Thursday, June 11, 2020

గురు చరిత్ర అధ్యాయము -51


అధ్యాయము  -51




                               
శ్రీ గణేశాయనమః
                             
శ్రీ సరస్వత్యేనమః
                                                                                                  
శ్రీ గురుభ్యోనమః 



కథారంభము 


                               నామధారకుడు,  "స్వామీ! శ్రీగురుడు వైడూర్యనగరం నుండి బయలుదేరి వెళ్లి గౌతమీ పుష్కరయాత్ర పూర్తిచేసుకుని, తిరిగి గంధర్వపురం చేరాక ఏమి చేశారో సెలవియ్యండి" అన్నాడు. సిద్ధయోగి ఇలా చెప్పారు: "శ్రీగురుడు కొంతకాలం గంధర్వ నగరంలోనే ఉన్నారు. అది ఈశ్వరనామ సంవత్సరం. అప్పుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నాడు. ఒకనాడు ఆయన భక్తులందరితో, తాము శ్రీశైల యాత్రకు బయల్దేరుతున్నామని చెప్పారు. అది తెలిసి గ్రామస్తులందరూ గూడా మఠం  వద్దకు చేరుకున్నారు. వాళ్ళందరూ కన్నీరు కారుస్తూ శ్రీగురుని తో ఇలా అన్నారు : 'స్వామీ ! మీరిప్పుడు శ్రీశైల యాత్రకు వెళ్ళ వలసిన అవసరం ఏమిటి? తాము తమ అవతారకార్యం పరిసమాప్తి చేయదలచినట్లు మాకు తోస్తున్నది. ఇంతకాలము మీ అనుగ్రహంతో మా కష్టాలు, అభీష్టాలు తీర్చుకుంటున్నాము. మీరీ  గ్రామంలో విజయం చేయడం వలన ఈ గంధర్వపురం భూలోక వైకుంఠం అనదగిన మహా పుణ్యక్షేత్రంగా రూపొందింది. నిజానికి మీరు మా అందరికీ కులదేవతగా నిలిచారు. మేము అజ్ఞులము, దీనులము మాకు మీరుతప్ప వేరు దిక్కులేదు. మమ్మల్ని విడిచి పెట్టిపోవడం మీకు న్యాయమేనా? ఏ తల్లి అయినా తన బిడ్డలను ఇలా విడిచి వెళ్లిపోతుందా? ఎప్పుడూ వారి చెంతనే ఉండి వాళ్ళను సాకడం ఆమె ధర్మంకాదా?' అన్నారు.                        


                    శ్రీ నృసింహసరస్వతీస్వామి, వాళ్ల భక్తికి కరిగిపోయి, చిరునవ్వుతో ప్రేమగా ఇలా అనునయించారు: ' బిడ్డలారా! మాపై ఇంత భక్తితో మెలిగే మిమ్మల్ని విడచి మేము మాత్రం పోగలమా? నిజానికి మేము ఎల్లప్పుడూ ఈ గంధర్వ నగరంలోనే ఉంటాము. నిత్యమూ ఈ సంగమంలో స్నానము, నిత్యకృత్యములు తీర్చుకొని, మధ్యాహ్న సమయంలో ఈ గ్రామంలో భిక్ష చేసుకుంటూ ఈ మఠంలోనే మీ సేవలందుకుంటూ గుప్తంగా ఉంటాము. కేవలం లౌకికుల స్థూలదృష్టికి మాత్రమే మేము శ్రీశైలం వెళ్లినట్లు, ఇక్కడ లేనట్లు కనిపిస్తాముగాని నిజానికి మా ప్రతిరూపాలుగా ఇక్కడ ప్రతిష్టిస్తున్న మా పాదుకల రూపంలో ఇక్కడే ఉంటాము. ఇది ముమ్మాటికి నిజము, ఎట్టి సందేహమూ లేదు. మా భక్తులకు మేము ప్రత్యక్షము కానిదెప్పుడూ? ఈ గంధర్వపురంలో భక్తుల యోగక్షేమాలు కనిపెట్టి వుండే మమ్మల్ని సేవించేవాడు కోరినది ఏది లభించదు? మీరందరూ నిత్యము ఈ సంగమంలో స్నానం చేసి సాక్షాత్తూ కల్పవృక్షమైన ఈ అశ్వత్థవృక్షానికి ప్రదక్షిణంచేసి, అనర్థాలన్నింటినీ  తొలగించగల ఇచ్చటి పాదుకలను అర్చిస్తుంటే సర్వభ్రమలూ తొలగి, సాక్షాత్తూ ఆనందమే సిద్ధిస్తుంది. ఎలాంటి చింతలు గలవారికి అయినా ఇచ్చటి చింతామణి అనబడు విగ్నేశ్వరుని ఆరాధించడం వలన సర్వ విఘ్నాలూ  నశిస్తాయి. భక్తిశ్రద్ధలతో ఈ అష్ట తీర్ధాలలో స్నానం చేసేవారికి సర్వ సిద్ధులూ  సమకూరి, ముక్తిగూడా లభిస్తుంది. మూడు కాలాలలోనూ ఈ మఠంలోని మా పాదుకలను పూజించి, నీరాజనం ఇచ్చి, నిర్మలమైన మనస్సుతో మమ్మల్ని స్మరిస్తే కోరినది తప్పక నెరవేరుతుంది. ఇకముందు పవిత్రమైన ఈ దేశం మ్లేచ్చులైన యవనులకు అధీనం అవుతుంది. వాళ్లు కూడా ఇక్కడకు వస్తారు. వారు వస్తే ఇక్కడ భక్తులకు కష్టం కలుగుతుంది. మేము ఇక్కడ లేమని వాళ్ళు అనుకోగలందుకు స్థూలదృష్టికి శ్రీశైలం వెళ్లిపోయినట్లు కనిపిస్తాము గాని, అదృశ్యంగా ఇక్కడే భక్తులకు నిత్య ప్రసన్నులమై శాశ్వతంగా ఉంటాము' అని చెప్పి, ఆయన తమ పాదుకలు మఠంలో విడిచిపెట్టారు. వెంటనే ఆయన మఠం నుండి బయటకువచ్చి, సాయందేవుణ్ణి, నందిశర్మను, నరహరి కవినీ, నన్నూ కూడా తీసుకొని శ్రీశైలానికి బయలుదేరారు. కొందరు శిష్యులు గంధర్వపురంలో ఉండి పోయారు. శ్రీ గురుని  వద్ద సన్యాస దీక్ష తీసుకున్న కృష్ణసరస్వతి, బాల సరస్వతి, ఉపేంద్ర సరస్వతి, మాధవ సరస్వతి మొదలైనవారు అంతకుముందే శ్రీగురుని ఆజ్ఞమేరకు తీర్థయాత్రలకు వెళ్లిపోయారు. స్థానిక భక్తులు, మా ఐదుగుర్ని ఊరి పొలిమేర వరకు వచ్చి సాగనంపి, చేతులు జోడించి శ్రీవారి దివ్యరూపం కనుమరుగు అయ్యేవరకు చూస్తూ నిలబడి, అటు తర్వాత వారి పాదాలను ధ్యానిస్తూ తిరిగి వెళ్ళిపోయారు.                      


                               అటు తర్వాత జరిగినది చెబుతాను విను : వెనుక శ్రీ గురుడు వైద్యనాథ క్షేత్రం నుండి బయలుదేరినప్పుడు, వారివద్ద సెలవు తీసుకుని తీర్థయాత్రలకు బయల్దేరిన శిష్యులు, వైఢూర్యనగరాన్ని పరిపాలించిన యవనరాజు, శ్రీగురుని ఆజ్ఞానుసారం కొంతకాలం ముందే శ్రీశైలం చేరి, అక్కడ వారి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. బహుధాన్య నామ సంవత్సరంలో ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది. కుంభరాశిలోకి సూర్యుడు, కన్యారాశిలోకి బృహస్పతి ప్రవేశించారు. అది శిశిర ఋతువు. మాఘమాసము, కృష్ణపక్షము, ప్రతిపద( పాడ్యమి) శుక్రవారం నాడుశ్రీ గురుడు శిష్యులమైన మా నలుగురితో కలిసి శ్రీశైలం వద్దనున్న పాతాళగంగకు చేరారు. అక్కడ ఆయన స్నానం చేసి ఒక పుష్పాసనం సిద్ధం చేయమని మమ్మల్ని ఆజ్ఞాపించారు. మేమంతా త్వరత్వరగా పూలు సమృద్ధిగా సేకరించి, వాటిని అరటి ఆకులపై అమర్చి ఒక పూలనావ సిద్ధంచేశాము. అప్పుడు శ్రీగురుడు దానిని నది నీటిపై,  ఉంచమని ఆదేశిస్తే మేమలానే చేసాము. అప్పుడాయన, 'మేము ఈ పూలనావలో ఈ పాతాళగంగ దాటి శ్రీశైలంచేరి, అక్కడ మల్లికార్జునునితో ఐక్యం చెందుతాము. మీరందరూ వెనక్కు తిరిగి గంధర్వపురం వెళ్లిపోండి' అని చెప్పారు. కానీ మేము నివ్వెరబోయాము.          


                             ఆకస్మికమైన వారి ఆజ్ఞకు కృంగిపోయి కన్నీరు కారుస్తూ అలానే ఉండిపోయాము. ఆయన మమ్మల్ని ఓదారుస్తూ ఇలా అన్నారు : ' ప్రియ శిష్యులారా ! మీరిలా దిగులుపడకూడదు. మీరు గంధర్వపురం వెళ్ళండి. మీకు ఎల్లప్పుడూ అక్కడ మా దర్శనం లభిస్తుంది. భక్తిలేనివారికి కన్పించక, భక్తులకు మాత్రమే దర్శనమివ్వదలచి మేమక్కడే గుప్తరూపంలో ఉంటాము. మమ్మల్నే  నమ్ముకొని కొలిచే భక్తుల ఇళ్ళలో మేము ప్రత్యక్షంగా ఉంటాము'. పుష్యమీ నక్షత్రంతో కూడిన ఆ శుక్రవారంనాడు, ఆ శుభసమయంలో శ్రీగురుడు ఆ పూలనావమీద కూర్చొని నది మధ్యకు సాగిపోతూ, బొడ్డున నిలిచిన మా అందరితో చివరిమాటగా ఇలా చెప్పారు-                

                'నాయనలారా! మీకు సర్వశుభాలూ ప్రాప్తించుగాక! నలుగురు ఒక్కచోట చేరి మా చరిత్ర పారాయణ చేసేవారు, అందులోని స్తోత్రాలు పఠించేవారు, నామ సంకీర్తన చేసేవారు మా ప్రీతికి పాత్రులవుతారు. మా కథామృత గానం చేసేవారింట్లో నాలుగు పురుషార్ధాలు, సిద్ధులూ నిత్యనివాసం చేస్తాయి, జీవితాంతము అష్టైశ్వర్యాలు, అటుతర్వాత ముక్తి సిద్ధిస్తాయి. మేము ఆనంద నిలయానికి వెళుతున్నాము. మేమచటికి చేరగానే అందుకు గుర్తుగా మీవద్దకు నాలుగు తామరపువ్వులు ఈ నదిలో కొట్టుకొని వస్తాయి. మీరు నలుగురూ వాటిని ప్రసాదంగా తీసుకోండి. మీరు వాటిని ప్రాణంకంటే ఎక్కువ విలువైనవిగా భద్రపరుచుకుని పూజించుకోవాలి. ఇది మా ప్రమాణం. దీనిని సంశయించరాదు' అన్నారు. ఆ నావ ముందుకు సాగి కొద్దిసేపట్లో కనుచూపుమేర దాటిపోయింది. అయినా తాము ధరించిన కాషాయవస్త్రంతో తమ తలనుకూడా కప్పుకున్న వారి రూపం దివ్య తేజస్సుతో మా హృదయాలలో అలా నిలిచిపోయింది.               


                                         ఇలా శ్రీ గురుడు తమ  అంతిమ సందేశమిచ్చి ఆ పూలనావలో  కొంత దూరం వెళ్లి, అకస్మాత్తుగా అంతర్హితులయ్యారు. అంతలోనే ఆ పుష్పాసనంగాని, స్వామిగాని కనిపించకపోయేసరికి మేమందరమూ కన్నీరు కారుస్తూ ఆ శూన్య ప్రదేశంకేసి చూస్తూ ఉండిపోయాము. కొద్దిసేపటికి నదికి  అవతలి ఒడ్డునుండి ఒక పడవ లో వచ్చిన కొందరు బెస్తవాళ్ళు మా వద్దకువచ్చి, ' అయ్యా! ఒక స్వామి తూర్పు ఒడ్డుకు వెళ్తుంటే మేము చూసాము. వారి కాళ్లకు బంగారు పాదుకలున్నాయి. వారు కాషాయ వస్త్రము, చేతిలో దండము ధరించిఉన్నారు. ఆయన మాతో, ' మీరు వెళ్లి మా శిష్యులతో మేము మీకు ఎదురైనట్లు చెప్పండి. నాలుగు పువ్వులు నదీజలాలపై కొట్టుకొని వారి వద్దకువస్తాయి. అవి తీసి వారికి ఇవ్వండి. మా పేరు నరసింహసరస్వతి. మేము స్థూలరూపంతో కదలీవనం వెడుతున్నాము. కానీ, గుప్తరూపంలో ఎప్పటికీ గానుగాపురంలోనేఉంటాము. అక్కడే ఎల్లప్పుడూ మా సేవలో నిమగ్నమై ఉండమని చెప్పండి' అని చెప్పారట. వాళ్లు ఆ విషయం మాతో చెబుతుండగానే నాలుగు తామరపువ్వులు నదిలో కొట్టుకు వస్తున్నాయి. శ్రీగురుని ఆదేశం ప్రకారం ఆ బెస్తవారు వాటిని చూడగానే నదిలోకి దూకి ఈదుకుంటూపోయి,  ఆ నాలుగు పువ్వులనూ తెచ్చి ఇచ్చారు. వారినుండి ఆ పువ్వుల ను అందుకుని, సాయందేవుడు మా అందరికీ తలా ఒకటి ఇచ్చాడు. అవి తీసుకొని మేము శ్రీగురుని స్మరించుకుంటూ గంధర్వనగరంలోని మఠం చేరుకున్నాము.             


                      శ్రీ గురుడు అక్కడ నుండి బయలుదేరి వెళ్లినప్పుడు, మమ్మల్ని సాగనంపిన గ్రామస్తులందరూ దిగులుగా ఆయన కనుమరుగయ్యే వరకు చూచి శ్రీ గురుని  గురించి మాట్లాడుకుంటూ మఠం  చేరుకొని, అక్కడ కూర్చున్నారు. ఇంతలో అకస్మాత్తుగా అక్కడ శ్రీ నృసింహసరస్వతీస్వామి యథాపూర్వం తమస్థానంలో కూర్చొని కనిపించారు! ఆయనను చూచి అందరూ ఆశ్చర్యచకితులై నమస్కరించి లేచేసరికి వారి రూపం అదృశ్యమైంది. అంతటితో గ్రామస్థుల సంశయాలన్నీ మటుమాయమై, ఆ అవతారమూర్తి సామాన్య మానవులని తలచడం ఎంతటి అపచారమో వారికి అర్థమైంది. అందరూ ఆ సర్వగతునికి సాష్టాంగ నమస్కారం చేసికొని తమ ఇళ్లకు వెళ్లిపోయారు. "    


                  అప్పుడు నామధారకుడు, "స్వామీ! ఆ పువ్వులు ప్రసాదంగా పొందిన మహాత్ములెవరు?" అని అడిగాడు. సిద్ధయోగి, "స్వామికి శిష్యులుఎందరో ఉండేవారు. వారిలో బాలసరస్వతి, కృష్ణ సరస్వతి, మాధవ సరస్వతి, ఉపేంద్ర సరస్వతి ముఖ్యమైనవారు. వీరేగాక, ఆ శ్రీశైలయాత్రా  సమయంలో సాయందేవుడు, నందిశర్మ, నరహరి, నేను మాత్రమే స్వామిని అనుసరించాము. ఆ పువ్వులు ప్రసాదంగా లభించినవి మాకే. నాకు దొరికిన ప్రసాదమిదిగో చూడు! దీనిని భద్రంగా ఉంచుకుని, మనస్సును నిశ్చలంగా గురు పాదాలపై నిలుపుకున్నాను. అందుకు సాధనంగా ఈ 'గురుచరిత్ర' కూర్చాను. అంతేగాని గురు మహిమను పూర్తిగా వివరించడము మహామహితాత్ములకు మాత్రమే సాధ్యమవుతుంది. ఇది ఇహంలో పురుషార్థాలను, అటు తర్వాత పరమార్థాన్ని ప్రసాదిస్తుంది. దీని పారాయణ వలన సుఖము, పవిత్రత, శాంతి కలుగుతాయి; పాపాలు, రోగాలు నశిస్తాయి" అన్నారు. 

                             
యాభైఒకటవ అధ్యాయం సమాప్తం

శ్రీ దత్తాయ గురవేనమః 

శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః   

No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box

నూతనయజ్ఞోపవీత ధారణ విధానము

  నూతనయజ్ఞోపవీత ధారణ విధానము జంధ్యాల పౌర్ణమి శ్రావణ పౌర్ణమి నాడు వస్తుంది. ఈ రోజు జీర్ణమైన (పాత) జంధ్యమును తీసివేసి కొత్త జంధ్యమును (యజ్ఞోప...