Thursday, April 30, 2020

గురు చరిత్ర అధ్యాయము -15


అధ్యాయము  -15




                                శ్రీ గణేశాయనమః                             శ్రీ సరస్వత్యేనమః                                                                                                  

శ్రీ గురుభ్యోనమః 


కథారంభము 




                         సిద్ధయోగి ఇలా చెప్పారు : "నాయనా! కొద్దికాలంలోనే శ్రీ  గురుని మహిమ అన్ని దిక్కులా వ్యాపించి, సుదూర ప్రాంతాలనుండి గూడా ఎందరెందరో తమ కోర్కెలు నెరవేర్చుకోవడానికి ఆయనను దర్శించేవారు. వారిలో మంచివాళ్ళతో బాటు భక్తుల వేషాలలో ఎందరో దుష్టులు కూడా ఉండేవారు. పూర్వం పరశురాముడు దుష్టులైన రాజులను ఓడించి సంపాదించిన భూమండలమంతా దానమిచ్చేసి సహ్యాద్రిపర్వతానికి దక్షిణదిక్కునున్న కొంకణదేశంలో ఒకచోట తపస్సు చేసుకుంటున్నాడు. కానీ కొందరు దురాశాపరులు  ఆయన వద్దకు వెళ్లి, తమకు కూడా భూమి ఇప్పించమని కోరారు. ఆయన ఆ ప్రదేశం కూడా వాళ్లకు దానమిచ్చి,  వాళ్ళ బెడదనుంచి తప్పించుకోడానికి సముద్రంలో ప్రవేశించి అదృశ్యమయ్యారు.    




                          అదే కారణంగా శ్రీగురుడు  కూడా వైద్యనాధంలో గుప్తంగా కొంతకాలం వుండదలచుకున్నారు. కనుక ఒక రోజున గృహస్థ శిష్యులకు ఇలా సెలవిచ్చారు : 'ఉపనయనాది సంస్కారాల వలన ద్విజుడైన బ్రహ్మచారి వేదాధ్యయనం చేస్తూ భక్తితో గురువును సేవించాలి. అతడికి పగటినిద్ర తగదు. దొరికిన భిక్షాన్నం  గురువుకర్పించి ఆయన ఇచ్చినది భుజిస్తూ, విద్యావంతుడు కావాలి. చివరకు గురువుకు దక్షిణ సమర్పించి, సమావర్తన హోమం చేయాలి. అటు తర్వాత గురుని అనుజ్ఞతో ఒక యోగ్యమైన కన్యను పెండ్లాడి గృహస్థాశ్రమ ధర్మాలను పాటించాలి. పుత్రుడు యుక్తవయస్కుడయ్యాక, అతనికి సర్వస్వమూ  సమర్పించి భార్యతో కూడా అరణ్యానికి వెళ్లాలి. తర్వాత గ్రామ్య విషయాలను వదిలి, భార్యయొక్క అనుమతితో సన్యసించాలి. సన్యాసికి జపము, భిక్షాటనము, ధ్యానము, శౌచము, అర్చన ధర్మాలు. అతడు స్త్రీ కథలను వినగూడదు. వాహనము లెక్కరాదు. మంచము తాకరాదు. పగలు నిద్రింపరాదు. నిరంతరమూ  ఆత్మద్రష్టయై ఉండాలి. వెదురు,  సొరకాయ,  చెక్క,  మట్టి - వీటితో చేసిన పాత్రలు మాత్రమే ఉపయోగిస్తూ, దండధారియై, పగలు మాత్రమే భుజించాలి. సంవత్సరమంతా తీర్తాటనం  చేస్తూ, మూడు పగళ్ళు మించి ఏ గ్రామంలోనూ నివశించక స్థిరచిత్తుడై ఉండాలి. అలా తిరగటానికి శరీరంలో శక్తి లేకపోతె, సదా దైవాన్ని, ధ్యానిస్తూ ఒక మహాక్షేత్రంలో నివశించాలి'.   





                                        ఇలా చెప్పి, గృహస్థ శిష్యులను వారి వారి గృహాలకు పంపి, సన్యాసులైన శిష్యులకు  శ్రీగురుడు ఇలా చెప్పారు :' నాయనలారా, మీరందరూ తీర్థయాత్రలకు వెళ్ళండి. మీకు మరలా  శ్రీశైలంలో బహుధాన్య సంవత్సరంలో మా దర్శనమవుతుంది' అన్నారు. అప్పుడా శిష్యులు, 'స్వామీ ! సర్వతీర్థాలు మీ పాదాల వద్దనే ఉన్నాయని శాస్త్రాలు చెబుతున్నాయి గదా! మిమ్ములను విడిచి మేమెక్కడికి పోగలము? దానివలన మాకు కలిగే లాభమేమున్నది? ' అన్నారు. అప్పుడు స్వామి, 'నాయనలారా! సన్యాసులమైన మనము ఐదురోజులకు మించి ఎక్కడా నిలువకూడదు. సర్వ తీర్థాలూ  దర్శించడం మన ధర్మం. దాని వలన మనస్సు స్థిరమవుతుంది. అటు తర్వాత ఒకచోట స్థిరంగా ఉండడం శ్రేయస్కరం' అని చెప్పారు. అప్పుడు శిష్యులు, 'స్వామీ ! మీ మాటయే మాకు ప్రమాణం. మేము ఏయే తీర్థాలు దర్శించాలో  సెలవియ్యండి' అని కోరారు. అప్పుడు శ్రీ గురుడు ఇలా చెప్పారు : 'నాయనలారా! తీర్థాలన్నింటిలోకి ఉత్తమమైన కాశీకి వెళ్ళి గంగను సేవించి, గంగాతట యాత్ర చేయండి. అటు తర్వాత యమున,  సరస్వతి నదులను కూడా అలానే సేవించండి. అందువలన పితృదేవతలకు  సంతృప్తి, మీకు శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతాయి. తర్వాత వరుణ,కుశావర్త, శతదృ, విపాశా, శరావతి, వితస్థా,అసిక్నీ, మరుధృదా, మధుమతి,పయస్విని, ఘృతవతి, రేవా, చంద్రభాగా, రేవతి,  సరయు,  గోమతి,  వేదిక,  కౌశికి, నిత్యజల,  మందాకిని, సహస్రవక్త,  పూర్ణ,  పుణ్య,  అరుణ,  బహుదా,  వైరోచని, పుష్కర, ఫల్గు, అలకనంద మొదలగు నదులలోనూ, నదీసంగమాలలోనూ స్నానం చేసి తటయాత్రలు చేయండి. అలానే శ్రీశైలము, అనంతము,  రామేశ్వరము,  సేతుబంధము,  శ్రీరంగము,  పద్మనాభము,  నైమిశారణ్యము, పురుషోత్తమము, కేదారము, మహాలయము, కోటిరుద్రము,  మాతృకేశము,కుబ్జతీర్థము, కోకాముఖి,  ప్రసాదతీర్థము,  విజయాతీర్థము, చంద్ర తీర్థము,   గోకర్ణము,  శంఖ కర్ణము అనే తీర్ధాలలో స్నానం చేయండి.        





                 అలానే అయోధ్య,  మధుర,  మాయా, కాంచీ,  ద్వారకా,  సాలగ్రామము, శబల గ్రామములు దర్శించండి. సవ్య మార్గంలో మూడుసార్లు గోదావరి తటయాత్ర చేస్తే పాపాలన్నీ నశించి, జ్ఞానం కలుగుతుంది. అలానే భీమేశ్వర,  పంజర, కుశతర్పణ, పూర్ణ,  కృష్ణవేణి,  తుంగభద్ర,  పంపా,  భీమా నదులకు తటయాత్ర చేయండి. హరిహర క్షేత్రము,  పాండురంగ క్షేత్రము,  మాతులింగము దర్శించండి. గంధర్వపురం(గాన్గాపురము) ఉత్తమమైన క్షేత్రము. అక్కడ ఎన్నో తీర్థాలున్నాయి. అచ్చట దేవతలు సులభంగా వరాలిస్తారు. అక్కడ భీమా - అమరజానదీ  సంగమమున్నది. అచ్చటి అశ్వత్థ వృక్షము సాక్షాత్తూ కల్పవృక్షమే. దానికి ఎదురుగా నృసింహ తీర్థము, దానికి తూర్పున పాపనాశ తీర్థము,  దాని పక్కనే రుద్రపాద తీర్థము, చక్ర తీర్ధము, తర్వాత కోటి తీర్థము మన్మధ తీర్థము ఉన్నాయి. అక్కడనే 'కల్లేశ్వరుడు' ఉన్నాడు. గంధర్వపురము సాటిలేని సిద్ధ భూమి గనుక, అక్కడ అనుష్టానం చేస్తే అతి త్వరగా అభీష్టాలు నెరవేరుతాయి. తుంగ- భద్ర నదుల సంగమము, మలాపహా సంగమము, నివృత్తి సంగమము దర్శించండి. బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినపుడు గోదావరికి, కన్యారాశిలోకి వచ్చినప్పుడు కృష్ణానదికి, తులారాశి లోకి వచ్చినప్పుడు తుంగభద్రకు, కర్కాటకంలో ప్రవేశించినప్పుడు మలాపహా నదికీ పుష్కరాలు వస్తాయి. అంటే గంగానది ఆయా పవిత్ర సంవత్సరాలలో ఆయా నదులలో వచ్చి ఉంటుంది కనుక వాటిని సేవించడం ఎంతో మంచిది. అలానే ఆయా నదులు సముద్రంలో కలిసే చోట స్నానం చేయడం వలన ఎంతో పుణ్యం వస్తుంది.          





                       కుంభకోణము,  కన్యాకుమారి,  మత్స్యతీర్థము,  పక్షితీర్థము,  ధనుష్కోటి, కొల్హాపురము,కరవీరము, మహాబలేశ్వరము  దర్శించండి. భిల్లవటి,  వరుణా  సంగమము,  కృష్ణా తీరంలోననున్న ఋష్యాశ్రమము దర్శించండి. అమరపురం వద్దనున్న కృష్ణవేణీ,  పంచనదీ  సంగమములో మూడురోజులు స్నానము,  ఉపవాసము  చేస్తే అన్ని కోరికలూ తీరడమే గాక, పరమార్థము గూడా లభిస్తుంది. యుగాలయము, శూర్పాలయము, కపిలాశ్రమము, కేదారము,  పిఠాపురము దర్శించండి. అక్కడ శ్రీ దత్తాత్రేయస్వామి ఉన్నారు. తర్వాత మణిగిరి, ఋషభాద్రి, కళ్యాణనగరము, అహోబిలము  దర్శించండి. కర్కాటకరాశిలో సూర్యుడు ప్రవేశించినప్పటినుండి నదులు రజస్వలలు  గనుక, వాటిలో స్నానం చేయకూడదు. నదీ తీరాలలో నివసించేవారికి మాత్రమే ఈ నిషేధము వర్తించదు. నదులకు క్రొత్తనీరు వచ్చే రోజులే రజస్వల కాలము'. అప్పుడు శిష్యులాయనకు సాష్టాంగ నమస్కారము చేసి, వారి ఆశీస్సులు పొంది, తీర్థయాత్రలకు వెళ్లారు. నేను మాత్రం ఆయన సేవ చేయడానికి వారితో కూడానే ఉన్నాను".              





 పదిహేనవ అధ్యాయం సమాప్తము.  


శ్రీ దత్తాయ గురవేనమః 

శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః   

No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box

నూతనయజ్ఞోపవీత ధారణ విధానము

  నూతనయజ్ఞోపవీత ధారణ విధానము జంధ్యాల పౌర్ణమి శ్రావణ పౌర్ణమి నాడు వస్తుంది. ఈ రోజు జీర్ణమైన (పాత) జంధ్యమును తీసివేసి కొత్త జంధ్యమును (యజ్ఞోప...