Monday, June 8, 2020

గురు చరిత్ర అధ్యాయము -48


అధ్యాయము  -48




                               
శ్రీ గణేశాయనమః  
                           
శ్రీ సరస్వత్యేనమః
                                                                                                  
శ్రీ గురుభ్యోనమః 



కథారంభము 



                      "స్వామీ ! ఈ గంధర్వపురంలో శ్రీ గురుడు ఇంకేమి చేశారో చెప్పండి!" అని కోరిన నామధారకునితో సిద్ధుడు ఇలా చెప్పారు. "నాయనా! ఆ భగవంతుడు ప్రతిరోజూ స్నానానుష్టాలకు మఠంనుండి బయలుదేరి సంగమానికి వెళ్లి వస్తుండేవారు అని చెప్పాను కదా? అప్పుడు గంధర్వ పురం లో పార్వతేశుడనే ఒక వ్యవసాయదారుడు ఉండేవాడు. అతడు గుత్తకు సాగుచేసుకునే పొలం సంగమం నుండి మఠానికి వెళ్లే దారిలో ఉండేది. అతడు నిత్యమూ మొదట మఠంలో శ్రీగురుణ్ణి  దర్శించుకుని పొలానికి వెళ్తుండేవాడు. శ్రీ గురుడు మఠం నుండి సంగమానికి వెళ్లేటప్పుడు, తర్వాత మఠానికి తిరిగివచ్చేప్పుడు, కనిపెట్టి పరుగునపోయి ఎంతో శ్రద్ధాభక్తులతో కొద్దిదూరం నుండే ఆయనకు నమస్కరించుకుని పోతుండేవాడు. కొంతకాలం శ్రీగురుడు అతనినేమీ పలకరించకుండా అతడి భక్తిశ్రద్ధలను గమనిస్తూ ఉండేవారు. ఎంతకాలమైనా అతడేమి కోరడం లేదని గమనించిన శ్రీగురుడు ఒకరోజు అతడు నమస్కరించగానే, "నాయనా! నిత్యమూ  నీవింత శ్రద్ధాభక్తులతో మాకు నమస్కరిస్తున్నావే, మానుండి నీకు ఏమి కావాలో చెప్పు!' అన్నారు. ఇంత కాలానికి తనకట్టి  అవకాశం వచ్చినందుకు పర్వతేసుడెంతో సంతోషించి, చేతులు జోడించి, 'బాబూ, నా పొలాన్ని స్వామి వారు ఒక్కసారి చూచి, అక్కడ తమపాదము పెడితే మాకు మేలవుతుందని నా ఆశ' అన్నాడు. స్వామి, ' నాయనా, నీ పొలంలో ఏమి పైరు వేసావు?' అని అడిగారు. అతడు 'అయ్యా! ఈ సంవత్సరం జొన్నవేశాను.  రోజూ  మీకు నమస్కరించుకుంటుంటే చేను బాగా పెరుగుతున్నది. ఇప్పుడిప్పుడే ధాన్యం పాలు పోసుకుంటున్నది. తమ దయ వల్ల 2 నెలల్లో అది కోతకు సిద్ధమవుతుంది. కనుక మీ అమృత దృష్టితో ఆ చేనును  చూస్తే మాకింత అన్నం పెట్టిన వారవుతారు. ఎవరో శూద్రుడు ఏదో చెప్పాడులే అని తలచి, నామాట త్రోసిపుచ్చివద్దు. మీరే మా పాలిట రక్షకులు' అని ప్రార్థించాడు.                   


                            శ్రీ గురుడు, 'సరే పద, చూచి వద్దాము' అని చెప్పి, అతనితో గూడ చేను వద్దకు వచ్చారు. ఏపుగా పెరిగిన పైరును కలయజూస్తూ, ఏమిరా! మేము చెప్పింది చేస్తాం అంటే ఒక మాట చెబుతాను' అన్నారు. ఆ రైతు, 'తండ్రి, మీమాట జవదాటుతానా? మా క్షేమం కోరి చెప్పేవారు మీరుగాక మరి ఎవరున్నారు? మీరు ఒక మాట చెప్పిన తర్వాత నాకు వేరొక తలంపే ఉండదు. స్వామికి తెలియనిది ఏమున్నది?గుర్వాజ్ఞ  విషయంలో నాకు మరే ఆలోచనా లేదు' అన్నాడు. ఆ యతివరేణ్యుడు, 'అలా అయితే మా మాటమీద నమ్మకం ఉంచి, మేము మధ్యాహ్నం ఇటుగా వెళ్ళే లోపల ఈ చేలోని పైరుఅంతా కోయించు!' అని చెప్పి సంగమానికి వెళ్లి పోయారు. 


                            ఆ పాలిగాపు వారి ఆజ్ఞను  అక్షరాల పాటించదలచి వెంటనే ఊరిలోనున్న ఆ పొలం ఆసామి వద్దకు వెళ్లి, ఆ ముందటి సంవత్సరం అతనికి చెల్లించిన ప్రకారమే ఈ సంవత్సరం కూడా గుత్త  చెల్లిస్తానని, పైరు కోయడానికి  అనుమతిపత్రం ఇవ్వమనీ  కోరాడు. కానీ ఆ ఏడాది పైరు ఎప్పటికంటే ఎక్కువగా పెరగడం వలన ఆసామి అందుకు ఒప్పుకొనక, ఆ ముందటి సంవత్సరంకంటే రెట్టింపు గుత్త  చెల్లించేటట్లు ఒప్పించుకొని ఆ ప్రకారమే కాగితం రాయించుకొని, పైరు కోతకు అనుమతిచ్చాడు. ఆ కాపు వెంటనే కూలీలను పిలుచుకొని పొలంవద్దకు వెళ్లాడు. 'పైరుకు ఇంకా పాలుపట్టే సమయంలోనే అతడు కోత కోయిస్తున్నాడేమా!' ఈ కూలీలు గూడా ఆశ్చర్యపోయారు.కానీ,  తమకు కూలీ దక్కుతుందన్న తలంపుతో పనిలో దిగారు. అంతలో ఆ సంగతి తెలిసి,  అతని భార్య బిడ్డలు నెత్తీ,  నోరూ మొత్తుకొంటూ వచ్చి అతనికి అడ్డుపడ్డారు. వాళ్ళని పొమ్మని  ఎంత చెప్పినా వాళ్ళు అడ్డు తొలగకపోయేసరికి,  అతడు వాళ్ళమీద రాళ్ళు రువ్వసాగాడు.  వాళ్ళు భయపడి న్యాయాధికారి వద్దకు వెళ్లి, 'మహాప్రభూ! మా వాడికి దయ్యం పట్టిందో ఏమో గాని,  కంకులింకా ముదరకముందే పైరు కోయిస్తున్నాడు.  వద్దని అడ్డుబోతే  మమ్మల్ని రాళ్లతో కొడుతున్నాడు ఎవరో సన్యాసి చెప్పిన మాటలు విని,పంటకొస్తున్న పైరే చేతులారా పాడుచేస్తున్నాడు. ఇంకొక నెలరోజుల్లో చేతికి వస్తుందని మేము ఆశపడుతూ ఉంటే ఆ కాస్తా ఇలా నాశనమైపోతున్నది. అతనిని నిగ్రహించండి.అని గొల్లున ఏడ్చారు. ఆ న్యాయాధికారి,' మీరు నాతో చెబితే నేను ఏమి చేయగలను? ఏమైనా చేయగలిగితే యజమానే  చేయగలడు. అతనితో చెప్పుకోండి' అని చెప్పి వారిని పంపివేసాడు.    


                          వాళ్లు అప్పుడు ఆ పొలం యజమాని వద్దకువెళ్లి మొరపెట్టుకుంటే అతడు, 'వాడి ఇష్టం! వాడేమి  చేసుకుంటే నాకెందుకు? క్రిందటి సంవత్సరం కంటే రెట్టింపు గుత్త నాకు ఇచ్చేలా రాయించుకున్నాను. అయినా మీరింతగా గోల పెడుతున్నారు గనుక, మా మనిషినిపంపి వాడిని వారించడానికి ప్రయత్నిస్తాను. మీరు వెళ్ళండి' అని చెప్పి ఒక మనిషిని పంపాడు. ఆ మనిషి పొలం వద్దకు వెళ్లి అడ్డుచెప్పగానే ఆ సేద్యగాడు, 'ఏమయ్యా! కాగితం రాయించుకున్న ప్రకారం యజమాని నా నుండి ధాన్యం తీసుకోవాలేగాని, నేనేమి చేసుకుంటే అతనికి ఎందుకు? ఆయనకు ఇవ్వవలసిన ధాన్యం మా ఇంటి గాదెలోనే ఉన్నది. అది చాలకుంటే, వాటికి బదులు చెల్లించడానికి నా దగ్గర కావలసినన్ని పశువులు ఉన్నాయి కదా?' అని చెప్పి, అతనిని వెనుకకు పంపివేసాడు. అంతటితో యజమాని ఊరుకున్నాడు. పర్వతేశుడు పైరు కోత త్వర త్వరగా పూర్తి చేయించి, కొడవళ్ళు కట్టకట్టించి అవతల పెట్టించి, శ్రీ గురుణ్ణి స్మరిస్తూ, ఆయన సంగమం నుండి మఠానికి వెళ్లే దారిలో ఆయన రాకకై ఎదురు చూస్తూ కూర్చున్నాడు. కొంత సేపటికి అటుగావస్తున్న శ్రీగురునికి అతడు నమస్కరించి, వారిని పొలం వద్దకు తీసుకువెళ్లి, ఆ కోసి వేసిన పైరు చూపాడు. స్వామి అది చూచి ఆశ్చర్య నటిస్తూ, 'అయ్యో! నీవు అనవసరంగా పైరంతా కోసివేయించావే! నేనేదో పరిహాసంగా అంటే అన్నంత పని చేశావే! ఎంతపని చేశావయ్యా! పాపం, ఇప్పుడు నీ జీవనమెలా? యజమానికి ధాన్యం ఎలా ఇస్తావు? అమాయకుడా? పండనిపైరు కోసి అంతా వ్యర్ధం చేసావు కదా!' అన్నారు. కాని పర్వతేశుడు కొంచెమైనా జంకకుండా ఆయనకు నమస్కరించి, 'స్వామీ! నాకు గురువాక్యమే ప్రమాణము. అదేమాకు శ్రీరామరక్ష. మీరు ఉండగా మాకేమి భయం?' అన్నాడు. అతని విశ్వాసానికి శ్రీగురుడు లోలోపల సంతోషించి, 'నీకు అంత దృఢమైన విశ్వాసం ఉంటే అలానే అవుతుందిలే!' అని నిర్వికారంగా మఠానికి వెళ్లిపోయారు. ఆ కాపరి గూడా శ్రీ గురుడు కనుమరుగు అయ్యేవరకు తదేకంగా ఆయనను చూచి, నిశ్చింతగా ఇంటికి వెళ్లాడు. దారిలో అతనిని చూచిన వారంతా యెన్నెన్నో మాటలన్నారు కానీ, అతడు అవేమీ పట్టించుకోలేదు.


                    పర్వతేశుడు ఇల్లు చేరేసరికి అతడి భార్య తమకా  సంవత్సరం నోటి వద్దకొచ్చిన కూడు పాడై పోయిందని భోరుభోరున ఏడుస్తున్నది. అతడు మాత్రం ఎంతో నిబ్బరంగా ఆమెతో, ' ఓసి వెర్రిదానా! నీవలా  ఏడవకూడదు. ఆ గురుదేవుల వాక్కే మన పాలిట కామధేనువు. వారి మహిమ మూఢులకేమి తెలుస్తుంది? ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడే. మనకాయన పెన్నిధిలా దొరికాడు. వారి దయ ఉంటేనే అందరము సుఖంగా బ్రతక గవారి దయ ఉంటేనే అందరము సుఖంగా బ్రతకగలము. మామూలుగా పడవలసిన పంటకంటే ఎన్నోరెట్లు ఎక్కువగా ఆయన ప్రసాదిస్తారని నాకు నమ్మకమున్నది' అని చెప్పి ఆమెను ఓదార్చాడు. అతని మాటలు విన్న ఇరుగు పొరుగు వారు అందరూ చోద్యము చూడవచ్చి, అతని మూఢవిశ్వాసానికి నివ్వెరబోయి, నవ్వుకుంటూ వెళ్ళిపోయారు.   


                    ఒక వారం రోజులు గడిచాయి. ఎనిమిదవరోజు నుండి విపరీతమైన చలిగాలి వీచనారంభించింది. దానివలన చుట్టుప్రక్కల చేలన్నీ  వాలిపోయి, తాలుధాన్యం ఏర్పడింది. దానికితోడు ఆ పుష్యమాసంలో భారీఎత్తున అకాలవర్షం కురిసింది. అంతటితో మిగిలిన పైరులన్నీ  పూర్తిగా పాడైపోయాయి. కానీ పర్వతేశుని పొలంలో మాత్రం కోయబడిన పైరు మొక్కల మొదళ్లనుంచి ఒక్కొక్క మొక్కకు పది,  పదకొండు చొప్పున పిలకలు వచ్చాయి. పైరు ఏపుగా పెరిగి అమితంగా పండింది. అది చూచిన వారందరూ నిర్ఘాంతపోయారు. అతడి భార్యకూడా అమిత సంతోషంతో తన భర్త కాళ్ళమీదపడి, 'అయ్యా! తెలియక నేనెంతో గొడవచేసి మీ మనస్సును ఎంతగానో నొప్పించాను. తెలివితక్కువ వలన ఏమేమో నోటికొచ్చినట్లు మాట్లాడాను. చివరకు ఆ మహానుభావుణ్ణి గూడా నిందించాను. అదెంత తప్పో  ఇప్పుడు తెలుసుకున్నాను. అదంతా మనస్సులో పెట్టుకోక నన్ను క్షమించు' అని ప్రాధేయపడింది.         


                            అప్పుడు ఆ భార్యాభర్తలు ఆ పొలానికి నమస్కరించుకొని భూమి పూజచేసి శ్రీగురునివద్దకు వెళ్లి ఆయన పాదాలమీద పూలువేసి నమస్కరించు  కున్నారు. స్వామి నవ్వి, 'ఏమిటి విశేషం? ' అన్నారు. ఆ దంపతులు నమస్కరించి, 'స్వామీ, మీ దయవలన మేము కోరినదానికంటే ఫలితమెంతగానో ఎక్కువ వచ్చింది. మిమ్మల్ని మించిన కామధేనువు, సత్యమూర్తి భూమిమీద ఇంకెవరున్నారు? అమృతంవంటి మీమాట అందరూ వినదగినది. అదియే  అందరి పాలిట పెన్నిధి; మీ చూపు పాపులను కూడా పావనం చేయగలదు' అన్నారు. పర్వతేశుని భార్య, 'స్వామీ! నేను తెలియక మొదట ఏమేమో అన్నాను. మన్నించి మమ్మల్ని మీరు ఎప్పుడు ఇలానే కాపాడాలి. మీరే మాకు దిక్కు. మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని ఇలాగే కొలుచుకునేలా అనుగ్రహించండి' అని  విన్నవించుకున్నది. తర్వాత ఆ దంపతులు స్వామికి నీరాజనమిచ్చారు. వారి భక్తిని చూచి సంతోషించి శ్రీగురుడు, 'అఖండ శ్రీరస్తు!' అని ఆశీర్వదించి, వాళ్లను పంపివేశారు. ఆ దంపతులు ఎంతో సంతోషంగా ఇంటికి పోయారు.   


                                                నెల గడిచేసరికి పర్వతేశుని పంటపండి, కంకులు అద్భుతంగా బయటికి వచ్చాయి. నిజానికి ఆ మొదటి సంవత్సరం కంటే ఎన్నోరెట్లు ఎక్కువగా ధాన్యం పండింది. ఆ కాపు ధాన్యం నూర్చి రాశిపోసి, ఆసామి వద్దకుపోయి, 'అయ్యా! చూచారా, స్వామి దయవలన పైరెంత బాగా పండిందో? మీకు కూడా మన ఒప్పందం చేసుకున్న దాని కంటే ఎక్కువే ఇస్తాను తీసుకోండి. అయినా నాకు ఇంత ఎక్కువగా పడింది కనుక మనిద్దరమూ చెరిసగం తీసుకొనడం న్యాయమని నాకు అనిపిస్తున్నది. మీరు వెంటనే వచ్చి మీభాగం తీసుకుపోండి' అని చెప్పాడు. కానీ ఆసామి ధనాకు లోబడక ధర్మానికి అంటిపెట్టుకుని, తనుఒప్పందం చేసుకున్న దానికంటే కొంచెం కూడా ఎక్కువ తీసుకోడానికి అంగీకరించలేదు. 'అది నీ భక్తిశ్రద్ధలకు మెచ్చి శ్రీగురుడు ప్రసాదించినది కనుక అదంతా నీకే చెందాలి' అన్నాడు. అప్పుడా రైతు, రాజుకు చెల్లించాల్సిన భాగం వేరుగా తీసి ఆ సంవత్సరం పంటలు నాశనమై అలమటిస్తున్న బ్రాహ్మణులకు కొంత ధాన్యమిచ్చాడు. అటుపైన మిగిలినదంతా బండ్లమీద వేసి ఇల్లు చేరుకున్నాడు. నామధారకా! శ్రీగురుని మహత్యం ఎంతటిదో చూచావా? గురుభక్తే అభీష్టాలన్నింటినీ ప్రసాదించగలదు." 


నలభై ఎనిమిదవ అధ్యాయం సమాప్తము 


శ్రీ దత్తాయ గురవేనమః 


శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః   

No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box

నూతనయజ్ఞోపవీత ధారణ విధానము

  నూతనయజ్ఞోపవీత ధారణ విధానము జంధ్యాల పౌర్ణమి శ్రావణ పౌర్ణమి నాడు వస్తుంది. ఈ రోజు జీర్ణమైన (పాత) జంధ్యమును తీసివేసి కొత్త జంధ్యమును (యజ్ఞోప...