Sunday, May 31, 2020

గురు చరిత్ర అధ్యాయము -40


అధ్యాయము  -40




                               
శ్రీ గణేశాయనమః                             
శ్రీ సరస్వత్యేనమః                                                                                                  
శ్రీ గురుభ్యోనమః 



కథారంభము 



                          సిద్ధయోగి శ్రీ గురులీలలు ఇంకా ఇలా వివరించారు : "గంధర్వపురానికి ఒకనాడు నరసింహశర్మయనే కుష్ఠురోగి వచ్చాడు. అతనిది యజుశ్శాఖ, గార్గ్య గోత్రము. అతడు స్వామికి నమస్కరించి చేతులు కట్టుకొని ఇలా మనవి చేసుకున్నాడు : 'స్వామీ, మీరు సాక్షాత్తూ పరంజ్యోతి స్వరూపులని, భక్తులపై వాత్సల్యంతో ఇలా భూమి మీద అవతరించారని విని, మిమ్మల్ని ఆశ్రయించడానికి వచ్చాను. నా జన్మ యీ కాలిక్రింద మట్టివలె వ్యర్థమైపోయింది. నాకీ కుష్టువ్యాధి రావడం వలన ఎవరూ నా ముఖంకూడా చూడకుండా నన్ను తిట్టుకుంటున్నారు. నేను వేదం అభ్యసించినప్పటికీ ఈ వ్యాధి వలన ఎవరూ నన్ను భోజనానికి కూడా పిలవడం లేదు. అందరికీ జుగుప్స గొలుపుతూ ఇలా బ్రతకడం కంటే చచ్చిపోవడం మేలు అనిపిస్తున్నది. ఎన్నో జన్మలలోచేసిన పాపాలన్నీ పేరుకొని, నన్ను ఇప్పుడిలా  కట్టికుడుపుతున్నాయి. ఈ బాధ భరించలేకున్నాను. ఈ తెల్ల కుష్ఠురోగం తొలగించుకోవడానికి ఎన్నో వ్రతాలు ఆచరించాను. ఎన్ని తీర్థాలో సేవించాను. దేవతలందరికో  మ్రొక్కాను. కానీ దేనివలనా ఈ వ్యాధి కించిత్తైనా  తగ్గలేదు. చివరకు మీరే దిక్కు అని ఇక్కడికి వచ్చాను. నాపై మీకు కూడా దయలేకుంటే నా ప్రాణాలు ఇక్కడే వదలాలని నిర్ణయించుకున్నాను. నన్ను ఎలాగైనా వుద్దరించండి స్వామీ!' అని ఏడుస్తూ సాష్టాంగ నమస్కారం చేశాడు. శ్రీ గురుడు అతనిని కరుణించి లెమ్మని చెప్పి, 'విప్రుడా! ఇదివరకు ఎన్నో పాపాలు చేసావు గనుకనే నీకీ కుష్టువ్యాధి వచ్చింది. అది తొలగి పోవడానికి నీకు ఒక ఉపాయం చెబుతాము, దానివలన నీవు శుద్ధుడవై దివ్యమైన శరీరాన్ని పొందుతావు' అన్నారు.            


              ఇంతలో ఒక వ్యక్తి కొన్ని ఎండు కట్టెపుల్లలు తీసుకొని అటుగా వెళ్తున్నాడు. అందులో ఒక మేడి చెట్టు కొమ్మలు కూడా ఉన్నాయి. ఆ చెట్టు ఆ ప్రాంతంలోనే నాలుగు సంవత్సరాల క్రిందట ఎండిమోడైపోయింది. ఆ యతీశ్వరుడు వాటిలోని ఒక మేడికర్రను  చూపి నరహరితో, 'నాయనా, నీకీ మేడికట్టే ఇప్పిస్తాము. నీవు దానిని తీసుకొనిపోయి, మా మాట యందు దృడవిశ్వాసముంచి మేము చెప్పినట్లే చేయి. దానిని సంగమంలోని  సంగమేశ్వరాలయం వద్ద భీమానది ఒడ్డున భూమిలో నాటు. నిత్యమూ స్నానంచేసి ఈ రావిచెట్టుకు ప్రదక్షణంచేసి, రెండు చేతులతో రెండుకుండల నిండుగా నీరు తెచ్చి మూడు పూటలా ఆ ఎండు కట్టెకు పోస్తూవుండు. అది ఎప్పుడు చిగురిస్తుందో  అప్పుడే నీ పాపంపోయి, నీ శరీరం స్వచ్ఛమవుతుంది, వెళ్ళు!' అని చెప్పారు. నరహరి ఆయన మాట పై సంపూర్ణమైన విశ్వాసముంచి, ఆ కట్టెను భక్తితో నెత్తిపై మోసుకొనిపోయి, ఆయన చెప్పినట్లే చేయసాగాడు. అతడు నిత్యమూ దీక్షగా దానికి నీరు పోయడం చూచిన వారంతా నవ్వి, 'ఓరి వెర్రి బ్రాహ్మణుడా! నీకేమైనా మతి పోయిందా? నీవు ఎన్నిరోజులు ఇలా నీళ్లు పోస్తే మాత్రం ఆ ఎండుకట్టే మళ్ళీ చిగురిస్తుందా? నిజంగా నీమీద శ్రీ గురుడికి దయ గలిగితే ఇదంతా ఎందుకు? అనుకున్నది వెంటనే జరిగిపోదా? నీకు ఈ జన్మలో ఈ రోగం కుదిరే యోగ్యతలేదని సూచించడానికే  శ్రీగురుడు నీకిలా చెప్పారు. అటువంటప్పుడు ఈ జబ్బుకు తోడు ఇంత ప్రయాస ఎందుకు? అని నిరుత్సాహపరుస్తుండేవారు. ఇలా ఒక వారంరోజులు గడిచిపోయాయి. అతడు మాత్రం తన విశ్వాసం కొంచెం గూడా విడవక, ' ఈ భూమిమీద మహాత్ములు  పలికిన మాటలు ఎంత అమోఘమైనవి! వారు సత్యసంకల్పులు కదా! గురుదేవుల వాక్కు అసత్యమెలా అవుతుంది? వారి కృపవలన చచ్చిన వారెందరో బ్రతకగాలేనిది, ఈ ఎండుకట్టే చిగురించడంలో  ఆశ్చర్యమేమున్నది?' అని చెప్పి, తానుమాత్రం తన నియమం ప్రకారం చేస్తుండేవాడు. అందరూ అతని పనికి ఆశ్చర్యపోతూ ఉండేవారు. వారిలో కొందరు వెళ్లి శ్రీ గురునితో, 'స్వామీ! మీరు ఆ రోజున ఆ కుష్ఠురోగికి  ఎందుకు అలా చెప్పారో గాని, ఆ వెర్రి బ్రాహ్మణుడు ఆ మాటలు పట్టుకొని, ఈ వారంరోజులనుండి నీరైనా త్రాగకుండా ఆ కట్టెను  సేవిస్తున్నాడు. ఎవరేమి చెప్పినా వినడంలేదు. అతని పిచ్చి అతనికి ఆనందమైనట్లు ఉన్నది. "ఈ వృధా ప్రయాస ఎందుకు?" అని చెప్పిన వారందరితో అతడు, "గురువు చెప్పినట్లు చేయడమే నాపని. వారు అన్నమాట నిలబెట్టుకోవడం వారిపని!" అని చెప్పి, ఉపవాసాలు చేస్తున్నాడు. అతనికి మీరైనా చెప్పండి! లేకుంటే అతడలాగే చేస్తుంటాడు' అని చెప్పారు. శ్రీ గురుడు,    'ఈ భూలోకంలో గురు వాక్యం ఒక్కటే తరింప చేయగలదు. దానిని విశ్వసించగల వారికి కోరినవన్నీ సిద్ధిస్తాయి. దానిని విశ్వసించలేకుంటే వ్యర్థమే. ఎవరి భావం ఎలా ఉంటే వారికి ఫలితం కూడా అలానే ఉంటుంది. దానిని తెలిపే ఒక వృత్తాంతం ఉన్నది,  విను. దేవత, మంత్రము,  వైద్యుడు,  పుణ్యతీర్థము,  గురువు -వీటిపట్ల ఎవరికి ఎలాంటి భావం ఉంటుందో, వారి ప్రాప్తము కూడా అలానే ఉంటుంది. ఈ సంసార సాగరాన్ని దాటడానికి దృఢమైన భక్తితో, యుక్తితో గురువును సేవించడమే అన్నిటికంటే సులభమైన సాధనం. గురువే సాక్షాత్తు పరమేశ్వరుడన్న భావనతో సేవించగలవారికి ఫలితం వెంటనే లభిస్తుంది.                      


                          పూర్వము పాంచాలదేశాన్ని సింహకేతువు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. అతని కొడుకు ధనుంజయుడు ధార్మికుడు. ఒకసారి ఆ రాజకుమారుడు వేటకని నిర్జనమైన ఒక మహారణ్యానికి వెళ్ళాడు. అతడు చాలాసేపు వేటాడి బాగా అలసిపోయాడు. అతనికి బాగా దాహం వేసింది. అప్పుడు ఒక బోయవాడు ఒక కొలను వద్దకు అతనిని తీసుకుపోయాడు. ధనుంజయుడు దాహం తీర్చుకొని, ఆ పక్కనే ఉన్న ఒక దేవాలయానికి వెళ్లి, అక్కడ విశ్రాంతి తీసుకున్నాడు. ఆ దేవాలయంలో ఒక ప్రక్కన పడివున్న ఒక శివలింగాన్ని ఆ బోయవాడు తీసుకొని, దానిని తదేకంగా చూస్తూ ఎంతోసేపు ఉండిపోయాడు. రాజకుమారుడు అది చూచి, ' నీకు ఈ లింగం ఎందుకు? 'అని అడిగాడు. బోయవాడు, 'అయ్యా! నాకు చాలా కాలంగా శివపూజ చేసుకోవాలనే కోరిక ఉన్నది. శివలింగం అన్నింటికంటే ప్రశస్తమైనదన్న భావంతోతీసుకున్నాను' అన్నాడు. ధనంజయుడు సంతోషించి, 'ఇది అన్నింటికంటే ప్రశస్తమన్నమాట నిజమే. కనుక నీవు దీనిని భక్తితో పూజించుకో!' అన్నాడు. అప్పుడా బోయవాడు, 'అయ్యా! నేను అడవిలో పెరిగినవాడిని. దీనిని ఎలా పూజించాలో నాకు తెలియదు. దయతో దీనిని పూజించే విధానం చెప్పండి. మీరే నాగురుదేవులు!' అని నమస్కరించాడు. ఆ రాజకుమారుడు ఇలా చెప్పాడు: 'అయితే చెబుతాను విను. దీనిని తీసుకొని పోయి, మీ ఇంట్లో ఒక చోట శుభ్రం చేసి, స్థాపించు. దీని రూపంలో సాక్షాత్తూ శివుడే నీ ఇంట్లో ఉంటాడు. కనుక నీవు నీ భార్యతో కలసి శ్రద్ధగా నిత్యము పూజచేయి. ప్రతిరోజు స్మశానం నుండి చితాభస్మం తెచ్చి,  అది శివునికి అర్పించు. నీవు ఎప్పుడు ఏమి తిన్నాసరే, ముందుగా దీనికి అర్పించి ఆయన ప్రసాదంగా తింటూ ఉండు' అని చెప్పాడు.


                ఆ బోయవాడు ఇంటికి వెళ్లి ఆ ప్రకారమే చేయసాగాడు. ఒక రోజు ఎంత వెతికినా అతనికి చితాభస్మం దొరకనేలేదు. అతడు ఎంతో బాధపడి తన భార్యతో, ' అయ్యో! ఈ రోజు శివునికి పూజ సరిగా జరగలేదు. గురువు ఉపదేశించినట్లు పూజ చేయాలి గానీ, మరోరకంగా చేస్తే ప్రయోజనముండదు. సరిగదా, గురువుమాట జవదాటితే నరకము, దరిద్రమూ వస్తాయి. గురువు చెప్పినట్లు చేస్తే నీ పుట్టుక లేకుండాపోతుంది. అందుకోసం నేనెంత వెతికినా బూడిద దొరకనేలేదు. ఈ ఒక్కరోజూ ఆయన చెప్పినట్లు చేయలేకపోతే, ఇన్ని రోజులుగా చేస్తున్న పూజ అంతా వ్యర్థమై పోతుంది. పూజ సమయం కూడా దాటి పోతున్నది. ఇంక నేనుఏమి చేయాలి? అది దొరకకుంటే నా ప్రాణమైన విడుస్తాను!' అని దుఃఖించాడు. అతని భార్య అతనిని ఓదార్చి, 'దానికోసం అంత బాధపడతావేమి? మనింట్లో ఎన్నో కట్టెలు ఉన్నాయి. వాటితో నన్ను దహనంచేసి, ఆ బూడిద శివునికి అర్పించు. భయపడవద్దు, నీవు వ్రతభంగం చేసుకోవద్దు. శివపూజ కోసం నా శరీరమే అర్పించడం కంటే సంతోషమేమున్నది? ఇది ఏనాటికైనా చచ్చి బూడిద కావలసిందే గదా! అట్టి దానిని శివపూజకర్పిపించడం కంటే కావలసినదేమున్నది. అని ధైర్యం చెప్పింది.                                     


                    అప్పుడతడు, 'నీవు పడుచుదానివి. సంసార సుఖం కూడా నీవు పూర్తిగా అనుభవించలేదు. ఒక బిడ్డనైనా  కనలేదు. సూర్యచంద్రుల సాక్షిగా నిన్ను ఏ లుకుంటానని బాస చేసిన నేను నిన్ను చేతులారా చంపుకుంటాన? అలాచేస్తే నాకెంతో పాపమొస్తుంది. ఆడదానిని చంపినందుకు నన్నందరూ నిందిస్తారు. అంతటి పాపంచేస్తే శివుడు కూడా నన్ను క్షమించడు.  నీ తల్లిదండ్రులకు కూడా అన్యాయం చేసినవాడనవుతాను?' అంటూ  వలవలా  ఏడ్చాడు.  ఆమె,  'నీకెంత వెర్రి?  నాపై నీకు అంత మొహమెందుకు?  నీటి బుడగలాగా ఈనాడువున్న శరీరం రేపు లేకుండా పోతుందే.  పుట్టిన తర్వాత ఎవరైనా చావవలసినదేగా? నా  తల్లిదండ్రులు నన్ను నీకు అప్పగించాక నేను నీదానినే గదా?  నేనేమైనా పరాయి దాన్నా?  నీలో భాగాన్నే  కదా?  శివునికోసం నీవు నన్ను దహనం చేస్తే నీ ప్రాణాన్నే అర్పించినట్లే  అవుతుంది. నీ ప్రాణాన్నైన  నన్ను శివునికి అర్పిస్తే అందులో తప్పేమిటి?  అది నా అదృష్టమే కదా?  అలా చేస్తే శివుడు మనిద్దరినీ రక్షిస్తాడు' అని పట్టుబట్టి,  చివరకు అతనినెలాగో ఒప్పించింది.  


                                  అప్పుడామె ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకొని ఇంటికి నిప్పు పెట్ట మన్నది. అతడు అలానే చేసి,  సర్వమూ భస్మమైపోయాక దానినంతా  భక్తితో లింగానికి అర్పించి, కృతార్థుడనవగలిగానని  ఎంతో ఆనందించాడు. తర్వాత  ఏకాగ్రమైన మనసుతో హృదయపూర్వకంగా శివునికి నమస్కరించి, అలవాటు ప్రకారం ప్రసాదం తీసుకోడానికి  రమ్మని తన భార్యను కేకవేశాడు. శివుని అనుగ్రహం వలన ఆమె తిరిగి బ్రతికి,  శరీరంతో నడిచి వచ్చింది. వారిద్దరూ శివుని ప్రసాదం  తిన్నాక చూస్తే వారి ఇల్లు వెనుకటి వలనే చెక్కుచెదరకుండా నిలిచి ఉన్నది. శబరుడు ఆశ్చర్యపడుతూ ఉంటే అతని భార్య, 'స్వామీ, నాలుగు ప్రక్కలా ఇల్లు అంటుకుని మండుతున్నాగాని నాకదేమో ఎక్కడలేని చలి పుట్టింది. నేను ముడుచుకుని పడుకోగానే గాఢంగా నిద్ర పట్టింది. తర్వాత ఏమైందో నాకు తెలియలేదు. మీరు పిలువగానే 'మెలకువవచ్చి లేచి వచ్చాను. ఆహా! ఏమి యీ  ఈశ్వరుని లీల!' అనగానే, శివుడు వారికి సాక్షాత్కరించాడు. వారు నమస్కరించగానే,  జీవితాంతంలో వారు కోటి సంవత్సరాలు స్వర్గలోకంలో నివసించేలా  వరమిచ్చి అదృశ్యమయ్యాడు. దేనియందైనా పూర్ణ విశ్వాసం ఉండాలేగానీ, ఎంతటి  ఫలితమైన లభించగలదు. కనుక ఆ కుష్ఠురోగియైన నరహరి చేస్తున్న సేవకు ఫలితముండకపోదు. ఎవరి భావానికి తగిన ఫలితం వారికి తప్పక లభిస్తుంది' అన్నారు శ్రీ గురుడు.     


                                  కొద్దిసేపట్లో స్వామి సంగమానికి వెళ్లి అక్కడ తమ అనుష్ఠానం పూర్తి చేసుకొని ఆ కుష్టురోగి వద్దకు వెళ్ళారు. అతడు ఆయన చెప్పినట్లే ఎంతో భక్తిశ్రద్ధలతో చేస్తూ ఉండటం చూచి ఆనందించారు. నరహరి ఆ కట్టెకు నీరుపోసి ఆయన వద్దకు వచ్చి నమస్కరించాడు. ఆయన తన కమండలంలోని నీరు తీసి,  ఆ ఎండిన  మేడి కర్రమీద చల్లారు.మరుక్షణమే అది  చిగురించింది! అనుష్ఠానానికని  సంగమానికి వచ్చిన వారంతా ఆశ్చర్యచకితులై చూస్తూ ఉండగానే అది పెరిగి చిన్న మేడి చెట్టైంది.నివ్వెరపోయి దానిని చూస్తున్న నరహరికి గూడా కుష్టురోగం అదృశ్యమై అతడి శరీరం బంగారు ఛాయతో మెరిసి పోసాగింది. అతడు ఆనందబాష్పాలు రాలుస్తూ, శ్రీగురుని పాదాలకు భక్తితో నమస్కరించాడు. శరీరమంతటా రోమాంచితం అవుతుంటే, పారవశ్యంతో శ్రీగురుని ఇలా స్తుతించాడు: 'కోటి సూర్యుల తేజస్సు( జ్ఞానము), కోటిచంద్రుల చల్లదనం( ఆనందము ) గలిగి, దేవతలందరిచేతా పూజించబడే విశ్వాశ్రయుడు, భక్తప్రియుడు, శ్రేష్టుడుయైన అత్రి పుత్రుడు అయిన ఓ నృసింహ సరస్వతీ స్వామీ! నీకు నమస్కారము, నన్ను రక్షించు. మోహాపాశమనే అజ్ఞానాంధకారాన్ని నశింపచేయగల జ్ఞాన సూర్యుడవు; విశాలమైన నేత్రములు గలవాడవు; భక్తులకు వరములిచ్చే లక్ష్మీపతివీ అయిన ఓ నృసింహ సరస్వతీ ! నీకు నమస్కారము. నన్ను రక్షించు. (2) మనసులో ఉద్భవించిన అరిషడ్వర్గమనే మదగజాన్ని శాసించగల అంకుశము వంటివారు మీరు; సత్యము, సర్వానికి సారభూతమూయైన పరమాత్మతత్వమే మీరు. భక్తవత్సలుడు, సర్వభూతకర్తయైన పరమాత్మ యొక్క అవతారాలన్నింటిలో శ్రేష్టుడైన శ్రీ వల్లభా ఓ నృసింహ  సరస్వతీ ! నీకు నమస్కారము. ఆకాశము, వాయువు, తేజస్సు, జలము భూమి అను పంచభూతాత్మకమైన సృష్టికి కర్తవై ఉండి, సూర్యచంద్రులే నేత్రములుగా గల సర్వసాక్షివి  నీవు. జీవులపై నీకు రాగద్వేషాలు లేకున్నా, నీవు భక్తుల పాలిటి  కామధేనువవు. ఓ శ్రీగురు! ప్రచండమైన (మా) పాపాలను పారద్రోలడానికి దండము ధరించి, యతి వేషధారులైన నృసింహ  సరస్వతీ ! నీకు నమస్కరిస్తున్నాను. నన్ను రక్షించు. మీపాద కమలాలను వేదాలు,  శాస్త్రాలు స్తుతిస్తున్నాయి. నాదబిందు కళా స్వరూపా! నీవు వాటికి కూడా అతీతుడు అయ్యుండి, మూడు విధములైన తాపాలతో పీడించబడుతున్న   భక్తుల పాలిటి కల్పవృక్షమా ! ఓ నృసింహ సరస్వతీ ! నీకు నమస్కారము. నన్ను రక్షించు. అష్టాంగయోగ తత్త్వనిష్ఠతో  ఆత్మ సంతుష్టుడవైయున్న జ్ఞానసాగరా ! కృష్ణావేణీ పంచనది సంగమ తీర నివాసా ! కష్టాలను, దైన్యాన్ని దూరంచేసి, భక్తులకు కోరినవి ప్రసాదించి తృప్తినిచ్చు నరసింహ సరస్వతీ, నీకు నమస్కరిస్తున్నాను. నన్ను రక్షించు. నిత్యము ఈ  నరసింహ సరస్వతీశుని అష్టకం ఎవడు చదువుతాడో వాడికి జ్ఞానానుసారము, దీర్ఘాయువు, ఆరోగ్యము, సర్వసంపదలు,  నాలుగు పురుషార్ధాలు లభిస్తాయి. ఈ అష్టకం ఘోరమైన సంసారమనే సముద్రాన్ని తరించడానికి మంచి సాధనము. నరహరిశర్మ కన్నీటితో స్వామి పాదాలు అభిషేకించి, వాటిని విడవక అలానే పడిఉన్నాడు. శ్రీ గురుడు అతనికి అభయమిచ్చి, "జ్ఞానరాశివవుదువుగాక !" అని అతనిని ఆశీర్వదించి చేయి పట్టి లేవదీశారు. అక్కడ చేరిన వారందరూ ఆ గురు మహత్యం చూచి ఆశ్చర్యపోయి ఆయనకు నమస్కరించారు. అప్పుడు వారందరినీ తీసుకుని ఆయన గంధర్వ పురం లోని తమ మఠానికి చేరుకున్నారు. ఆ గ్రామంలోని వారందరూ ఆ లీల గురించి విని, భక్తితో శ్రీగురుని దర్శించి ఆయనకు హారతులు ఇచ్చారు. నరహరి ఆనాడు వారందరికీ సమారాధన చేశాడు. తర్వాత శ్రీ గురుడు అతని దగ్గరకు పిలిచి , ' నాయనా, నీ పట్ల మాకెంతో ప్రీతి కలిగింది. నీవు గోవులు,  సంపదలతో ఐహిక సుఖాలన్నీ అనుభవించ గలవు. నీ వంశంలో జన్మించిన వారందరూ వేద శాస్త్రజ్ఞులు, శతాయుష్మంతులు అవుతారు. నీకు ముగ్గురు కొడుకులు పుడతారు. వారిలో ఒకడు యోగియై మా సేవ చేస్తాడు. నీకు పరమార్థికమైన  శ్రేయస్సు కూడా లభిస్తుంది. ' అని ఆశీర్వదించారు. తర్వాత శ్రీ గురుడు అతనికి అష్టాంగయోగం ఉపదేశించి, విద్యా సరస్వతి మంత్రాన్ని కూడా ఉపదేశించి, ' నీకు యోగీశ్వరుడు అని పేరు పెడుతున్నాము. నీ భార్యాబిడ్డలను తీసుకొచ్చి మా సన్నిధి లోనే ఉండు' అని చెప్పారు.                                       


                     నామధారకా! శ్రీ గురుని ప్రసాదం వలన నరహరిశర్మకు ముగ్గురు కొడుకులు పుట్టి, గురుభక్తి వలన ఎంతో వృద్ధిలోకి వచ్చారు. స్వామిని నమ్మిన వారిని ఆయన ఎంతగా అనుగ్రహిస్తారో  చూశాము కదా! అంతేగాదు, భక్తితో అతడు చేసిన స్తోత్రం అంటే శ్రీ గురునికి ఎంతో ప్రీతి. ఆ స్తోత్రంలో వ్యాకరణ దోషాలు, చందో దోషాలు ఉన్నాయి. ఎవరైనా ఆ తప్పులు దిద్దపోతే, శ్రీ గురుడు అంగీకరించక, ఆ స్తోత్రమలానే చదవాలని చెప్పేవారు!"                             

నలభైయవ  అధ్యాయం సమాప్తం

శ్రీ దత్తాయ గురవేనమః 

శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః   

No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box

నూతనయజ్ఞోపవీత ధారణ విధానము

  నూతనయజ్ఞోపవీత ధారణ విధానము జంధ్యాల పౌర్ణమి శ్రావణ పౌర్ణమి నాడు వస్తుంది. ఈ రోజు జీర్ణమైన (పాత) జంధ్యమును తీసివేసి కొత్త జంధ్యమును (యజ్ఞోప...