Friday, June 5, 2020

గురు చరిత్ర అధ్యాయము -45


అధ్యాయము  -45




                               
శ్రీ గణేశాయనమః  
                           
శ్రీ సరస్వత్యేనమః  
                                                                                                
శ్రీ గురుభ్యోనమః 



కథారంభము 




             నామధారకుడు భక్తి పారవశ్యంతో, " మహాత్మా, బ్రహ్మసాక్షాత్కారం గూడా ప్రసాదించగల ఇంత దుర్లభమైన శ్రీగురుకథామృతం సేవించగలిగిన నేను ఎంతో ధన్యుణ్ణి. నాకు దైన్యం తొలగి, మనస్సు శాంతించింది. దయతో అటుపై కథ కూడా వివరించండి" అని కోరాడు. పెద్ద యోగి సంతోషంతో ఇలా చెప్పారు:     


                      "నామధారకా! ఇంతకుముందు నరహరిశర్మ వలనే శ్రీగురున్ని సేవించి, మరి ఇద్దరు కవులు ముక్తులయ్యారు. శ్రీ గురుడు వారినెలా అనుగ్రహించారో  చెబుతాను, విను. నందిశర్మ అనే ఒక బ్రాహ్మణునికి తెల్ల కుష్టువ్యాధి వచ్చింది; అతడు ఆ బాధ తొలగించుకోవడానికి తుల్జాపురం వెళ్లి, అహర్నిశలు తదేకదీక్షతో భవానిదేవిని మూడు సంవత్సరాలు ఉపాసించాడు. ఫలితం కనిపించకపోయేసరికి అతడొకసారి మూడు రోజులు ఉపవాసం చేశాడు. మూడవనాటిరాత్రి జగన్మాత అతనికి స్వప్నదర్శనమిచ్చి, చందలాపరమేశ్వరిని ఆశ్రయించమని చెప్పి అంతర్ధానమైంది. ఆ ప్రకారమే అతడు వెళ్లి, ఏడు మాసాలపాటు ఒంటిపూట భోజనంతో,  ఆ పరమేశ్వరుని పూజించాడు. అప్పుడు ఒక నాటిరాత్రి ఆ దేవి స్వప్న దర్శనమిచ్చి, గంధర్వపురంలో విజయంచేస్తున్న త్రిమూర్తి అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి అనే యతీశ్వరుణ్ణి ఆశ్రయించమని చెప్పి అంతర్ధానమైంది. నందిశర్మ నిద్రలేచి, 'అయ్యో, నేను ఇంతకాలం ఇంతటి దీక్షతో ఉపాసిస్తే తేలినది ఇదేనా? దేవీ! ఈమాట మొదటే చెబితే నేను ఇక్కడకు వచ్చేవాడినేకాదు. మూడు సంవత్సరాలు తులజాభవానిని, ఏడు నెలలు నిన్నూ సేవిస్తే, నీవు చివరకు నన్నొక మానవ మాత్రుణ్ణి ఆశ్రయించమంటావే, నీ దైవత్వం ఏమయింది? అలా చెప్పడానికి పరాశక్తివైన నీకు సిగ్గువేయడం లేదా? ఏడు నెలలు తపస్సు చేసి నేను తెలుసుకున్నది,  నీకు శక్తిలేదనేనా? నీవల్లకాదని మొదటనే చెబితే, నాకు ఇంత కష్టమైనా తప్పేదికదా?' అని వాపోయాడు. చివరకు, 'ఈ కఠిన తపస్సు వలన బలహీనుడు అయిన నేను ఇంకెక్కడికి పోగలను? నేను ఎక్కడకూ  వెళ్ళను, ఇక్కడేమరి కొంతకాలం పురశ్చరణ చేస్తాను. దేవీ! నీవు నా రోగం పోగొట్టకుంటే నీ పాదాలవద్దే  ప్రాణత్యాగం చేస్తాను' అని దేవికి చెప్పుకొని, ఈసారి ప్రాయోపవేశం చేయసాగాడు. ఆ దేవి అతనికి మరల ఆ మరుసటి రోజు రాత్రేస్వప్న దర్శనమిచ్చి, అతనిని అచటి నుండి లేచిపొమ్మని ఆదేశించింది. దానికి తోడు అచ్చట పూజారికి కూడా ఆమె దర్శనమిచ్చి, నంది శర్మను అక్కడనుండి వెళ్ళగొట్టమని ఆజ్ఞాపించింది! మరుసటి ఉదయమే వాళ్లందరూ అతనితో, 'నందయ్యగారు! అమ్మవారి సెలవయింది. కనుక మీరు తక్షణమే ఇక్కడనుండి వెళ్లిపోవాలి. లేకుంటే మేము ఇక్కడి నుండి నెట్టి వేయవలసి వస్తుంది!' అని బెదిరించారు. వేరేదారిలేక, అతడు అందుకు అంగీకరించి, దేవిని పూజించి పారణచేసి, ఆ వూరు విడిచి బయల్దేరాడు. తనకు వ్రతభంగం అయినందుకు ఉపవసిస్తూ ఒక శివరాత్రి నాటికి గానుగాపురం చేరుకొన్నాడు. అతడు దేవి చెప్పిన ఆ యతీశ్వరులు ఎక్కడ ఉన్నారని ఆ నగరవాసులను విచారించాడు. వారు, 'శ్రీగురుడు శివరాత్రికి నిన్నటి దినమంతా ఉపవసించి, స్నానానికని సంగమానికి వెళ్లారు. కొద్ది సేపట్లో తిరిగివస్తారు' అని చెబుతున్నారు. ఇంతలోనే ఆ యతిరాజు వస్తుండడం చూసి, వారు ఆ కుష్ఠురోగిని దూరాన్నే ఉండమని చెప్పారు. స్వామి మఠంలో ప్రవేశించి తమ స్థానంలో కూర్చోగానే, వారి దర్శనానికై ఒక కుష్టురోగి వచ్చారని వారు మనవి చేశారు. అది వినగానే శ్రీగురుడు, 'వాడు సంశయాత్మకుడు! అయినప్పటికీ మా ఎదుటకు రమ్మనండి' అని చెప్పారు. అది విని నందిశర్మ  అడుగడుగుకూ సాష్టాంగపడుతూ వారి ఎదుటకు వచ్చాడు. శ్రీ నృసింహ సరస్వతి అతనిని చూచి. 'ఏమయ్యా!" మొదటి దేవిని ఆశ్రయించాక, మరలా ఈ మానవమాత్రుణ్ణి  దర్శించేదేమిటి?" అనుకుంటూ మా దర్శనానికి వచ్చావేమి? నీకు విశ్వాసం లేకుంటే,  దేవి ఆదేశిస్తే మాత్రం రావడమెందుకు?' అన్నారు. వెంటనే ఆయన సర్వజ్ఞులని తెలుసుకొనిన నందిశర్మ  పశ్చాత్తాపంతో సాష్టాంగ నమస్కారం చేసి ఇలా అన్నాడు: 'స్వామీ! నేను మూడుడను. శుద్ధసత్త్వ స్వరూపులైన మీ దృష్టి నాపై ప్రసరింపజేయడం వలన నాలోని తమోగుణం అంతరించింది. పాపాత్ముడ నైన నేను మీరు మయాతీతులని, సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపులనీ  తెలుసుకోలేకపోయాను. నేడు తమ దర్శనంవలన నా పాపాలన్నీ నశించాయి. మీరు భూమిని ఉద్ధరించడానికి దిగివచ్చిన గంగవలె, నా వంటి వారిని రక్షించడానికి మానవ రూపంలో అవతరించారు. మీ పాదసేవ దొరికాక, నా అభీష్టం ఎందుకు నెరవేరదు? జారత్వ దోషంవలన పాషాణమైన అహల్య శ్రీరాముని పాద స్పర్శ వలన ఉద్ధరణ పొందలేదా? నేను ఎన్ని పాపాలు చేసిన వాడనైనా మీ పాదస్పర్శవలన పవిత్రుడనవుతాను. స్వామీ! నా స్థితి కొంచెం విన్నవించుకుంటాను . 


                నాకు వివాహం అయినప్పటి నుండి ఆపాదమస్తకమూ  కుష్టురోగం వచ్చింది. అందువలన నా భార్య నన్ను విడిచి, పుట్టింటికి వెళ్ళింది. నా తల్లి దండ్రులు కూడా నన్ను వెళ్లగొట్టారు. నేను దిక్కులేనివాడనై  ఆ  జగదాంబ నాశ్రయించి ఉపవసించినా, నా పాపం నశించలేదు. అప్పుడు ఆ తల్లి చెప్పినట్లు చందలేశ్వరిని ఆశ్రయిస్తే నా రోగం తగ్గుతుందని గంపెడాశలతో అచ్చటికి వెళ్లి, కఠోరమైన పునశ్చరణ చేశాను. ఆ తల్లి కూడా నన్ను చీదరించుకుని వెళ్ళగొట్టిందేగాని, అనుగ్రహించనే  లేదు. నా ముఖం చూసే వారు ఎవరూ లేరు. నేను ఇలా బ్రతకడం కంటే మరణించడమే మేలు. చివరి ఆశగా మిమ్మల్ని శరణు పొందడానికి వచ్చాను. దయచేసి ఈ నా వ్యాధికి నివారణోపాయం ఉన్నదో లేదో వెంటనే చెప్పండి! ఈ దుస్థితిలో నేనింక బ్రతుకలేను. నివారణోపాయం లేకుంటే మీ  పాదాల వద్దనే నా ప్రాణాలు విడువాలనే వచ్చాను. మీరే నాకు దిక్కు. ఆపైన మీ దయ' అని దీనాతి దీనంగా నందిశర్మ వేడుకున్నాడు.                     



                శ్రీ గురుడు అతని పట్ల కృపచెంది, సోమనాథుడు అనే ప్రియశిష్యునన్ని  పిలిచి, 'నాయనా! నీవు ఇతనిని సంగమానికి తీసుకుపోయి సంకల్పము చెప్పించి, అచ్చటి షట్కుల తీర్థంలో స్నానం చేయించు. తర్వాత అచ్చటి అశ్వత్థ వృక్షానికి సేవచేయించు. అప్పుడు ఇతడు కట్టుకున్న బట్టలు తగులబెట్టించి, కొత్త వస్త్రాలు కట్టించి, ఇక్కడకు తీసుకొనిరా!' అని ఆదేశించారు. ఆ ప్రకారమే నందిశర్మ  స్నానానికి వెళ్లి ఒక్కసారి ఆ నదిలో మునిగిపైకి లేవగానే, అతని శరీరంలో ఆ రోగం ఎక్కడా లేకుండాపోయింది! తర్వాత అచ్చటి అశ్వత్థవృక్షానికి  ప్రదక్షిణం చేయగానే అతని శరీరం బంగారుఛాయతో వెలిగిపోయింది. తర్వాత అతడు కొత్త వస్త్రాలు ధరించాక  అతని పాతవస్త్రాలు మూట కట్టించి, ఒక చోట తగులబెట్టించారు. అప్పుడు ఆ తగులబెట్టిన ప్రదేశమంతా చౌడు బారిపోయింది. అప్పుడు వారిద్దరూ మఠానికి తిరిగివచ్చారు. ఒక ఘడియ కిందట దేహమంతటా కుష్ఠురోగమున్న  అతడు ఇంతలోనే శుద్దుడై, సోమనాథునితో కూడా శ్రీగురుని పాదాలకు మొక్కలని వేగంగా వస్తున్న నందిశర్మను చూచి అచ్చటి జనమంతా ఆశ్చర్యచకితులయ్యారు.      


              శ్రీ గురుడు అతనిని చూచి, 'ఏమి  నందిశర్మా ! నీ కోరిక నెరవేరిందా? జాగ్రత్తగా నీ వొళ్ళంతా చూసుకొని చెప్పు!' అన్నారు. అతడు చూచుకొని, తన పిక్క మీద ఒకచోట కొద్దిమాత్రం కుష్టు మిగిలి ఉండటం చూచి బాధపడి, ' అయ్యో,  మీ కృప వల్లకూడా ఈ వ్యాధి పూర్తిగా నశించలేదే! నన్ను దయచూడండి' అని వేడుకున్నాడు. శ్రీగురుడు, 'నాయనా! నీవు, " దేవతల వల్లగానిది ఒక మానవ మాతృని వలన ఎలా సాధ్యమవుతుంది? " అని సంశయించినంతమేరకు ఈ వ్యాధి మిగిలింది. ఇప్పుడు నీ సందేహం తీరిందో లేదో చెప్పి స్తోత్రంచేయి. ఆ కాస్తా  తొలగిపోతుంది అన్నారు. నందిశర్మ  నమస్కరించి,  'స్వామీ! మీపట్ల నాకు గల సంశయం పూర్తిగా తొలగిపోయింది. కానీ నేను చదువుకోలేదు.మంద బుద్ధియైన నాకు మిమ్మల్ని స్తుతించడమెలా సాధ్యం? ' అని ఆయన పాదాలకు నమస్కరించాడు. అప్పుడాయన,  'నాయనా! ఏనుగు నోటినుండి బయటకు పెరిగిన దంతంలా మా నోటినుండి వచ్చిన వాక్యం వెనుకకు మరలదు. మేము చెప్పిందే చెయ్యాలి అని కొంచెం భస్మం  తీసుకుని,  అతనిని  నోరు తెరవమనిచెప్పి,  అతని నాలుక చివర ఉంచారు. అతడు వెంటనే జ్ఞానవంతుడై లేచి నిలుచుని చేతులు కట్టుకొని స్వామిని భక్తి పారవశ్యంతో ఇలా స్తుతించాడు:                            


               ఓ పరమేశ్వరా! శ్రీగురూ ! నీవే ఆ పరబ్రహ్మస్వరూపము. నీవు సర్వకర్తవు, సర్వభర్తవు, అవ్యయుడవు,  ఆత్మ స్వరూపివి,  నీవే ప్రకృతి యొక్క త్రిగుణాలనుండి భూతాలను పుట్టించి,  మాయావశమైన,  ఇంతగా విస్తరించిన ఈ చరాచర జగత్తును సృష్టించావు. ఈ ప్రపంచమంతటిలో మానవుడు ఒక్కడే జ్ఞానానికి పాత్రుడు. అలంటి  మానవుడు కూడా దాటనలవిగాని నీ మాయచేత భ్రాంతి చెంది,  సంకల్పవంతుడై పాపపుణ్యాలవలన ఈ సంసారంలో బ్రమిస్తున్నాడు.  వీడు ఎన్ని కల్పాలకైనా ఈ మాయనుండి బయటపడలేడు. ఒకప్పుడు సత్కర్మల వలన ఊర్ధ్వలోకాలకు పోయినా,  ఆ పుణ్యం వ్యయమవగానే క్రిందకు వచ్చి చంద్ర మండలంలో పడతాడు. తర్వాత వర్షంతో పాటు భూమికి చేరే అన్నమవుతాడు. అప్పుడు జీవులచేత  భక్షింపబడి రేతస్వరూపుడై తల్లిగర్భములో పడతాడు. క్రమంగా నెలలు గడిచినకొద్దీ ఎన్నో మార్పులు చెందుతూ,  తల్లి సేవించే  కారము,  వేడి మొదలైన పదార్థాల వలన ఎన్నో బాధలు పడతాడు. అయినా జ్ఞానం లోపించడంచేత పరమాత్మయైన మిమ్మల్ని స్మరించనేలేడు. ఆ గర్భ చెరనుండి తప్పించుకుని బయటపడ్డాక కూడా తన బాధలు,  భయాలు,  ఎవరికీ చెప్పుకోలేక, ఎన్నో బాధలు పడతాడు గాని మీ గురించిన జ్ఞానమే ఉండదు. బాల్యమంతా ఆటలతో గడిచిపోతుంది. యవ్వనంలో మదించి ఎన్నోపాపాలు చేస్తాడు. అప్పుడు కామవశుడై కాలమంతా గడిపేస్తాడు. వృద్ధాప్యంలో బలం క్షీణించడం వలన వ్యాధులు, సంసారికమైన చింతలు,  అతనిని తలమునకలు చేస్తాయి. వాటివలన అంతిమ క్షణంలోకూడా మిమ్మల్ని హృదయపూర్వకంగా స్మరించనైనా లేడు. నేను కూడా ఇలానే మాయలోబడి, యెంతో కాలం మిమ్మల్ని స్మరించలేకపోయాను. ఇటువంటి ఘోరమైన సంసారంలో చిక్కిన నాకు ఇప్పుడు మీ దర్శనం లభించింది. నరరూపం ధరించి,  ఈ విశ్వాన్ని తరింపజేయడానికి అవతరించిన విశ్వ పాలకులు.అజ్ఞానందులైన పామరులు  మిమ్మల్ని గుర్తించనైనా లేరు. స్వామీ! నన్నీ సంసారసాగరం నుండి తరింపజేయి' అని స్తుతించాడు. అప్పుడతడు ఆ పారవశ్యంలోనే  ప్రజలవైపు తిరిగి, 'ఓ జనులారా! ఇక్కడ మన మధ్యనున్న శ్రీగురుడు సాక్షాత్తూ పరమేశ్వరుడే గాని మానవమాత్రుడుగాడు. వీరి దర్శనంవలన నా పాపాలన్నీ - దావానలంవలన ఎండుటాకులు భస్మమైనట్లు - నశించి పోయాయి. వీరి పాద స్పర్శవలన బ్రహ్మచే వ్రాయబడిన నొసటివ్రాత గూడా మారిపోగలదు. పెన్నిధివలె నేడు మనకు ఈయన లభించారు. అయినా మనమీయనను గుర్తించలేకున్నాము.  ఆత్మ శ్రేయస్సు కోరుకున్నవారందరూ ఈయనను భజించి,  ధన్యులు కండి. ఈయన మహత్యాన్ని నేనెంతని వర్ణించను? వాక్కుకు,  మనస్సుకూ  అతీతమైన యీయన  మహిమను వర్ణించబోయి  వేదమే మూగబోయింది!' అని ఇక నోట మాటరాక,  ఆనంద భాష్పాలు కారుస్తూ నిల్చుండి పోయాడు. అతడు చేసిన స్తోత్రానికి సంతోషించిన శ్రీ గురుడు అచటివారితో, 'ఈ బ్రాహ్మణునికి "కవీశ్వరుడు" అని బిరుదిస్తున్నాము. నేటి నుండి అందరూ ఇతనిని కవీశ్వరుడనే పిలవండి' అని చెప్పారు. ఇంతలోతన పారవశ్యంనుండి తెప్పరిల్లిన నందిశర్మ తన శరీరం పరిశీలించుకున్నాడు. అంతకుముందు మిగిలిన ఈ పాటి కుష్టుకూడా మటుమాయమవడం గమనించి, సంతోషంతో స్వామికి నమస్కరించాడు. నాటినుండి నందిశర్మ  శ్రీగురుని సేవిస్తూ,  ఆయన మహత్యాన్ని కీర్తిస్తూ స్వామి సన్నిధిలోనే ఉండి పోయాడు. ఇటువంటి  కవీశ్వరుడే మరొకడు గూడా శ్రీగురుని సేవించి తరించాడు".       

నలభై ఐదవ అధ్యాయం సమాప్తం.


శ్రీ దత్తాయ గురవేనమః 


శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః   

No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box

నూతనయజ్ఞోపవీత ధారణ విధానము

  నూతనయజ్ఞోపవీత ధారణ విధానము జంధ్యాల పౌర్ణమి శ్రావణ పౌర్ణమి నాడు వస్తుంది. ఈ రోజు జీర్ణమైన (పాత) జంధ్యమును తీసివేసి కొత్త జంధ్యమును (యజ్ఞోప...