Friday, June 5, 2020

గురు చరిత్ర అధ్యాయము -47


అధ్యాయము  -47




                               
శ్రీ గణేశాయనమః  
                           
శ్రీ సరస్వత్యేనమః
                                                                                                  
శ్రీ గురుభ్యోనమః 



కథారంభము 



                                నామధారకుడు కోరిన ప్రకారం అటుపై కథ సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పసాగాడు: " నీవు ఎంతో అదృష్టవంతుడివి కనుకనే ఈ కథ పట్ల ఇంత శ్రద్ధాసక్తులు కలిగాయి. ఈ కథ వినడం వలన పతితులు గూడా పావనులవుతారు. ఒకప్పుడు దీపావళి పండుగకు ముందు ఏడుగురు సన్నిహిత భక్తులు,  స్వామిని దీపావళికి  ముందు వచ్చే ధన త్రయోదశి  పర్వదినాన తమ తమ ఇళ్ళకు ఆహ్వానించాలని గానుగాపురం వచ్చారు. ఆ ఏడుగురు ఆ చుట్టు పక్కలనున్న 7 గ్రామాలకు పెద్దలు. వారి ప్రార్థన విని స్వామి, 'ఒకేరోజు ఒకే సమయంలో మీరందరూ ఆహ్వానిస్తే మేము అదే రోజు అందరి ఇళ్లకు రావడం ఎలా సాధ్యం? అలా అని మీలో ఎవరి కోరికను మేము కాదనలేము. కనుక మీలో మీరు సంప్రదించుకొని ఒక నిశ్చయానికి వచ్చి, ఎవరింటికి రమ్మంటే అక్కడకు రాగలము' అన్నారు. అప్పుడు ఆ ఏడుగురు, స్వామి తమ ఇంటికి రావాలంటే, తమ ఇంటికి రావాలని వాదించుకోసాగారు. వారు ఎంతకు ఒక నిశ్చయానికి రాలేక పోయేసరికి స్వామి నవ్వుతూ, 'మీరు వాదించు కోవడం ఎందుకు? మీ అందరికీ మా పై విశ్వాసం ఉన్నది గనుక, ఆ విషయం మా ఇష్టానికే విడిచిపెట్టండి. ఆ రోజు మాకు తోచిన చోటికి మేము వస్తాము' అన్నారు. అప్పుడా భక్తులు నమస్కరించి, 'స్వామీ! మా శక్తి సామర్థ్యాలు, స్థితిగతులు ఎంచక, మా అందరినీ సమానంగా మన్నించండి' అన్నారు! కాని, స్వామి వారిలో ఎవరి ఇంటికి రాకపోతే వారు నదిలో దూకి ప్రాణాలు విడుస్తామని శపథం చేశారు. వారిలో పేదవారు, 'అయ్యా! మేము పేదవాళ్లం అని మమ్ము ఉపేక్షించిచవద్దు. అలనాడు శ్రీకృష్ణుణ్ణి రారాజైన దుర్యోధనుడు ఆహ్వానించినా, అతని పదవినెంచక, తననే  నమ్ముకున్న నిరుపేద అయిన విదురుని ఇంటికే ఆ భగవంతుడు అతిథిగా వెళ్ళాడు కదా! అలానే మీరు కూడా మా ప్రార్థనను త్రోసిపుచ్చివద్దు!' అని ఎవరికి వారే వేడుకున్నారు. అప్పుడు స్వామి, 'మీరు మీ ఇళ్లకి వెళ్ళండి. ఆనాడు మాకై  మేమే రాగలం, సందేహించవద్దు!' అని వాగ్దానం చేశారు.


                        ఆయన ఎవరి ఆహ్వానాన్ని,  మన్నిస్తారోనన్న సందేహంతో ఆ ఏడుగురు అలాగే నిలబడి పోయారు. అప్పుడాయన ఒక్కొక్కరినే ప్రక్కకు పిలిచి, 'మేము మీ గ్రామానికే వస్తాము. కానీ ఈ మాట ఇంక ఎవరికీ చెప్పవద్దు!' అని రహస్యంగా చెప్పారు. అప్పుడు వాళ్ళు ఎవరికి వారే-స్వామి తన ఇంటికే రాగలరని తలచి, ఇతరులకు ఏమీ చెప్పకుండా స్వామి వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. కాని స్వామి ఆ పండుగనాడు ఏ ఊరో  వెళ్తారని అచ్చటి వారందరికీ తెలిసిపోయింది. గంధర్వపురవాసులు వెంటనే వారి వద్దకు వచ్చి, ఆ పర్వదినాన తమను విడిచి ఎక్కడికీ  వెళ్ళవద్దని బ్రతిమాలుకున్నారు. వారితో స్వామి, 'మేమానాడు ఇక్కడనే ఉంటాము, ఎక్కడకూ  వెళ్ళము' అని మాటఇచ్చి అందరినీ ఊరడించారు.   


                                 చివరకు ధనత్రయోదశి రానే వచ్చింది. ఆ రోజుకు ఆ ఏడు గ్రామాల పెద్దలూ, శ్రీ గురుడు తప్పక తమ ఇంటికే  రాగలరని తలచి ఎవరికి వారు ఎంతో వైభవంగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఆయా గ్రామస్తులు కూడా స్వామికి ఘనస్వాగతము, పూజలకు సిద్ధమయ్యారు. కానీ గంధర్వపురంలోని శ్రీగురుడు  ఆ గ్రామం విడిచి ఎక్కడకూ  వెళ్లక మఠంలోనే ఉండిపోయారు. ఆనాటి సాయంత్రం మంగళ స్నానం చేసే సమయంలో. శ్రీ గురుడు ఏడు రూపాలలో ఆ ఏడు గ్రామాలకు వెళ్లారు! అయినప్పటికీ ఎనిమిదవ రూపంతో గంధర్వపురంలోని తమ మఠంలోనే ఉండి, అచ్చటి వారి పూజలు అందుకున్నారు. కొద్ది రోజులు, ఆయన ఒక గ్రామానికి వెళ్లినా సంగతి మరొక గ్రామానికి పొక్కకుండా ఉండిపోయింది. అయినప్పటికీ ఆ కార్తీకమాసంలో త్రిపురోత్సవానికి స్వామికి కార్తీక పూర్ణిమ దీపతోరణాలు సమర్పించుకోవడానికి అన్ని గ్రామాల నుండి భక్తులు గంధర్వనగరం చేరుకున్నారు. వాళ్లందరూ అంతకు పదిహేను రోజులముందు తమతమ గ్రామాలలో జరిగిన ధనత్రయోదశి ఉత్సవం విశేషాలు చెప్పుకుంటుండగా, ఒకరి మాటలు ఒకరికి నమ్మలేనివిగా తోచాయి. ఎవరికివారు, శ్రీగురుడు తమ ఇంటనే భిక్ష చేశారని చెప్పుకుంటూ, ఒకరి మాటను ఒకరు ఖండించు కుంటున్నారు. ఎవరికి వారే, ఆనాడు స్వామికి తాము సమర్పించుకున్న శాలువలు కానుకలు నిదర్శనంగా చూపించి, తమ మాటలు నిజమని నిరూపించుకోగలమంటున్నారు. అదంతా వింటున్న గంధర్వ పురవాసులు నవ్వి, 'మీ అందరికీ పిచ్చిపట్టిందా ఏమి? దీపావళినాడు స్వామి ఎక్కడకు వెళ్ళనేలేదు. స్వామిని మేమేకదా ఇక్కడ ప్రత్యక్షంగా పూజించుకున్నాము?' అని మందలించారు. అప్పుడు స్వామి, 'మీరు వాదులాడుకోవద్దు. మీలో ఎవరు అబద్ధం చెప్పడం లేదు. మేము అంతటా ఉన్నాము కదా!' అన్నారు. స్వామి ఆనాడు అన్ని రూపాలు ధరించి, అందరి పూజలు అందుకున్నారన్న రహస్యం బయటపడింది. అందరూ ఆశ్చర్యచకితులై, అటువంటి లీల తాము ఎన్నడూ కనీవినీ ఎరుగనని చెప్పి స్వామిని స్తుతించుకొన్నారు. ఎంతటి కవులకూ  వర్ణించ సాధ్యంకాని ఆ లీల త్రిమూర్తి రూపమైన అవతార పురుషునికి మాత్రమే సాధ్యమని కీర్తించుకున్నారు. కనుక నామధారకా ! శ్రీగురు స్మరణకు మించిన జ్ఞానమేమున్నది? శ్రీ గురుడే త్రిమూర్తి స్వరూపము. ఆయనకు మించిన దైవమే లేడు. ఈ సంసార సాగరాన్ని దాటడానికి శ్రీ గురు పాదసేవకు మించిన నావయే  లేదు. గురు కథామృతాన్ని మించిన అమృతమే లేదయ్యా!" అన్నారు సిద్ధయోగి.          


నలభై ఏడవ అధ్యాయం సమాప్తం

శ్రీ దత్తాయ గురవేనమః 

శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః   

No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box

నూతనయజ్ఞోపవీత ధారణ విధానము

  నూతనయజ్ఞోపవీత ధారణ విధానము జంధ్యాల పౌర్ణమి శ్రావణ పౌర్ణమి నాడు వస్తుంది. ఈ రోజు జీర్ణమైన (పాత) జంధ్యమును తీసివేసి కొత్త జంధ్యమును (యజ్ఞోప...