Wednesday, April 22, 2020

గురు చరిత్ర అధ్యాయము -8



అధ్యాయము  -8




                                శ్రీ గణేశాయనమః                             శ్రీ సరస్వత్యేనమః                                                                                                      
 శ్రీ గురుభ్యోనమః 


కథారంభము 


                                నామధారుకుడు,   "స్వామీ ! శ్రీపాద శ్రీవల్లభులు  గోకర్ణ క్షేత్రంలో ఎంతకాలమున్నారు? అసలు భగవదవతారమైన ఆయనకు పుణ్యక్షేత్ర సందర్శనం చేయవలసిన పనిఏమి? నాకి సందేహ నివృత్తి చేసి, అటుపై శ్రీపాద స్వామి చరిత్ర తెలపండి' అని కోరాడు. సిద్ధయోగి ఇలా చెప్పారు:  "శ్రీపాద స్వామి గోకర్ణ క్షేత్రం లో మూడు సంవత్సరాలు నివసించి, తర్వాత శ్రీశైలం వెళ్లారు. అక్కడ నాలుగు నెలలు ఉండి భక్తులను అనుగ్రహించి. అక్కడ నుండి నివృత్తి సంగమానికి వెళ్లి, స్నానం చేసి, తర్వాత కురువపురం వెళ్ళారు. అక్కడ కృష్ణ - వేణి అనే రెండు నదులు కలవడం వలన అది ఎంతో పవిత్రమైనది. దానికి తోడు భగవంతుడైన శ్రీ పాద స్వామి అక్కడ స్థిర నివాసం చేయడం వలన ఆ క్షేత్రం లోక విఖ్యాతమైంది. ఇప్పుడు దానిని "కురుగుడ్డి' అంటారు. అక్కడ శ్రీపాద స్వామిని శ్రద్ధాభక్తులతో కొలిస్తే సర్వకామ్యాలు సంప్రాప్తమ వుతాయి. అక్కడ శ్రీపాద స్వామి అదృశ్యులై , మరొక అవతారం ధరించారు. అయినా ఇప్పటికీ ఆ కురుపురం లో ఆయన గుప్త రూపంలో స్థిరంగా ఉన్నారు.    


                        శ్రీపాద వల్లభులు సాక్షాత్తూ  భగవంతుడే. వారి పాదాలలో సర్వతీర్థాలూ  ఉంటాయి. అయినప్పటికీ పుణ్యక్షేత్రాల అన్నింటిని పావనం చేయడానికీ, ఆయా క్షేత్రాలలోని ముముక్షువులను ఉద్ధరించడానికి కూడా ఆయన దేశాటనం చేశారు. పుణ్యక్షేత్రాలు, పుణ్యనదులూ తమను సేవించిన భక్తుల పాపాలు చిరకాలం కడిగివేయడం వలన చివరకు అవే మలినం అవుతాయి. అప్పుడు శ్రీపాదుల వంటి మహాత్ముల పాదస్పర్శవలన తిరిగి పవిత్రమవ్వాలని అవి తపించి  పోతుంటాయి. ఈ విషయం శాస్త్రాలు చెప్పాయి కూడా. ఇక శ్రీపాదుల వృత్తాంతం వివరిస్తాను. శ్రద్ధగా విను.                                         


                   కురుపురంలో వేదవిదుడైన సద్భ్రాహ్మణుని  భార్య అంబిక మహాపతివ్రత. కానీ పూర్వకర్మ వలన ఆమెకు ఎందరో పిల్లలు పుట్టి కూడా కొద్దికాలంలోనే చని పోతూ ఉండేవారు. ఆమె ఎన్నో దానాలు, వ్రతాలు చేసింది. ఎన్నో తీర్థ క్షేత్రాలు దర్శించింది. కొంతకాలానికి ఆమెకు ఒక కొడుకు పుట్టాడు. కానీ దురదృష్టవశాత్తు ఆ పిల్లవాడు స్థబ్థుడు , బుద్ధిహీనుడు, జడుడూ అయ్యాడు. అయినప్పటికీ, లేక లేక కలిగిన అతనిని తల్లిదండ్రులు ఎంతో గారాబంగా పెంచుతున్నారు.  ఎనిమిదవ సంవత్సరం రాగానే తండ్రి అతనికి ఉపనయనం చేసి వేదాధ్యయనం చేయించాలని చూచాడు కానీ, ఆ మందమతి ఎంత కాలానికి ఒక్క వేద మంత్రమైనా సరిగా నేర్చుకో లేక పోయాడు. ఆ మంత్రానుష్టానం ద్వారానైనా అతనిని బుద్ధిమంతుని గా చేయాలని తండ్రి అతని కొడుతుండేవాడు.  అది చూడలేక అంబిక అడ్డు వచ్చి, 'వీడు లేకలేక కలిగిన పిల్లవాడు. మందమతి అయిన వీనిని దండిస్తే మటుకు ఏమి లాభం? వీనికి విద్య రాకున్నా సరే, మీరు వాణ్ణి  కొట్టవద్దు. బ్రతికినంత కాలం వీనిని ఇకనైనా సుఖంగా బ్రతకనివ్వండి. ఇక మీదట మీరు వానిని శిక్షిస్తే, నేను మీ ఎదుటే బావిలో దూకి మరణిస్తాను' అన్నది. ఆ బ్రాహ్మణుడు గూడా ఆలోచించి, ఆ పిల్లవాడు 'అజాగళస్నస్తనం', వలె వ్యర్ధుడని  తలచి నిరాశ చెంది వూరుకున్నాడు.                      


                       కొంతకాలానికి ఆ బ్రాహ్మణుడు ఆ దిగులుతోనే మరణించాడు. దిక్కులేక అతని భార్య అంబిక తన కొడుకుతో గూడా బిచ్చమెత్తుకుని బ్రతుకుతూ ఉండేది. ఆ బాలుని చూచి గ్రామస్తులు, ' ఓరి! పండితపుత్రా ! నీ బ్రతుకు వ్యర్థం. నీవు నీ కులానికే మచ్చ తెచ్చావు. నీ తల్లి బిచ్చమెత్తు కొస్తే కూర్చుని తింటున్నావు. సిగ్గులేదా? నదినుండి మంచి నీరు మోసి అయినా బ్రతుకరాదా? నీ వలన నీ పితృదేవతలకు  కూడా అధోగతి కలుగుతుంది. నీ బ్రతుకుకు ఏమి ప్రయోజనం? పవిత్రమైన భిక్షా వృత్తి నీవంటి అసమర్ధుడు కి తగదు. ఇలా బ్రతికేకంటే ఈ కృష్ణానదిలో దూకి చావరాదా?" అని పరిహసించేవారు. చివరకు ఆ బాలుడు లోకుల పరిహాసాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకోదలచి నది వైపు పరిగెత్తాడు. అతనిని వారించగల శక్తిని కోల్పోయిన అతని తల్లికూడా నిస్సహాయురాలై, తాను కూడా ఆత్మహత్య చేసుకోదలచి అతని వెంట పరిగెత్తసాగింది. దారిలో శ్రీపాద స్వామి ఎదురై అతనిని నిలిపి, 'బ్రాహ్మణుడా! తొందరపడవద్దు. పూర్వకర్మ వల్ల నీకీ దుస్థితి దాపురించింది. దానికి తోడు నీవిప్పుడు బలవంతంగా మరణిస్తే నీకు బ్రాహ్మణ హత్య, ఆత్మహత్య దోషాలు చుట్టుకుంటాయి. అవి నివారింపరానివి. అందువలన నీవు జీవించి, ఎంతటి కష్టాలైనా ఓరిమితో అనుభవించి దుష్కర్మనుండి శాశ్వతంగా విముక్తుడవడం మంచిది' అన్నారు.   


                     అంబిక శ్రీపాద స్వామికి నమస్కరించి, ' స్వామీ ! ఒక వంక భర్తను కోల్పోయి, మరొకవంక వ్యర్థుడైన  ఈ పుత్రుని వలన ఎటువంటి సద్గతీ ఆశింపజాలని నన్ను చూడడమే మహా పాపంగా లోకులు పరిగణిస్తున్నారు. నేనిక బ్రతికి మాత్రం చేయగలిగిన దేమున్నది?' అన్నది. ఆమె మాటలు విని, కరుణార్ధ్ర   హృదయుడైన శ్రీపాద స్వామి, అమ్మా ! ఆత్మహత్య వలన రాబోయే జన్మలో మరొక పాపం కూడా అనుభవించవలసి వస్తుందేగాని వేరే ప్రయోజనమేమున్నది? కనుక నీవు మిగిలిన జీవితమంతా శివపూజ లోనే గడుపు. అలా చేస్తే వచ్చే జన్మలో నావంటి కుమారున్ని పొందగలవు' అన్నారు. ఆమె ఆలోచించి, 'స్వామి, నేను మీరు చెప్పినట్లే చేస్తాను. కానీ దాని వలన ప్రయోజనమే మో నాకు తెలియలేదు. దయచేసి వివరించండి' అన్నది.  




                 శ్రీపాద స్వామి, 'అమ్మా ! ఉజ్జయినీ   పట్టణాన్ని చంద్రసేనుడనే రాజు పాలించేవాడు. అతని మిత్రుడు మణిభద్రుడనేవాడు, శివుని వరప్రభావం వలన చింతామణిని  పొందాడు. ఆమణి  యొక్క విలువ లెక్కకు మీరినదని  తెలుసుకుని, దానిని ఎలాగైనా చేజిక్కించుకోవాలని కొందరు రాజులు చతురంగ బలాలతో యుద్ధానికి తరలివచ్చారు. ఆ సమయంలో మణిభద్రుడు, చంద్రసేన మహారాజు - ఇద్దరూ ఏకాగ్రమనస్కులై ప్రదోషకాలంలో శివపూజ చేయసాగారు. ఒక త్రయోదశి, శనివారం నాడు ప్రదోష సమయంలో వారు పూజ చేస్తుంటే చూచి  ఆ పట్టణంలోని గోపబాలకులు కూడా తమ యిండ్ల  ముంగిళ్లలో ఆకులతోనూ, పూలతోనూ పూజ చేయసాగారు. వారి తల్లులు  ఆ పిల్లలను భోజనం కోసం ఇండ్లలోకి లాక్కొని పోయారు. వారిలో ఒకరి వద్ద నుండి వాని తల్లి పూజా  సామాగ్రిలాగి వేసి, వాటిని బలవంతంగా లేవదీసింది. అప్పుడు ఆ బాలుడు తన శివపూజకు విఘ్నం  కలిగినందుకు చాలా దుఃఖపడి, ఆ దోష పరిహారానికి మరణించడానికి సంసిద్ధుడయ్యాడు. అప్పుడు విశ్వసాక్షియైన  పరమేశ్వరుడు అతనికి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. ఆ బాలుడు ఆ  దివ్య మూర్తికి ప్రణామం చేసి తన తప్పును మన్నించమని ప్రార్థించాడు. శివుడు, 'వత్సా ! భక్తి చేత నీవు నా సాయుజ్యం  పొందగలవు. నీ తల్లి తెలియక అపరాధం చేసింది. అయినా నీ అర్చనా విధానం చూచింది గనుక మరుజన్మలో విష్ణుజనని అవుతుంది' అని వరమిచ్చి అంతర్థానమయ్యాడు.     





                     అక్కడున్న లింగము దివ్య తేజస్సుతో వెలిగిపోతున్నది. యుద్ధానికి వచ్చిన రాజులంతా ఇది చూచి, సూర్యుడు రాత్రిపూటకూడా ప్రకాశిస్తున్నాడని తలచారు. అంతటి భక్తిశ్రద్ధలు ప్రజలలో కలిగించిన పుణ్యాత్ముడైన చంద్రసేనుడికి మేలు చేయదలచి, అంతటి మహానుభావునితో యుద్ధం చేయాలనుకోవడం బుద్ధి తక్కువని పశ్చాత్తాపం చెంది, వారంతా సగౌరవంగా చంద్రసేన - మణిభద్రులను  దర్శించడానికి వచ్చారు. అప్పుడే పూజ ముగించిన రాజు ఆ ప్రకాశానికి కారణం తెలుసుకుని, తనను చూడవచ్చిన ఆ రాజులతో కలిసి ఆ ప్రదేశానికి వెళ్లి, ఆ దివ్య లింగాన్ని చూచి ఆనందించాడు. ఆ గోపబాలకుడు చెప్పగా ఆ వృత్తాంతమంత  విన్న చంద్రసేనుడు, మిగిలిన రాజులూ  ఆ పిల్లవాడికి గోపాధిపత్యమూ, ధనము ఇచ్చి వెళ్ళిపోయారు. తరువాత ఆ గోపాలుని  తల్లి యశోదగా జన్మించి విష్ణువుకు జనని అయింది. కనుక అమ్మా! శివపూజా మహిమ వలన మరుజన్మలో నీవు గూడా అలాగే అవుతావు' అన్నారు.                               




                      ఈ కథ విని అంబిక ఇలా అడిగింది  : ' స్వామీ !  శివపూజ వలన కలిగే ఫలితం వచ్చే జన్మలో గదా   ? ఈ జీవితశేషం నేనెలా గడపాలి? మహానుభావా ! అందరి పరిహాసాలకూ గురియవుతున్న నా బిడ్డడు ఏ క్షణాన ఆత్మహత్య చేసుకుంటాడో తెలియదు. నన్ను మాతృత్వంతో  రక్షించు'  అని వేడుకున్నది. ఆ కరుణాసముద్రుడి  హృదయం కరిగి, తన చేతిని ఆమె కుమారుని తలపై పెట్టి ప్రణవముచ్చరించాడు. ఆ మూర్ఖ బాలుడు తక్షణమే బృహస్పతి అంతటి జ్ఞాని,వక్తా  అయ్యాడు. అప్పుడు అతనిని మాతృసేవకు నియోగించి, శ్రీపాద స్వామి ఆమెతో, 'అమ్మా ! దుఃఖం విడిచి నీ జీవిత శేష మంతా శివపూజలో గడుపు. వచ్చే జన్మలో నా అంతటి కుమారుడు కలుగుతాడు' అని వరమిచ్చాడు. ఆమె పరమానందభరితురాలై పుత్రునితో తన ఊరికి వచ్చి, జీవితమంతా శివార్చన లో గడిపి ధన్యురాలయింది."     



        ఎనిమిదవ అధ్యాయం సమాప్తము.


శ్రీ దత్తాయ గురవేనమః 

శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః   




No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box

నూతనయజ్ఞోపవీత ధారణ విధానము

  నూతనయజ్ఞోపవీత ధారణ విధానము జంధ్యాల పౌర్ణమి శ్రావణ పౌర్ణమి నాడు వస్తుంది. ఈ రోజు జీర్ణమైన (పాత) జంధ్యమును తీసివేసి కొత్త జంధ్యమును (యజ్ఞోప...