Wednesday, June 3, 2020

గురు చరిత్ర అధ్యాయము -43


అధ్యాయము  -43




                               
శ్రీ గణేశాయనమః                             

శ్రీ సరస్వత్యేనమః                                                                                                  

శ్రీ గురుభ్యోనమః 



కథారంభము 


                           శ్రీ గురుడు సాయందేవునితో చెప్పిన ఆ వ్రత విధానం సిద్ధయోగి ఇలా తెలిపారు: "ఈ  అనంతవ్రతము ఆచరించడంవలన ఎందరికో అభీష్టాలు సిద్దించాయి.  దీనివలన ధర్మరాజు,  తాను కోల్పోయిన రాజ్యమంతా  తిరిగి పొందగలిగాడు. పాండుపుత్రుడైన ధర్మరాజు కపట జూదంలో ఓడిపోయి,  తన తమ్ములను,  ద్రౌపదినీ  తీసుకొని,  ఘోరమైన అడవి ప్రాంతాలకు వెళ్లి,  ఎన్నో కష్టాలు అనుభవించాడు. అయినప్పటికీ వారంతా శ్రీకృష్ణుడే తమకు గతియని దృఢంగా విశ్వసించారు. దుర్యోధనుడు మొదలైనవారు వాళ్ళ రాజ్యమపహరించి, పరాభవించి, అడవులకు పంపడమే కాకుండా వారిని యింకెన్నోరీతుల కష్టపెట్టారు. వారు కడుపునిండా భోజనమైనా లేక భాదపడుతుంటే,  వారిపుణ్యం కూడా నశింపజేయమని దూర్వాస  మహర్షిని పురిగొల్పి  వారిపైకి పంపారు. అప్పుడు ధర్మాత్ములైన పాండవులపై దయతో శ్రీకృష్ణుడు వారివద్దకు వెళ్ళాడు. పాండవులు అతనిని పూజించి,  'స్వామీ,  నీవు భూభారం  తొలగించడానికే అవతరించావు.  మేము మీకు ప్రాణసమానులమైనప్పటికీ ఈ అడవిలో దాగియుండవలసి వచ్చినదేమిటి? నీవే ఉపేక్షిస్తే,  మాకింక దిక్కెవరు?' అని బాధపడ్డారు. ద్రౌపదికూడా తమకు కష్టాలు తీరే ఉపాయం చెప్పమన్నది.శ్రీకృష్ణుడు వారిని కరుణించి ఇలా చెప్పాడు: 'నేనే అనంతుడను, సర్వవ్యాపిని,  త్రిమూర్తులు,  చతుర్దశ భువనాలు ఆకాశంవలె అనంతుడనైన నాయందు వున్నాయి.అట్టి  సర్వాంతర్యామిగ,  అనంతుడుగానున్న నన్ను గుర్తించి నిష్టగా వ్రతం చేసుకుంటే మీ అభీష్టాలన్నీ నెరవేరుతాయి. మీ కష్టాలు తీరుతాయి.                                       

                    ఈ అనంత వ్రతం,  భాద్రపద శుద్ధ చతుర్దశినాడు మధ్యాహ్నం సమయంలో భక్తితో ఆచరిస్తే మీ రాజ్యం మీకు లభించగలదు. పూర్వం కృతయుగంలో వశిష్ట గోత్రానికి చెందిన సుమంతుడు అనే ఋషి ఉండేవాడు. అతనికి సుశీల అనే కూతురు ఉండేది. ఆమె జన్మించిన కొద్ది కాలానికే అతని భార్య దీక్షాదేవి చనిపోయింది. సుశీల తండ్రివద్దనే  పెరుగుతూ భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తుండేది. సుమంతుడు తన కర్మానుష్టానానికి భంగమురాకుండా ఉండేందుకు రెండవ వివాహము చేసుకున్నాడు. కాని, ఆమె గయ్యాళి.  ఎప్పుడూ  భర్తతోనూ,  సవతి కూతురుతోనూ పోట్లాడుతుండేది. కొంతకాలానికి సుమంతుడు తన కుమార్తెను వేదశాస్త్ర పారంగతుడైన  కౌండిన్యునికి  ఇచ్చి వివాహం చేశాడు. కానీ అతని భార్య పెట్టే బాధలకు ఓర్వ లేక,  కౌండిన్యుడు వేరొకచోట కుటీరంలో కాపురం ఉండ తలచాడు. అయినా కూతురు కాపురానికి వెళ్లేరోజు కూడా దోవ బత్తేనికి కించిత్తు  పేలపిండి అయినా ఇవ్వడానికి ఆమె అంగీకరించలేదు. ఎలాగో ఆమె చూడకుండా సుమంతుడు కొద్దీ గోధుమపిండి మాత్రం ఒక ఆకులోకట్టి  ఇచ్చి వారిని సాగనంపాడు. మరుసటి రోజు మధ్యాహ్నము ఒక ఏటివద్ద ఆగి, కౌండిన్యుడు స్నాన సంధ్యాదులు గావించుకొన్నాడు.  అక్కడ కొందరు స్త్రీలు ఎర్రని చీరలు  కట్టుకొని, కలశాలు పెట్టి పూజిస్తుంటే సుశీలాదేవి విచారించగా,  తాము  అనంత వ్రతము చేస్తున్నట్లు చెప్పారు. ఆమె కోరిక మీదట ఒక ముత్తైదువ ఆ వ్రతవిధానము ఇలా చెప్పింది:                            


                                'ప్రతి భాద్రపద శుక్ల చతుర్దశినాడు 14 ముడులు వేసిన ఎర్రని తోరము సిద్ధము చేసుకొని,  ప్రవహించే నీటిలో స్నానం చేసి, ఎర్రని చీర కట్టుకొని,  ఆకులతో ఒక కలశం స్థాపించాలి. ఒక క్రొత్త వస్త్రం మీద గంధంతో అష్టదళ పద్మము గీచి,  దానిపైన దర్భలతో చేసిన సర్పాకృతినుంచి,  శేషశాయియైన చతుర్భుజుని  ద్వాదశాక్షరీ మంత్రంతో గాని,  పురుషసూక్త విధానంతోగాని,  యథాశక్తి పూజించాలి. తర్వాత ఆ తోరము కుడిచేతికి కట్టుకొని, పాతతోరము విసర్జించాలి. తరువాత గోధుమపిండివంట నివేదించి,  దక్షిణతో సహా ఒకవేదవిప్రునికి దానమియ్యాలి. తరువాత యధాశక్తి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. ఇలా 14 సంవత్సరాలు చేశాక 14 కుండలు  దానమిస్తే అన్ని పురుషార్థాలు సిద్ధిస్తాయి. ఇలా చెప్పి,  ఆ ముత్తైదువ సుశీలాదేవి చేత గూడా అనంతవ్రతం చేయించింది. తరువాత ఆమె తన భర్తతో కలసి బయలుదేరింది. ఆ వ్రతమహిమా  అన్నట్లు దారిలో ఒక పట్టణంలోని పౌరులు ఆ దంపతులకు ఎదురొచ్చి,  వారినక్కడే ఉండమని ప్రార్థించారు. అక్కడ కొంతకాలం కౌండిన్యుడు శ్రీమంతుడై సుఖంగా  నివశించాడు.           


                       ఒకరోజున కౌండిన్యుడు తన భార్య చేతికున్న తోరము చూచి, 'ఇదేమిటి?  నన్ను వశం చేసుకోవడానికి ఈ ఎర్రని తోరం ధరించావా  ఏమి?  అని అడిగాడు. అది అనంత తోరమని, దాని మహిమ వల్లనే  తమకు సిరిసంపదలు వచ్చాయనీ  ఆమె చెప్పినా నమ్మక,  అతడు దానిని త్రెంచి నిప్పులో పడేసాడు. కొద్దికాలంలో వారింట దొంగలు పడి సర్వమూ  దోచుకుపోయారు. అప్పుడు కౌండిన్యుడు తనతప్పిదము  గుర్తించి,  ఎలాగైనా అనంతుని దర్శించి,  ఆయనను శరణు పొందనిదే భోజనమైనా చేయనని శపథము చేసి, "అనంతా! అనంతా!" అని  కేకలు వేస్తూ ఒక అడవిలో వెతకసాగాడు. దారిలో ఒక చోట పూత, కాయలు కాయని ఒక పెద్ద మామిడి చెట్టు చూచాడు. అదేమీ చిత్రమో గాని, దాని మీద ఒక్క పక్షైనా వాలలేదు. కౌండిన్యుడు, 'అనంతుడు ఎక్కడ?' అని అడుగగా,  ఆ చెట్టు, 'నాకే ఆయన దర్శనం లభించలేదు!' అని చెప్పి,  'నీకు కనిపిస్తే, నా  దుస్థితి గురించి ఆయనకు నివేదించు' అని చెప్పింది. ఆ ముని  మరోకచోట ఒక గడ్డి పరాకైనా కొరకని ఆవును,  దూడను చూచి వాటిని అడిగాడు. అవి కూడా అలానే చెప్పాయి. మరోక చోట అటువంటి అంబోతే  కనిపించి అలానే చెప్పింది.ఇంకొంత దూరం వెళ్ళాక కౌండిన్యునికి రెండు కొలనులు  కనిపించాయి. ఒక దానిలోని నీరు మరొక దానిలోకి ప్రవహిస్తున్నది. వాటి దగ్గర ఎక్కడా ఒక్క కొంగైనా వాలడంలేదు. అవి కూడా అనంతుని  గురించి అతనికి అలానే చెప్పాయి. తర్వాత ఒక  గాడిద, ఒక ఏనుగు  కనిపించి,అనంతుడు తమకేక్కడా కనిపించలేదన్నాయి.


                    చివరకు అలసిపోయిన కౌండిన్యుడు ఒకచోట కూలబడ్డాడు. అప్పుడొక ముసలివాడు అతనిని చేయిపట్టి లేవదీసి, 'అనంతుని చూపిస్తాను రమ్మని ', ఒక అందమైన పట్టణంలోని రాజ భవనంలో సింహాసనం పైనున్న ఒక సుందర విగ్రహుని చూపించాడు. కౌండిన్యుడు, అతడే అనంతుడని తలచి అతనిని స్తుతించి, నమస్కరించాడు. అప్పుడు అనంతుడు అతనికి నాలుగు పురుషార్థాలు,  శాశ్వత వైకుంఠ నివాసమూ వరంగా ప్రసాదించాడు.                         


                       అప్పుడు కౌండిన్యుడు,  తాను అడవిలో చూసిన వింతలన్నింటినీ ఆయనకు చెప్పాడు. అనంతుడిలా  చెప్పాడు: 'పూర్వము ఒక విప్రుడు విద్వాంసుడై  కూడా ఎవరికీ విద్య నేర్పకుండా,  తన కాలమంతా శాస్త్ర వాదాలతోనే గడిపాడు. అందుకతడు మరుజన్మలో ఆ వ్యర్థమైన మామిడి చెట్టై అడవిపాలయ్యాడు. చవిటినేలను దానమిచ్చిన వాడు మరుజన్మలో మేతమేయని పశువయ్యాడు. శ్రీమంతులై  గూడా కొంచమైనా దానము  చేయనివాడు నీవు చూచిన ఆబోతుగా జన్మించాడు. ఒకరికొకరు దానమిచ్చి పుచ్చుకున్న అక్కచెల్లెళ్లే  నీవు చూసిన ఆ రెండు చెరువులు. క్రోధము వహించినవాడు గాడిదగాను,  మదించి  విచ్చలవిడిగా ప్రవర్తించినవాడు ఏనుగుగానూ  జన్మించారు. నీవు పశ్చాత్తాపంతో పరిశుద్ధుడయ్యావు  గనుకే  ఆ వృద్ధుడి  రూపంలో నేనే నీకు దర్శనమిచ్చాను.  అవన్నీ పశ్చాత్తాపంతో తమ దుస్థితి  నీతో చెప్పుకొని నాకు తెల్పమని  నిన్ను కోరినాయి గనుకనే వాటన్నింటికీ ముక్తి కలిగింది. నీవు పునర్వసు నక్షత్రమై శాశ్వతంగా ఆకాశంలో నిలుస్తావు' అని అనంతుడు ఆశీర్వదించి పంపాడు. అప్పటినుంచి సుశీలాదేవి,  కౌండిన్యుడు సుఖంగా జీవించి  తర్వాత వైకుంఠానికి వెళ్లారు".            


                    శ్రీకృష్ణుడు చెప్పిన ఈ కథ విని,  పాండవులు అనంతవ్రతం  ఆచరించి, అనంతుని కృపవలన యుద్ధంలో శత్రువులను ఓడించి,  మరలా రాజ్యం సంపాదించుకోగలిగారు. నమ్మి  ఈ వ్రతం ఆచరించి సత్పలితము పొందనవారే లేరు. కనుక సాయందేవా! నీవుకూడా నీ గోత్ర ఋషియైన కౌండిన్యునివలె ఆ వ్రతం ఆచరించు. ముందు ముందు నాగనాథుడు,  అతని సంతతివారు నిష్టతో ఈ వ్రతం ఆచరించి,  శ్రీ గురుని పూజించి, అచ్చటి  బ్రాహ్మణులకు,  సన్యాసులకూ  సంతర్పణ చేశారు. తరువాత అతడు తన భార్యాబిడ్డలను ఇంటివద్ద దించివచ్చి,  తన జీవిత శేషమంతా గురు సేవలోనే గడిపి తరించాడు. అందువల్లనే నీకీనాడు కల్పవృక్షం వంటి 'శ్రీగురుచరిత్ర' లభించింది. అతడి వంశంలో జన్మించినందుకు నీవెంతో  ధన్యుడవు". 


నలభై మూడవ అధ్యాయం సమాప్తము 

శ్రీ దత్తాయ గురవేనమః 

శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః   


**మంగళవారము పారాయణం సమాప్తము**

No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box

నూతనయజ్ఞోపవీత ధారణ విధానము

  నూతనయజ్ఞోపవీత ధారణ విధానము జంధ్యాల పౌర్ణమి శ్రావణ పౌర్ణమి నాడు వస్తుంది. ఈ రోజు జీర్ణమైన (పాత) జంధ్యమును తీసివేసి కొత్త జంధ్యమును (యజ్ఞోప...