  దీక్షనను గ్రహించడానికీ  గానుగాపుర  క్షేత్రంలో వెలసి, నాలుగు పురుషార్థాలూ  ప్రసాదిస్తున్న ఓ  నృసింహ  సరస్వతీ ! మిమ్మల్ని స్తుతించడం  వలన నాలోని దోషాలన్నింటిని జయించి, మీ పాదపద్మములకు నమస్కరిస్తున్నాను. (9). శ్రీగురుస్తోత్రమైన  ఈ అష్టకాన్ని నిత్యమూ పఠించిన వారికి బలము,  సంపద, సద్బుద్ధి , వర్చస్సు,  పుత్ర పౌత్రాభివృద్ధి,  ఆయురారోగ్యాలతో కూడిన ఐహిక సౌఖ్యానికి  తోడు,  అటు తర్వాత ముక్తి  కూడా లభించగలదు' శ్రీగురుడు సంతోషించి,  'నాయనా! నీకు కాశీ దర్శనమైంది గదా! ఇందువలన నీ వంశంలో ఇరవై ఒక్క తరాలవారికి కాశీయాత్రాఫలం సిద్ధించింది. నీవు మా దగ్గరుండి మా పాదసేవ చేసుకో ! కానీ అలా చేయాలంటే ఆ మ్లేచ్ఛరాజు సేవలో ఉండకూడదు. గనుక నీ భార్యాబిడ్డలను తీసుకొనివచ్చి గంధర్వనగరంలో ఉండు అని చెప్పి,  అతనిని వెంటబెట్టుకుని గ్రామంలోని తన మఠానికి తిరిగి వచ్చారు.    


                                                    సాయం దేవుడు ఆ ప్రకారమే స్వగ్రామానికి వెళ్లి,  భార్యా బిడ్డలను తీసుకుని ఒక భాద్రపద శుద్ధ చతుర్దశి నాటికి గంధర్వపురం చేరాడు. అతడు శ్రీగురుని దర్శించి,  'త్రిమూర్తి! మాలకాకి మానస సరోవరంలో మునిగి రాజహంస అయినట్లు,  మీ దర్శనమాత్రం చేతనే మా పాపాలన్నీ నశించిపోతాయి. గంగాజలము  పాపాన్ని,  చంద్రుడు తాపాన్ని,  కల్పవృక్షము దైన్యాన్ని పోగొట్టగలదు.  కానీ పాప, తాప, దైన్యాలను మూడింటిని మీ  దర్శనమే పోగొట్టగలదు.  మీ కృప సర్వ పురుషార్థాలనూ  వెంటనే ప్రసాదించగలదన్న శృతి వాక్యము నాకిప్పుడు అనుభవమైంది' అని మైమరచి గంతులేస్తూ,  తన మాతృభాషయైన  కన్నడం లో ఇలా స్తుతించాడు:    


                                            '(1). భూమిపై భక్తుల పాలిటి భాగ్యనిధియై  అవతరించిన శ్రీ నృసింహ సరస్వతిని చూడగలిగాను(2) భక్తితో ధ్యానించేవారికి సుఖమిచ్చే జగత్పతియైన మీ చరణ కమలాలు  దర్శించగలిగాను. (3). సంసారంలో తపిస్తున్న భక్తులకు అభీష్టాలిచ్చి, యోగులకు యోగసిద్ధిని అనుగ్రహించే శ్రీనరసింహ సరస్వతి దర్శన భాగ్యం నేడు  కలిగింది. (4).మహావాక్యాలుగా చెప్పబడిన పరతత్త్వమే సగుణమై సత్పురుషుల నుద్ధరించడానికి దండకమండలములు  ధరించి,యతి   సార్వభౌముడిగా అవతరించిన ఓ  నరసింహ సరస్వతీ! నేడు నాకు మీ దర్శనమైంది. (5). భక్తపాలుడు దయాసముద్రుడు అయిన మీ  పాదస్పర్శ వలన ఈ గంధర్వపురం భూకైలాసమైంది. అట్టి మీ పాదదర్శనం నేడు నాకు లభించింది.(6). యతులు అనే నక్షత్రాల మధ్య చంద్రునివలె ప్రకాశిస్తున్న మీ దర్శనం నేడు  కలిగింది. మీ యతిరూపంలో భక్తజనుల మహాభాగ్యమే  సాకారమై వెలిసింది.(7). వేదాంతతత్వానికి ఆదర్శమైన చరిత్రను చూపే మీ పాదాలను నేడు దర్శించ గలిగాను.  భక్తులను రక్షించడంలోజాగు చేయని దయాఘనా ! నీకు జయము. (8). ఆనంద సముద్రుడు,  గంధపరిమళాలతో శోభిల్లే యోగిజన వల్లభుడూ  అయిన శ్రీకృష్ణుని,  మీ రూపంలో దర్శిస్తున్నాను. (9). ప్రకృతి -పురుషుల అభేదాన్ని'నరసింహ + సరస్వతి' అను పేరు సార్థకమొనర్చిన జగద్గురువు రూపంలో సంచరిస్తున్న మహావిష్ణువును నేడు దర్శించుకున్నాను. 


                            శ్రీగురుడు ఎంతో సంతోషించి అతనిని,  అతని భార్యాబిడ్డలను తమ సన్నిధిలో కూర్చోబెట్టుకుని,  వాత్సల్యంతో వారిక్షేమ సమాచారాలు విచారించారు. సాయందేవుడు వారందరినీ స్వామికి పరిచయం చేశాడు. అతని కొడుకులిద్దరూ నమస్కరించినప్పుడు  ఆయన వారి శిరస్సులపై చేయి ఉంచి ఆశీర్వదించారు. అప్పుడు సాయందేవుని పెద్ద కుమారుడైన నాగనాధుని చూపిస్తూ ఆయన, 'సాయందేవా! ఇతడు సిరిసంపదలతో చిరకాలం జీవిస్తాడు. వీడే మా నిజమైన భక్తుడు,  మాకు ప్రీతిపాత్రుడు వీడి కీర్తి ఎంతగానో విస్తరిస్తుంది. ఇతడు వంశోద్ధారకుడవుతాడు. సౌభాగ్యవతియైన నీ  భార్య పతివ్రత. మీకింకా నలుగురు కొడుకులు కలుగుతారు. మ్లేచ్చుని  సేవించడం వలన ఈ పుణ్యం నశిస్తుంది గనుక నీవది విడిచిపెట్టి మావద్దనే ఉండు' అని,  అతని భార్యా పిల్లలను కూడా అందుకు ఒప్పించారు. తర్వాత సాయందేవునితో స్వామి,  'మొదట వీరిని తీసుకుని సంగమానికి వెళ్లి స్నానము చేసి,  అశ్వత్తాన్ని  పూజించుకొనిరా' అని చెప్పారు.                                       

                        ఆనాడు అనంత పద్మనాభ చతుర్దశి. కనుక నది ఒడ్డున ఎందరెందరో అనంత వ్రతము  చేసుకుని శ్రీగురుని దర్శించుకోవాలని గంధర్వనగరము వస్తున్నారు. శ్రీ గురుడు సాయందేవునిగూడా అనంతవ్రతము చేసుకోమని చెప్పారు. అతడు, 'మీరే నాకు అనంతులు, మీ  పాదసేవయే  నాకు అనంతవ్రతము. నాకింక వేరొక వ్రతం ఎందుకు?  అన్నాడు. స్వామి, 'నాయనా,  నీవు మామాట విని వ్రతం చేసుకో! పూర్వము కౌండిన్యుడు అనే ఋషి ఈ వ్రతము చేసుకొని అభీష్టాలన్నీ  పొందాడు. నీవు కూడా కౌండిన్యస గోత్రుడవే  గనుక ఈ వ్రతమాచరించు' అన్నారు. అప్పుడు సాయందేవుడు, 'స్వామీ !అలా అయితే ఆ  వ్రతవిధానమేమో, మా గోత్రఋషి దానివలన ఎలా కృతార్ధులయ్యారో  వివరించండి' అని కోరాడు. శ్రీగురుడు  వివరించారు".  

నలభై రెండవ అధ్యాయం సమాప్తము 

శ్రీ దత్తాయ గురవేనమః 

శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః   

No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box

నూతనయజ్ఞోపవీత ధారణ విధానము

  నూతనయజ్ఞోపవీత ధారణ విధానము జంధ్యాల పౌర్ణమి శ్రావణ పౌర్ణమి నాడు వస్తుంది. ఈ రోజు జీర్ణమైన (పాత) జంధ్యమును తీసివేసి కొత్త జంధ్యమును (యజ్ఞోప...