Friday, June 12, 2020

గురు చరిత్ర అధ్యాయము -52


అధ్యాయము  -52




                               
శ్రీ గణేశాయనమః
                             
శ్రీ సరస్వత్యేనమః
                                                                                                  
శ్రీ గురుభ్యోనమః 



కథారంభము 


            అంతవరకూ ఎంతో ఆసక్తితో శ్రీగురుని లీలలు చెప్పించు కుంటున్న నామధారకుడు, ఈసారి సిద్ధముని కథ ముగించిన తర్వాత కూడా ఏమీ మాట్లాడకుండా నిశ్చేష్టుడై ఉండిపోయాడు. నఖశిఖపర్యంతమూ కించిత్తైనా చలనం లేకుండా శిలాప్రతిమలా ఉండిపోయాడు. అతని శరీరమంతటా వెంట్రుకలు నిక్కబొడుచుకొని ఉన్నాయి. చెమట బిందువులు నిలిచాయి. అతని శరీరమంతా కంపించి పోతున్నది. అతని ముఖంలోని భావమంతా పూర్తిగా మారిపోయి, అతని కన్నుల నుండి సంతతధారగా ఆనందభాష్పాలు కారుతున్నాయి. ఈ ఎనిమిది  విధాలైన భక్తి భావాలతోను అతడు సమాధి స్థితిలో ఉన్నాడని గ్రహించిన సిద్ధముని, లోకహితం కోరి అతనిని మేల్కొల్పాలని నిశ్చయించుకొన్నారు. కనుక అతని శరీరాన్ని తమచేతితో నిమిరి. వాత్సల్యంతో ఆలింగనం చేసుకుని ఇలా అన్నారు: "శిష్యోత్తమా! నామధారకా! లే నాయనా! నీవిప్పుడు ఈ సంసారసాగారాన్ని దాటి పరమానందంలో నిమగ్నుడవయ్యావు". శ్రీగురులీలామృతం పానం చేసి శ్రీ గురుచరణకమల ధ్యానమనే సహజ సమాధిలో నిలిచిన నామధారకుడు ఆ తన్మయత్వంలోనే శ్రీ గురుణ్ణి ఇలా స్తుతిస్తున్నాడు :    


                      "స్వామీ !అచింత్యులైన మిమ్మెలా ధ్యానించేది? సర్వగతులైన మిమ్ము ఎక్కడికని ఆహ్వానించేది? ఈ విశ్వానికే ఆశ్రయమైన మీకు ఆసనం సమర్పించేదెలా? తీర్థక్షేత్రాలకే పవిత్రత చేకూర్చగల మీ  పాదపద్మాలను దేనితో కడిగేది? విశ్వకర్తవు, సర్వకర్తవూ అయిన మీ చేతులకు అర్ఘ్యం సమర్పించేది ఎలా? సప్త సముద్రాలనే  గాక ఈ విశ్వాన్నంతటినీ కడుపులో దాచుకున్న మీకు ఆచమనం నేనెలా సమర్పించగలను?  శుద్ధసత్వస్వరూపులైన మీ స్మరణయే లోకాలనూ పావనం చేస్తుంటే, మీకేమని స్నానం  చేయించేది?  ఆకాశమే శరీరంగా గల మీకు నేను సమర్పించదగిన వస్త్రమేమున్నది?  చతుర్ముఖుడైన బ్రహ్మదేవుణ్ణి  సృష్టించిన మీకు యజ్ఞసూత్రం వలన కలిగే లాభమేమున్నది? సర్వ జీవుల తాపాన్ని హరించగల మీకు గంధలేపనమేమి చేయగలదు? ఇచ్ఛలే లేని  మీకు ఏ పూలు సమర్పించి ప్రీతినొనర్చగలను? స్వయం సంతుష్టులు,  ఆత్మానంద స్వరూపులైన మీకు నేను సమర్పించదగిన ధూప మెక్కడున్నది?  స్వయం ప్రకాశకులు,  జ్ఞానజ్యోతి స్వరూపులైన మీకు నేను  దీపం  సమర్పించడమా? జగత్ పోషకులైన మీకు ఏమినైవేద్యం ఇవ్వగలను? నిత్యసుముకులైన మీకు తాంబూలం వలన ఏమి ప్రయోజనం?  నక్షత్రగ్రహగోళాదులే మీకు నిత్య నీరాజనాలిస్తూ, సర్వ జీవుల హృదయాలలోనూ,  మరియు విశ్వమందంతటా ప్రణవోచ్చారణ కొనసాగిస్తూ మీ మహిమను కీర్తిస్తుంటే మీకు నీరజనమెలా ఇవ్వాలో, మిమ్మెలా స్తుతించాలో  నాకు తెలియడంలేదు. సర్వగతులైన మీకు ప్రదక్షిణమెలా చేయాలి?  ఈనామ రూపాత్మకమైన విశ్వమంతా మీ పాదమే అయిఉండగా నేనెక్కడని నమస్కరించేది? నా లోపల,  వెలుపలా  నిండియున్న మీకు ఎచ్చటికని ఉద్వాసన చెప్పేది?" అంటున్నాడు.                                  


             అప్పుడు సిద్ధయోగి ఆనందంతో నవ్వుకుని "నాయనా! నీవిలా అంతర్ముఖుడవై  నిశ్చలసమాధిలో నిలిచిపోతే ఈ జగత్తును ఉద్ధరించేదెలా?  ప్రజలందరూ ఉద్ధరించబడాలన్నదే  శ్రీగురుని సంకల్పం. ఆయన చూపిన మార్గంలో పయనిస్తున్న మనకు, ఆయన అభీష్టం  నెరవేర్చడమే ప్రధాన కర్తవ్యం. నీవిలా కూర్చుండిపోతే అదెలా సంభవం? కనుక నీవు మేల్కొని  శ్రీగురుచరణాలను స్మరిస్తూ,  శాస్త్ర వాక్యాలను అనుసరిస్తూ ఈ ప్రపంచంలోనే జీవించాలి" అని చెప్పి,  అతనిని మేల్కొలిపారు. నామధారకుడు కన్నులు తెరచి సిద్ధమునిని  చూచి, "స్వామి! దయామయా! విశ్వాధారా ! ఈ సంసార సముద్రాన్ని భద్రంగా దాటించగల నౌకవంటివారు మీరు. నా పాలిటి శ్రీగురుడు మీరే!" అని,  ఆయనకు సవినయంగా నమస్కరించాడు. సిద్ధయోగి సంతోషించి, " నాయనా! శ్రీ గురు కథాశ్రవణమందు నీ కిట్టి శ్రద్ధ శాశ్వతంగా నిల్చుగాక !నీవు ఈ "గురుచరిత్ర" నిత్యపారాయణ చేస్తూ ఉంటే ఇహపరాలు రెండు సిద్ధిస్తాయి. ఒక శుభ ముహూర్తాన నీవు పారాయణ చేసే స్థలాన్ని శుద్ధిచేసి,  రంగవల్లులతో అలంకరించి,  అక్కడ కూర్చొని మొదట దేశ కాలాలను స్తుతించు. అటు తర్వాత శ్రీ గురునికి మానసోపచారపూజ చేయి. పారాయణ సమయంలో మౌనంపాటిస్తూ మనోవికారాలను శమింపజేసుకో. అప్పుడు దీపం పెట్టి గురువుకు,  పెద్దలకూ  మనసా నమస్కరించు. ఉత్తరదిక్కుగానో  లేక తూర్పు ముఖంగానో  కూర్చుని,  మొదటి రోజు 9 వ అధ్యాయము చివరి వరకు,  రెండవ రోజు పారాయణ 10వ  అధ్యాయం నుండి 21వ అధ్యాయం చివరి వరకు, మూడవ రోజున 29వ అధ్యాయం చివరి వరకూ,  నాల్గవ రోజున 35 వ అధ్యాయము చివరి వరకూ,  5వ రోజున 38 వ అధ్యాయము చివరి వరకూ, 6వ రోజున  43వ అధ్యాయం నుంచి చివరి వరకు,  చివరి రోజు, గ్రందాంతము  వరకు విద్యుక్తంగా నీవు గురుచరిత్ర పారాయణ చేయాలి. తర్వాత నైవేద్యం పెట్టి, అటు తర్వాత సాష్టాంగ నమస్కారం చేయాలి. సప్తాహ పారాయణం చేస్తున్నంత కాలం  భూమిపై నిద్రించడమే మంచిది. అది పూర్తయ్యాక యధాశక్తి బ్రాహ్మణులకు భోజనం పెట్టి,  దక్షిణ,  తాంబూలాలతో వాళ్లను సత్కరించాలి. ఇలా  నిర్దిష్టంగా శ్రీగురుచరిత్ర పారాయణ చేస్తే తప్పక గురుదర్శనమవుతుంది. ఇలా చేస్తే సాటివారందరూకూడా ఆ భగవంతుణ్ణి  సేవించుకోగల్గుతారు".


యాభై రెండవ అధ్యాయము సమాప్తము 

శ్రీ దత్తాయ గురవేనమః 

శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః   


*** బుధువారం పారాయణం సమాప్తము ***

No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box

నూతనయజ్ఞోపవీత ధారణ విధానము

  నూతనయజ్ఞోపవీత ధారణ విధానము జంధ్యాల పౌర్ణమి శ్రావణ పౌర్ణమి నాడు వస్తుంది. ఈ రోజు జీర్ణమైన (పాత) జంధ్యమును తీసివేసి కొత్త జంధ్యమును (యజ్ఞోప...