Tuesday, June 9, 2020

గురు చరిత్ర అధ్యాయము -49


అధ్యాయము  -49




                               
శ్రీ గణేశాయనమః 
                            
శ్రీ సరస్వత్యేనమః
                                                                                                  
శ్రీ గురుభ్యోనమః 



కథారంభము


                            నామధారకుడు ఈ లీలలు విని పులకించిపోయి సిద్ధయోగి పాదాలు పట్టుకొని,  "మహాత్మా! శ్రీగురుని లీలలు వింటుంటే ఆయన సాక్షాత్తూ త్రిమూర్తుల  అవతారమని రూఢి అవుతున్నది. కానీ ఈ భూమిమీద యెన్నెన్నో పుణ్యక్షేత్రాలు ఉండగా ఈయన ఈ సంగమ క్షేత్రాన్నే తమ నివాసంగా ఎందుకు ఎన్నుకున్నారో తెలియడంలేదు. ఈ క్షేత్రం యొక్క విశేషమేమో వివరించండి" అని కోరాడు. అప్పుడా యోగి ఇలా చెప్పసాగారు:    


                           " నాయనా! ఒక అశ్వినీ మాసంలో కృష్ణ చతుర్దశినాడు ఈ గంధర్వ పురవాసులందరూ దీపావళి పండుగకు ఎంతో ఉత్సాహంగా సంసిద్దులవు తున్నారు. ఆనాడు ఈ శ్రీగురుడు తమ శిష్యులనందరినీ పిలచి, 'మనం ఈనాడు త్రిస్థలియాత్ర చేసివద్దాము' అన్నారు. అప్పుడు భక్తులు, 'స్వామీ! అలా అయితే మేమీ యాత్రకు కావలసిన పదార్థాలన్నీ మూట గట్టుకుని దారి ఖర్చులుకూడా సిద్ధం చేసుకొని వస్తాము' అన్నారు.ఆ మాటలు విని స్వామి, ' అవన్నీ ఎందుకు? త్రిస్థలి  మనకు దగ్గరలోనే ఉన్నది. ఎట్టి  సన్నాహాలూ అవసరం లేదు. కనుక మీరందరూ మీమీ కుటుంబాలతో సహా మాతో కూడా రండి' అని ఆదేశించారు. వెంటనే వారందరూ ఆయనతోకూడా సంగమ  తీరానికి చేరి,  నదిలో స్నానాలు చేశారు. అప్పుడు స్వామి,  'నాయనలారా! ఈ సంగమ ప్రాంతమంతా ప్రయాగతో సమానమైన మహత్మ్యం  గలది సుమా! ఇచ్చటి షట్కుల తీర్థాన్ని మించినది వేరొకటి లేదు. ఇది ప్రయాగను కూడా మించినది.ఈ బీమా - అమరజా సంగమం గంగా -  యమునా సంగమంకంటే కూడా ఎక్కువ పవిత్రమైనది. ఇక్కడ స్నానం చేయడంవలన కలిగే పుణ్యం ఇంతింతని చెప్పనలవికాదు.ఇచ్చటి  ఉత్తర వాహినిలో చేసిన స్నానం ఇంకా పుణ్యప్రదం. ఇక్కడ పవిత్రమైన తీర్థాలు ఎనిమిది ఉన్నాయి. వీటిలో ఒక్కొక్కదానిని గూర్చి ఎంతని చెప్పగలము?' అన్నారు. అప్పుడు ఒక భక్తుడు,  'స్వామీ ! ఇచ్చటి నదికి "అమరజ" అని పేరు ఎలా వచ్చింది? అది ఎలా ఏర్పడిందో సెలవియ్యండి!' అన్నాడు. అప్పుడు శ్రీగురుడు ఇలా చెప్పసాగారు:       


                            'పూర్వం ఒకప్పుడు దేవతలకు రాక్షసులకు భయంకరమైన యుద్ధం జరిగింది. ఇందులో జాలంధరుడనే రాక్షసుడు  ఎందరో దేవతలను చంపేస్తున్నాడు. అప్పుడు దేవతలకు రాజైన ఇంద్రుడు మృత్యుంజయుడైన శంకరుణ్ణి దర్శించి,  "మహదేవా! ఈ  యుద్ధంలో దేవతలకే ఓటమి తప్పనట్లున్నది. అదేమీ చిత్రమోగాని,  రాక్షసుల దేహాలనుండి కారిన రక్తపు  చుక్కలనుండి వేలాదిగా రాక్షసుడు పుట్టి,  ముల్లోకాలలోని దేవతలను సహకరిస్తున్నారు" అని మొరపెట్టుకున్నారు. వెంటనే రుద్రుడు పట్టరానికోపంతో రాక్షసులతో యుద్ధానికి సంసిద్ధుడయ్యాడు. కాని ఇంద్రుడు  ప్రార్థించిన మీదట,  ఆ యుద్ధంలో చనిపోయిన దేవతలను బ్రతికించడానికి అమృతభాండం ప్రసాదించాడు. వెంటనే ఇంద్రుడు అది తీసుకువెళ్లి చనిపోయిన దేవతలమీద చల్లగానే వాళ్ళందరూ జీవించారు. చివరికి ఆ పాత్రలో మిగిలిన అమృతం కొద్దిగా భూమి మీద పడింది. అదే ఈ నదిరూపంలో ప్రవహిస్తున్నది. అందుకే దీనికి 'అమరజా' అనే పేరు వచ్చింది. అందువల్లనే సంజీవని వంటి ఈ నీరు సర్వ పాపాలను నశింపచేయగలదు.  ఇందులో భక్తి విశ్వాసాలతో స్నానం చేసినవారికి అపమృత్యు భయం ఉండదు. ఇది అన్ని బాధలనూ,  వ్యాధులను, బ్రహ్మహత్యాది పాపాలనూ  తొలగించడంలో  త్రివేణిసంగమంతో సమానమైనది.  ఈ సంగమంలో వైశాఖ, కార్తీక,  మాఘ మాసాలలో యధావిధిగా ఉషఃకాలంలో స్నానంచేస్తే ఈ లోకంలో సుఖము, అటుపై మోక్షమూ  కలుగుతాయి. అందుకు అవకాశం లేనప్పుడు,  గ్రహణ సమయంలోను,  సంక్రమణ,  పర్వదినాలలోను ఏకాదశి మొదలైన తిథులలోనూ ఈ నదిలో స్నానం చేస్తే అనంతమైన ఫలితమొస్తుంది. నిత్యమూ ఇందులో స్నానంచేసినా పూర్నాయుష్మంతులవుతారు.             


                ఈ అశ్వత్థవృక్షం దగ్గరున్న మనోరథ తీర్ధంలో స్నానంచేస్తే నిశ్చయంగా మనోరథాలన్నీ  నెరవేరుతాయి. భక్తితో అశ్వత్థాన్ని  సేవించిన వారికి కలిప్రభావం అంటక,  మా దర్శనం లభిస్తుంది. కారణం మేమందులో యెల్లప్పుడూ వుంటాము. అట్టి ఈ కల్పవృక్షాన్ని,  సంగమేశ్వరుడైన  సదాశివున్ని  పూజించి, త్రయంబక మంత్రం పఠించాలి. శ్రీశైలంలో మల్లికార్జునునివలె ఇక్కడ సంగమేశ్వరుడు సుస్థిరంగా ఉన్నాడు. ముందు నందీశ్వరునికి నమస్కరించి, తర్వాత  శివునికి ప్రదక్షిణంచేసి సాష్టాంగ నమస్కారం చేయాలి. ఇలా మూడు ప్రదక్షిణలు అయ్యాక, ఎడమచేత్తో నందీశ్వరుని వృషణాలు స్పృశించి, కొమ్ములపై బొటన - చూపుడువేళ్ళు ఆనించి, వాటిమధ్యనుండి శివలింగాన్ని దర్శించాలి.  భక్తితో ఇలాచేస్తే అభీష్టాలన్నీ  నెరవేరుతాయి. ఇక ఈ ఎదుటనే ఉన్న మహాతీర్థం సాక్షాత్తూ వారణాసియే.  అది నాగేశ్వరమనే  గ్రామంనుండి ప్రవహించినది. దీనిని గురించి ఒక పురాణోపాఖ్యానమున్నది.        


                పూర్వం భారద్వాజస గోత్రుడైన బ్రాహ్మణోత్తముడు నిరంతరం భక్తితో ఈశ్వరారాధన చేసి,  పూర్ణ విరాగి అయ్యాడు. అతనికి ఈశ్వర సాక్షాత్కారం కలుగుతుండేది. ఆనంద పారవశ్యంతో అతడు ఒళ్ళు మరచి తిరుగుతుంటే,  లోకులు అతనికి దెయ్యం పట్టింది కాబోలు అనుకునేవారు. ఒకప్పుడు అతని సోదరులైన ఈశ్వరుడు,  పాండురంగడు కాశీకి బయలుదేరుతూ,  తమ అన్నయైన అతనిని గూడ రమ్మన్నాడు. అతడు నవ్వి,  "కాశీ విశ్వేశ్వరుడు నాకు దగ్గరలోనే  ఉండగా, కాళ్ళీడ్చుకుంటూ ఎక్కడకో  వెళ్ళడమెందుకు?" అన్నాడు. "అలా అయితే మాకు చూపించగలవా?" అని వారన్నారు. అతడు అంగీకరించి,  సంగమంలో స్నానంచేసి ఈశ్వరుణ్ణి ద్యానించి, "వ్యోమకేశా! దీనిని కాశీ గాచేసి,  ఇక్కడ విశ్వేశ్వరుని రూపం అందరికీ చూపించు!" అని ప్రార్థించగా,  అందరికీ అక్కడే వారణాసి కనిపించింది. ఈ కుండమే మణికర్ణిక అయింది. ఈ నది ఉత్తర వాహిని అయ్యే చోటఆ కాశి  ప్రకటమయింది. కాశీలో ఉన్న దైవరూపాలన్నీ ఇక్కడే కనిపించాయి. అతని సోదరులిద్దరూ ఆశ్చర్యపడి ఇక్కడే స్నానము,  దానము మొదలైనవి చేశారు. అప్పుడాయన మహాజ్ఞానియని అందరూ తెలుసుకున్నారు. అప్పటి నుండి అతని దగ్గరకు వచ్చిన వారందరికీ విశ్వేశ్వరుని దర్శనం ప్రసాధిస్తూ ఉండేవాడు. కనుక ఇది సాక్షాత్తూ కాశీయే.'


                            స్వామి అటు తర్వాత భక్తులకు పాపవినాశతీర్థం చూపించి,  'ఇందులో స్నానంచేస్తే సర్వపాపాలూ భస్మమవుతాయి' అని చెబుతూ ఉండగా,  పూర్వాశ్రమంలో వారి సోదరియైన రత్నాదేవి అకస్మాత్తుగా అక్కడకు వచ్చి,  ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసింది. శ్రీగురుడు, 'అమ్మాయీ! నీవు చేసిన పాపాల గురించి ఆలోచించావా?' అన్నారు. ఆమె నమస్కరించి,  'స్వామీ,  నేను మూడురాలిని.  సర్వజ్ఞులైన మీరే వాటిని నాకు తెల్పాలి' అన్నది. అప్పుడు స్వామి,  'పూర్వం ఒక పిల్లి పిల్లలను పెట్టింది. నీవు చూడకుండా ఆ కుండనిండా నీళ్లుపోసావు.  అవి చచ్చిపోయాయి. అందువలన నీకు పంచమార్జాల హత్యా మహాదోషం చుట్టుకున్నది. ఇంకా చెబుతాను విను' అంటుండగా, అంతలోనే ఆమె శరీరమంతా కుష్టువ్యాధితో నిండిపోయింది. ఆమె భయపడి ఆయన పాదాలమీదపడి, ఓ దయానిధి! ప్రజలు పాపాలు పోగొట్టుకోడానికి కాశీకి వెళ్ళినట్లు,  నేను మీ పాదాలను ఆశ్రయించడానికి వచ్చాను,  రక్షించు!' అని ప్రార్ధించింది. అప్పుడు శ్రీనృసింహ సరస్వతి,  'నీ వెన్నో పాపాలు చేశావు. వాటిని మరుజన్మలలో అనుభవించి పోగొట్టుకుంటావో,  లేక ఇప్పుడే  పోగొట్టుకుంటావో చెప్పు!' అన్నారు. ఆమె,  'ఇంకా మరొక జన్మ ఎందుకు? నా పాపాలు ఇప్పుడే తొలగించి మరలా జన్మలేకుండా చేయండి' అని ప్రార్థించింది. స్వామి, 'అలా అయితే, నీవు నిత్యమూ  ఈ పాపనాశతీర్థంలో స్నానం చేస్తూ ఉండు. ఒక్కొక్క స్నానానికి ఏడుజన్మల పాపం నశించిపోతుంది. ఈ కుష్టురోగ మొకలెక్కా? ' అని చెప్పారు. అలా చేయగానే  ఆమెవ్యాధి మాయమయింది. అది నేను స్వయంగా చూచాను.ఆ  క్షేత్రమహత్మ్యం చూచి ఆమె అక్కడే ఉండిపోయింది.            


             అప్పుడు స్వామి మా అందరికీ ఇచ్చటి కోటితీర్థం చూపించి,  'ఇందులో సర్వతీర్థాలూ  ఉన్నాయి. ఇక్కడ చేసిన స్నానానికి కోటి గోవులు దానమిచ్చిన ఫలితము  ఉంటుంది. ఇక్కడ చేసిన దానానికి కూడా కోటిరెట్లు ఫలితముంటుంది. దీనికి అవతలనున్న రుద్రపాద తీర్థంలో గయలోలాగే, కర్మచేసి రుద్రపాదస్వామిని పూజించాలి' అని చెప్పారు. తర్వాత కేశవస్వామి దగ్గరనున్న చక్రతీర్థం చూపి,  అక్కడ స్నానంచేస్తే జ్ఞానం కలుగుతుందని శ్రీగురుడు చెప్పారు. 'కల్లేశ్వరుని దగ్గరనున్న మన్మధతీర్థంలో స్నానంచేసి ఈశ్వరుణ్ణి  పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. శ్రావణమాసంలో అఖండాభిషేకము,  కార్తీకమాసంలో దీపోత్సవమూ  చేస్తే అష్టసిద్ధులు,  మోక్షమూ  కూడా లభిస్తాయి'.స్వామి  చెప్పినది విని అందరూ సంతోషించి, యీ  అష్టతీర్థాలలో స్నానం చేసారు. నాడు శ్రీగురుడు మఠం చేరగానే ఆ భక్తులు సమారాధన చేసారు.

నలభై తొమ్మిదవ అధ్యాయం సమాప్తము.


శ్రీ దత్తాయ గురవేనమః 

శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః   

No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box

నూతనయజ్ఞోపవీత ధారణ విధానము

  నూతనయజ్ఞోపవీత ధారణ విధానము జంధ్యాల పౌర్ణమి శ్రావణ పౌర్ణమి నాడు వస్తుంది. ఈ రోజు జీర్ణమైన (పాత) జంధ్యమును తీసివేసి కొత్త జంధ్యమును (యజ్ఞోప...