Monday, June 1, 2020

గురు చరిత్ర అధ్యాయము - 41


అధ్యాయము  -41




                               
శ్రీ గణేశాయనమః                             
శ్రీ సరస్వత్యేనమః  
శ్రీ గురుభ్యోనమః 



కథారంభము 



                        నామధారకుడు, "స్వామీ! సర్వధర్మాలతో కూడిన శ్రీ గురుచరిత్ర వింటుంటేనే నా హృదయంలో అజ్ఞానమనే చీకట్లు నశించి జ్ఞానమనే  జ్యోతి వెలిగింది. ఇప్పుడు గురుస్మరణ పట్ల ఎంతో ప్రీతి కలుగుతున్నది. శ్రీగురుని అంతటి అవతారమూర్తి యొక్క సాన్నిధ్యం పొందిన మహాజ్ఞానులు, సిద్ధపురుషులు మీరు. నా పూర్వపుణ్యం వలన అట్టి మీ దర్శన భాగ్యం కలిగింది. మా పూర్వీకులు శ్రీ గురుభక్తులు ఎలా అయ్యారో  తెలుసుకోవాలని ఉంది,  చెప్పండి' అన్నాడు. సిద్ధయోగి ఇలా చెప్పసాగారు:  


            "నాయనా! పూర్వం శ్రీ  గురుడు తీర్థాటనం  చేస్తూ, గోదావరీ తీరాన ఉన్న వాసర క్షేత్రానికి వేంచేసినప్పుడు ఆయనను భక్తితో పూజించి, ఆయన ప్రేమకు పాత్రుడైన సాయందేవుడే నీ పూర్వీకుడు. అటుతర్వాత శ్రీ గురుడు అనేక తీర్థక్షేత్రాలను పావనం చేస్తూ పర్యటించి, ఈ గంధర్వనగరం చేరారుగదా! అటు తర్వాత వారి కీర్తి దశదిశలా వ్యాపించి, సుదూర ప్రాంతాలనుండి కూడా ఎందరెందరో వచ్చి వారిని సేవించి, అభీష్టసిద్ధి పొందుతున్నారని మీ పూర్వీకుడైన సాయందేవునికి తెలిసింది. అతడు అందుకు ఎంతో ఆనందించి, ఒకనాడు శ్రీవారి దర్శనానికి ఈ గంధర్వపురం వచ్చాడు. శ్రీ  గురునికి నిలయమైన ఈ గంధర్వపురం అతడి కంటపడగానే, అతిశయించిన భక్తిశ్రద్ధలతో అడుగడుగుకు  సాష్టాంగ నమస్కారాలు చేస్తూ మఠానికి చేరుకున్నాడు. అక్కడ శ్రీగురుని దర్శించగానే, అతనికి రోమాంచితమై, ఆనంద బాష్పాలు రాలాయి. ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి, తన జుట్టుతో వారి పాదాలు తుడిచి, గద్గద  స్వరంతో ఆయననిలా  స్తుతించాడు:                    


                              ఓ పరమాత్మ! పరంజ్యోతి! నృసింహసరస్వతీ ! మీరు త్రిమూర్త్యాత్మకులే గాని, మానవమాత్రులుగారు. సర్వ తీర్థాలకూ  ఆశ్రయమైన మీ పాదాలను దర్శించినంత మాత్రాన కోటి జన్మల పాపం నశిస్తుంది. మీ దర్శనం వలన ధన్యుడనయ్యాను. మా పితరులుకూడా కృతార్థులయ్యారు. ఓ  సర్వవ్యాపకా! సద్గురూ! భక్తవత్సలా! జయము. జీవుల పట్ల కరుణయనే  జలంతో నిండిన కమండలం  ధరించిన  మీరు సాక్షాత్తు ఆ  బ్రహ్మదేవుడే. మీరు అమృతతుల్యమైన ఆ నీరు చల్లి,  చనిపోయిన వారిని మరల బ్రతికిస్తున్నారు. స్వామి! దండమును ధరించిన మీరు సాక్షాత్తూ దుష్టులను దండించి,  భక్తుల దైన్యాన్ని పారద్రోలి  రక్షించే శ్రీ మహావిష్ణు స్వరూపులే, యిప్పుడిలా  సన్యాసి వేషంలో అవతరించారు. భస్మము,  రుద్రాక్షలు ధరించిన మీరు భక్తుల పాపాలను, భవరోగాన్ని నశింపజేయుగల సమర్థులు, సాక్షాత్తు శివస్వరూపులు. ఎవరి కృప వలన చచ్చినవాడు  బ్రతికాడో, గొడ్డుబర్రె పాలు ఇచ్చిందో, మేడికట్టె వృక్షమైందో, హీనుడుద్ధరింపబడ్డాడో అట్టి మిమ్మెవరెరుగగలరు?'        


                    శ్రీ గురుడు సంతోషించి  సాయం దేవుడి తలపైచేయి పెట్టి, 'నాయనా! నీవు మాకు పరమ భక్తుడవు.  నీ స్తోత్రం వలన మాకు సంతోషమైంది. నీ  వంశస్థులందరూ మా భక్తులై చిరకాలం వర్ధిల్లదురుగాక!' అని ఆశీర్వదించారు. తర్వాత శిష్యులందరితో ఆయన, 'మీరంతా సంగమంలో స్నానం చేసి, అశ్వత్థవృక్షాన్ని సేవించి పంక్తి  భోజనానికి రండి' అని చెప్పి, సాయందేవునితో, 'నీవు కూడా వారితో వెళ్లిరా, ప్రసాదం తీసుకుందువు' అన్నారు. అందరూ సంగమానికి వెళ్లి వచ్చాక, అతడు శ్రీగురునికి పూజచేసి, భిక్ష ఇచ్చాడు. అప్పుడు స్వామి అతనిని తన ప్రక్కనే కూర్చోబెట్టుకొని భోజనం పెట్టించారు. తర్వాత అతనిని దగ్గరకు పిలిచి, 'నాయనా,  నీవు ఎక్కడ ఉంటున్నావు? నీ భార్యబిడ్డలు క్షేమమా? చాలాకాలానికి కనిపించావు' అన్నారు. అతడు, 'స్వామీ మీరు సర్వజ్ఞులు. మీకు తెలియనిది ఏమున్నది? మీ  దయ వలన అందరము క్షేమమే. నా భార్యబిడ్డలు ఉత్తర కంచిలో ఉన్నారు. నా కుటుంబ భారం అంతా కొడుకులు చూసుకుంటున్నారు. కనుక నేను మీ పాదాల చెంత ఉండి సేవించుకోవాలని వచ్చాను. మీరు అనుగ్రహించాలి' అని వేడుకున్నాడు. శ్రీగురుడు నవ్వి, 'నాయనా మమ్మల్ని సేవించడం అంత సులభంకాదు. మేము ఒక చోట ఉండేవారముకాము. ఎక్కడ బడితే అక్కడే ఉంటాము. ఒకప్పుడు ఊరిలో ఉంటే, మరొకప్పుడు అడవిలో ఉంటాము. మాతో కలసి ఉండడం, మా సేవ చేయడం కష్టం. కనుక బాగా ఆలోచించుకో!' అన్నారు.           


                            సాయందేవుడు, 'స్వామి, మిమ్ము శరణు పొందిన నన్ను దూరం చేయవద్దు. మీరు ఉండగా నాకు భయమేమిటి. గురుసన్నిధికి చేర్చే పాదాలే పాదాలు; గురుపూజ చేసే చేతులే చేతులు. గురు పాదాలను అంటే శిరస్సే శిరస్సు. సర్వ అభిమానాలను నివారించి, పురుషార్థాలు ప్రసాదించగల గురుకృప ఉండగా నాకు భయమేమి? నేను మీ చెంతనే ఉండి, మీ పాదసేవ చేసుకుంటాను. అనుజ్ఞ ఇవ్వండి' అని పట్టుపట్టాడు. అప్పుడు శ్రీ గురుడు,  'నీకంత దృఢభావం ఉంటే అలానే చేయి' అని అంగీకరించారు. అతడు స్వామి సన్నిధిలో మూడు నెలలున్న తర్వాత ఒకనాటి సాయంత్రం శ్రీ గురుడు శిష్యులనెవ్వరిని రావద్దని చెప్పి, సాయందేవుణ్ణి ఒక్కడినే కూడా తీసుకొని సంగమానికి వెళ్లారు. ఇంతలో మరి కొందరు శిష్యులొచ్చి సంగమ స్నానం చేశారు. సాయం సంద్యోపాసన అయ్యాక, శ్రీ గురుడు అశ్వత్థవృక్షం క్రింద కూర్చుని, కొంతసేపు శిష్యులతో మాట్లాడారు. కొంతసేపటికి వారంతా గానుగాపురం వెళ్ళిపోయారు. శ్రీగురుడు, సాయందేవుడు మాత్రమే అక్కడ ఉన్నారు. అప్పుడతనిని పరీక్షించదలచి, శ్రీగురుడు ఒకలీల చేశారు. అంతలోనే అకస్మాత్తుగా పెనుగాలి చెలరేగింది. ఆ గాలికి చెట్లు ఊగిపోయి,  విరిగి పడుతున్నాయి. ఆకాశమంతా  కారుమేఘాలు అలముకుని భయంకరంగా ఉరుములు, కన్నులు మిరుమిట్లు గొలిపే మెరుపులతో కుండపోతగా వర్షం ఆరంభమైంది. సాయందేవుడు ఆ గాలికి ఎలాగో ఓర్చుకుని, తన వంటిపై నున్న ఉత్తరీయం తీసి శ్రీగురునికి కప్పి ఆయనకు అడ్డంగా నిల్చున్నాడు. ఇలా గాలి, వాన అర్ధరాత్రి రెండవ ఝాము వరకూ కొనసాగాయి. గాలి వాన కొంత నెమ్మదించగానే దుర్భరంగా చలిగాలి వీచసాగింది. అప్పుడు శ్రీ గురుడు,  నాయనా మమ్మల్ని చలి బాధిస్తున్నది. గ్రామానికి వెళ్లి మఠంనుండి అగ్ని తీసుకురా' అన్నారు. అతడు బయలుదేరుతుంటే, అతనిని బాట కటూఇటూ చూడకుండా త్వరగా వెళ్లి రమ్మని చెప్పారు. 


                    వెంటనే సాయందేవుడు బయల్దేరి గంధర్వపురం వైపుకు నడవసాగాడు. దారిలో ఎక్కడ అడుగు పెట్టినా మోకాలులోతున బురదలో కాళ్ళు కూరుకుపోతున్నాయి. ఆపైన నీరు, రొమ్ములోతున ప్రవహిస్తోంది. కన్ను పొడుచుకున్నా కనిపించనంతగా కారు చీకట్లు అన్ని దిక్కులా  కమ్ముకున్నాయి. వేగంగా వీస్తున్న గాలి అతనిని ఒక ప్రక్క నెట్టివేస్తోంది. ఎలాగో అతడు శ్రీగురుని స్మరిస్తూ చీకట్లో తడుముకుంటూ, మెరుపుల వెలుగులో దారి చూసుకుంటూ కనిపించనంత దూరం పరిగెడుతున్నాడు. చివరకు ఎలాగో అతడు మఠం చేరి, అక్కడి సేవకులను నిద్రలేపి వారివద్దనుండి కుండలో నిప్పులు తీసుకుని తిరిగి బయల్దేరాడు. శ్రీగురుడు తనను ప్రక్కలకు చూడకుండా ఎందుకు సాగిపోమన్నారో తెలుసుకోవాలన్న కుతూహలం తీవ్రమై, నెమ్మదిగా కుడి ప్రక్కకు చూసాడు. అటు పక్కన ఐదు పడగలుగల భయంకరమైన త్రాచుపాము కనిపించింది. అతడు కొంచెం పక్కకు తప్పుకొని భయంతో వేగంగా నడుస్తూ, నెమ్మదిగా ఎడమ ప్రక్కకు చూచాడు. అటు ప్రక్కన కూడా మరో భయంకరమైన పాము అతని వెంటనే వస్తోంది. అతడు భయంతో మతిపోయి, బాటలోని ఎత్తుపల్లాలు కూడా పట్టించుకోకుండా పరుగెత్తసాగాడు. అతడు ఎటు పోతే అటు, అంత వేగంగానూ పాములు తరుముకొస్తున్నాయి. అతడు గుండెదడ పుట్టించే దిక్కుతోచక, పొదల మధ్యకు పోయాడు. ఎటుపోవాలో తెలియక భయంతో తననా పాముల బారినుండి రక్షించమని మనస్సులోనే శ్రీగురుని ప్రార్ధించు కొనసాగాడు. వెంటనే అతనికి కొంచెం భయం తగ్గి, ఒక చక్కని బాట చిక్కింది. దాని వెంటపోగా, కొద్దిసేపట్లోనే సంగమం వద్దనున్న రావిచెట్టు అతనికి కనిపించింది. ఆ ప్రాంతమంతా వేలకొద్దీ దీపాలతో వెలిగి పోతున్నట్లు కనిపించింది. అక్కడ నుండి వేద ఘోష అతనికి చక్కగా వినిపిస్తున్నది. అతడు అటువైపుగా వెళ్ళి శ్రీగురుని సమీపించేసరికి, అక్కడ ఆయన ఒక్కరే ఉన్నారు. అతడికి ఆ భయం వలన వర్షం ఆగింది అని కూడా తెలియలేదు. ఆకాశంలో మబ్బులు ఎప్పుడు తొలగిపోయాయోగాని, పిండి ఆరబోసినట్లు పండు వెన్నెల వచ్చింది. అతడు ఆ పాత్ర కిందపెట్టి, నిప్పును ప్రజ్వలింపచేసాడు. భయం తగ్గిపోయి, అతడు గురువుకేసి చూసేసరికి ఆ రెండు పాములు ఆయనకు నమస్కరించి వెళ్ళిపోతున్నాయి. వాటిని చూడగానే అతనికి మరలా భయమేసింది. శ్రీగురుడు నవ్వి, 'భయపడవద్దు, నిన్ను రక్షించడానికి ఆ పాములను మేమే పంపాము. గురుసేవ ఎంత కఠినమైనదో తెలిసిందా? కనుక ముందుగా ఆలోచించుకొని, తగిన భక్తి విశ్వాసాలు ఉంటేనే అందుకు పూనుకోవాలి. కలిప్రభావం వలన ఇంద్రియ చాపల్యము, అపప్రచారాలు మొదలైన అవరోధాలు ఎన్నో వస్తాయి. అయినా చలించకుండా నిశ్చలంగా గురుసేవచేస్తే గురుకృప వలన సర్వమూ  సిద్ధిస్తుంది. యజ్ఞ యాగాదులు చేసేవారికి ఎన్నో విఘ్నాలు వచ్చి, అవి తేలికగా  నిష్ఫలమవ్వవచ్చు. గురువుదగ్గరే ఉంటూ విశ్వాసంతో సేవ చేసేవాడు, తేలికగా అభీష్టాలు నెరవేరి కృతార్థుడవుతాడు. ఏకభావంతో ఆయనను ఆరాధించడమే ఉత్తమ సాధన. పతివ్రత తన భర్తను సేవించినట్లు, సచ్చిష్యుడు తన గురువును విడువక నీడవలే సేవిస్తాడు. దేహంతో సహా తన సర్వస్వమూ గురుసేవకే అర్పిస్తాడు. గురువే పరమేశ్వరుడని తెలుసుకొని ఆయన ప్రసాదమే భోజనంగా, ఆయన ధ్యానమే జీవనంగా, పాదతీర్థమే గంగాజలంగా సేవిస్తూ శ్రవణ మనన తత్పరుడై వుంటాడు. గురువు ఎంతటి దుస్సాధ్యమైన ఆదేశమిచ్చినా సరే, దాన్ని సాధించడానికి ఉపక్రమిస్తాడు. ప్రారంభించాక దానిని ఎంత కష్టపడి అయినా పూర్తిచేస్తాడు. అలా చేస్తే, వాడిని చూచి యమధర్మరాజు కూడా భయపడి తొలగిపోతాడు'. అప్పుడు సాయందేవుడు నమస్కరించి, 'స్వామి, నేనేమీ  తెలియని వాడిని, కృపతో గురుభక్తి ఎలాంటిదో వివరించండి. దాని సహాయంతో స్తైర్యం  చిక్కించుకుని మీ  చెంతనే ఉండి సేవిస్తాను' అన్నాడు. అప్పుడు  శ్రీ గురుడిలా బోధించారు:              


                     'నాయనా, చెబుతాను విను, నీవు ఇక రాత్రి అయిందో బ్రాహ్మీ ముహూర్తం అయిందోనన్నది పట్టించుకోకుండా వినాలి. సత్కాలక్షేపం అవుతుంది. పూర్వం పార్వతీదేవికి పరమేశ్వరుడు బోధించిన గురుభక్తి తత్వం నీకు చెబుతాము. శివుడు ఇలా చెప్పాడు: "దేవి, గురువే ఈశ్వరుడన్న దృఢమైన విశ్వాసంతో ఆయనను సేవించడం వలన సర్వసిద్ధులూ కలుగుతాయి. అట్టి ఫలితమే తపో అనుష్టానాదుల వలన చాలా కాలానికిగానీ సిద్ధించదు. యధావిధిగా గురుని సేవించేవారికి యజ్ఞాది కర్మలు చేయని లోటు కలగదు. పూర్వం త్వష్టయనే  బ్రాహ్మణ బాలునికి ఎనిమిదవ సంవత్సరంలో ఉపనయనం చేసి, వేదాధ్యయనానికి గురువు వద్దకు పంపారు. ఆ బ్రహ్మచారి చక్కగా గురు సేవ చేస్తున్నాడు. ఒకసారి ఆ గురువు యొక్క కుటీరం శిథిలమై, వర్షపునీరు లోపలకు కురిసింది. గురువు త్వష్టను పిలిచి, 'నాయనా, ఈ కుటీరం ప్రతిసారి వర్షానికి పాడైపోతున్నది. ఇలా గాలి, వాన, అగ్నుల  వలన నశించకుండా అన్ని వసతులూ కలిగి ఉండే కుటీరం నాకు కావాలి' అని చెప్పాడు. అప్పుడు గురు పత్ని,'నాయనా, ఎవ్వరూ నేయనిదీ, కుట్టనిదీ, రంగురంగులదీ, సరిపోయేది అయిన రవిక నాకు తెచ్చి పెట్టాలి' అన్నది. ఇంతలో గురుపుత్రుడు వచ్చి, 'అన్నా, నాకు మట్టి అంటనివీ, నీటి మీద నడిపించగలవీ, ఎప్పుడూ సరిపోయేవీ అయిన పాదరక్షలు కావాలి' అని చెప్పాడు. అప్పుడే చిన్న పాప అయిన గురుపుత్రిక కూడా వచ్చి, 'అన్నా! నా చెవులకు కుండలాలు, ఆడుకునేందుకు ఒక బొమ్మరిల్లు కావాలి. అది ఒంటి స్తంభం కలిగి, దంతంతో చేసినదై, పగలనిదిగా ఉండాలి. అది నా వెంట తీసుకెళ్లడానికి వీలుగా ఉండాలి. అందులో అన్ని వసతులూ ఉండాలి. దానిని నెట్టుకు వెళ్లడానికి చక్రాలు ఉండాలి. దానిని మళ్లీ ముడిచి వేయడానికి వీలు ఉండాలి. అందులో పీట, కుర్చీ ఉండాలి,  ఆడుకోవడానికి మంచి వంట పాత్రలు మట్టివి కావాలి. నాకు అవే వంట నేర్పాలి, వాటిలోని వంట ఎంతసేపైనా చల్లా రకూడదు. ఇతర వంట పరికరాలు కూడా కావాలి" అని చెప్పింది.   


             త్వష్ట అంగీకరించి, అడవికి వెళ్తూ, అవన్నీ ఎలా సంపాదించాలి అని ఆలోచించాడు. చివరకు దిక్కుతోచక, తన గురువునే ధ్యానించి, తన మనసులోనే ఆయనను శరణుపొందాడు. అలా పోతూ ఉండగా అతనికి ఒకచోట ఒక అవధూత కనిపించి, "నాయనా, నీవెవరు? ఇంత చిన్నవాడవు ఈ ఘోరమైన అరణ్యంలో చింతా క్రాంతుడవై తిరుగుతున్నావేమి?" అన్నాడు. ఆయనను చూడగానే త్వష్టకు మనస్సు శాంతించింది. తన గురువే ఆ రూపంలో దర్శనమిచ్చినట్లు  అనిపించింది. అతడు ఆయనకు నమస్కరించి, "స్వామి, ఈ నిర్మానుష్యమైన అరణ్యంలో మిమ్మల్ని చూడగానే మీరు సాక్షాత్తూ ఈశ్వరుడని నాకు తోచింది. మీ దర్శన మాత్రం చేతనే నా మనస్సు స్థిరపడి ఆనందం లభించింది" అని, తాను సాధించవలసిన కష్టతరమైన పనుల గురించి విన్నవించుకున్నాడు. అవధూత అతనిని ఆశీర్వదించి, "నాయనా! అభీష్టప్రదుడైన విశ్వేశ్వరుడు కాశీ లో ఉండగా దుర్లభమేమున్నది? నీవు కాశీ వెళ్లి విశ్వనాధుని పూజించు. ఆయన వరంతో  బ్రహ్మాది దేవతలు కూడా ఎంతో మహిమను పొందారు. కేవలం గుక్కెడు పాలు కోరిన ఉపమన్యువుకు ఆయన సాక్షాత్తూ ఆ పాలసముద్రాన్నే ప్రసాదించిన దయాళువు" అని చెప్పాడు. గురుసేవ తప్ప వేరే ఏమీ ఎరుగని త్వష్ట, "స్వామీ! కాశీక్షేత్రం ఎక్కడ ఉన్నది? అని అడిగాడు. అప్పుడు ఆ ముని శ్రేష్ఠుడు, "కాశీకి నిన్ను నేనే స్వయంగా తీసుకుపోతాను. నీవలన నాకు కూడా విశ్వనాథుని దర్శనమవుతుంది" అని చెప్పి, తన లీల చేత అతనిని మనోవేగంతో కాశీకి తీసుకువెళ్లాడు."                    




      నలభై ఒకటవ అధ్యాయం సమాప్తము


శ్రీ దత్తాయ గురవేనమః 


శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః   

No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box

నూతనయజ్ఞోపవీత ధారణ విధానము

  నూతనయజ్ఞోపవీత ధారణ విధానము జంధ్యాల పౌర్ణమి శ్రావణ పౌర్ణమి నాడు వస్తుంది. ఈ రోజు జీర్ణమైన (పాత) జంధ్యమును తీసివేసి కొత్త జంధ్యమును (యజ్ఞోప...