Saturday, April 25, 2020

గురు చరిత్ర అధ్యాయము -10


*** శుక్రవారం పారాయణ ప్రారంభం ***

అధ్యాయము  -10




     శ్రీ గణేశాయనమః        శ్రీ సరస్వత్యేనమః                                        
   శ్రీ గురుభ్యోనమః 


కథారంభము 


                           సిద్ధయోగి చెప్పినదంతా శ్రద్ధగా వింటున్న నామధారకుడు, "స్వామీ ! శ్రీపాదవల్లభులు కృష్ణానదిలో అంతర్ధానమై, వేరొకచోట మరొక అవతారమెత్తారు అని చెప్పారు గదా? అటువంటప్పుడు ఆయన గుప్త రూపంలో కురువపురం లో ఉన్నారని, ఇప్పటికీ అక్కడ తమను ప్రార్థించిన భక్తులను రక్షిస్తున్నారనీ  కూడ చెప్పారే! అదెలా సాధ్యం?" అని అడిగాడు.                                





                        "నాయనా! శ్రీపాదస్వామి సాక్షాత్తూ  భగవంతుడే. భగవంతుని మహిమకు అంతులేదు. ఆయన ఏమైనా చేయగల సమర్ధుడు. మొదట ఒక్కడుగా ఉన్న ఆయన తర్వాత త్రిమూర్తుల రూపం ధరించి, వేరు వేరు కార్యాలు చేయడం లేదా? శ్రీ పాదులు ఆ త్రిమూర్తుల స్వరూపమే. ఆయన మహిమకు సంభవము, అసంభవము అన్నది లేదు. ఆయన అంతర్ధానమయ్యాక కూడా ఆ క్షేత్రంలో తమనాశ్రయించిన భక్తులను రక్షిస్తూ ఉన్నారని తెలిపే దివ్యలీలనొకదానిని చెబుతాను విను.     






                           కాశ్యపస గోత్రీకుడైన వల్లభేశుడనే బ్రాహ్మణుడు వాణిజ్యం చేసుకుని జీవిస్తుండేవాడు. అతని కుటుంబం చాలా పెద్దది. కురువపురంలో అంతర్హితుడైన  శ్రీపాదస్వామి, తమను సేవించిన భక్తులను రక్షిస్తూ సూక్ష్మ రూపంలో ఆ క్షేత్రంలోనే ఉన్నారని విని, అతడు స్వామికి భక్తుడయ్యాడు. అతడు ప్రతి సంవత్సరమూ  నియమంగా ఒక్కసారైనా కురువపురం దర్శించి స్వామిని సేవిస్తూ ఉండేవాడు. ఒకనాడతడు స్వామిని స్మరించి తనకు వ్యాపారంలో మంచి లాభమొస్తే స్వామి దర్శనానికి కురువపురం వెళ్లి, అక్కడ ఆయన ప్రీతికొరకు వేయిమంది బ్రాహ్మణులకు సంతర్పణ చేస్తానని మొక్కుకున్నాడు. అప్పటినుండి అతడు స్వామిని స్మరించి యే  పట్టణానికి వెళ్ళినా,  అక్కడ స్వామి దయవలన అతడు ఆశించిన కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా లాభం రాసాగింది. అందువల్ల అతని భక్తి విశ్వాసాలు మరింత దృఢమ య్యాయి. అతడు తనకొచ్చిన లాభానికెంతో సంతోషించి, తన మ్రొక్కు చెల్లించడానికి కావల్సినంత డబ్బు మూటగట్టుకొని కురువపురానికి  బయల్దేరాడు. నలుగురు దొంగలు అతని వద్ద ఎంతో డబ్బు ఉన్నదని పసిగట్టి, యాత్రికుల వేషాలు ధరించి అతనికి తోడై నారు. తాము కూడా ప్రతి సంవత్సరము కురువపుర యాత్ర చేస్తుంటామని  చెప్పి, అతనితో ఎంతో ఆదరంగా ప్రవర్తించి అతనిని నమ్మించారు. ఇలా రెండు మూడు రోజులు ప్రయాణం చేసి, వాళ్లంతా ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి చేరగానే ఆ దొంగలు అతని పై పడి అతని తల నరికి, అతని వద్దనున్న ధనం అపహరించారు. తర్వాత ఆ సంగతి ఎవరికీ తెలియకుండా చేయాలని తలచి, ఆ దేహాన్ని దహనం చేయడానికి సిద్ధమయ్యారు. వల్లభేశుడు, మరణించే ముందు చివరిక్షణంలో, 'శ్రీ పాద వల్లభా!' అని కేక పెట్టాడు. అందువలన భక్త రక్షకుడైన శ్రీ పాద శ్రీ వల్లభులు జడలు, భస్మము, త్రిశూలము ధరించిన యతి రూపంతో ఆ దొంగలకు ప్రత్యక్షమై, త్రిశూలంతో వాళ్లను పొడిచి చంపాడు. అప్పుడా దొంగలలో ఒకడు ఆయన పాదాలపై బడి, 'ప్రభూ ! నేను దుష్టబుద్ధి తో ఈ బ్రాహ్మణుని వెంబడించలేదు. నేను తెలియక  వీరిని దారిలో కలిశాను. నిజానికి నేనెన్నడూ దొంగతనం చేసి ఎరుగను. సర్వసాక్షి అయిన మీరు అంతర్దృష్టితో గమనిస్తే మీకే తెలుస్తుంది. స్వామి, నన్ను క్షమించి విడిచిపెట్టవలసినది' అని ఆయనను శరణు వేడాడు.






                  స్వామి అతనికి అభయమిచ్చి, కొంచెం విభూతి ప్రసాదించి, దానిని వల్లభేశుని శరీరం పై చల్లి, తెగిపడియున్న తలను మొండానికి అతికించమని ఆదేశించారు. అతడలా అతికిస్తుండగా శ్రీపాదస్వామి వల్లభేశుని శిరస్సుపై తమ అమృతదృష్టిని సారించి, మరుక్షణమే అంతర్థానమయ్యారు!వల్లభేశుడు తిరిగి బ్రతికాడు. అతనికి పూర్తి స్పృహ వచ్చేసరికి సూర్యోదయమైంది. అతని ప్రక్కన ఒక వ్యక్తి మాత్రమే ఉన్నాడు. వల్లభేశునికి అంతకుముందు జరిగినదేమీ గుర్తులేదు. అందువలన అక్కడ చచ్చిపడియున్న దొంగలను చూచి ఆశ్చర్యపడి, 'వీళ్లందరూ ఎలా మరణించారు? నీవొక్కడవే ఎలా బ్రతికి వచ్చావు? ఇంత జరిగినా నీవొక్కడివే యింకా యిక్కడే వున్నావేమిటి?'  అని అడిగాడు. అప్పుడాతడు, 'అయ్యా ఇప్పుడొక అద్భుతమైన దైవలీల జరిగింది. మనననుసరించి వచ్చినవారు దొంగలే గాని, యాత్రికులు గారు. వారు నిన్ను చంపి నీ ధనమపహరించారు. ఇంతలో ఒక తపస్వి వచ్చి ఈ దొంగలను చంపి, నిన్ను బ్రతికించారు. నీకు నన్ను కాపలాగా ఉంచి ఆయన అంతర్థానమయ్యారు. ఆ మునీశ్వరుడెవరో గాని, సాక్షాత్తూ పరమశివునిలా ఉన్నారు!' అని చెప్పాడు. ఆ మునీశ్వరుడు సాక్షాత్తూ శ్రీపాదవల్లభులేనని తెలుసుకొని భగవంతుడైన ఆయన దర్శనం తనకు లభించనందుకు వల్లభేశుడు  ఎంతో పరితపించాడు. అతడు వెంటనే అమితోత్సాహంతో ఆ ధనం తీసుకుని కురువపురం చేరాడు. అక్కడ శ్రీ పాదుని పాదుకలను సకల ఉపచారాలతో పూజించి ముందు తాను అనుకున్నట్లు వెయ్యిమందికి గాక నాలుగు వేల మంది బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టి, దక్షిణ తాంబూలాలతో వారందరినీ సత్కరించి సంతోషపెట్టాడు. 





                        ఈ విధంగా శ్రీపాదస్వామి కురువపురం లో అదృశ్యంగా ఉంటూ, ఇలాంటి లీలలు ఎన్నో చేశారు. నేటికీ సజ్జనులకు అక్కడాయన దర్శనమిస్తారు. అయినప్పటికీ ఆయన శ్రీ నృసింహ సరస్వతీ అనే యతిగా వేరొకచోట అవతారమెత్తి లోకోద్ధరణ చేశారు. భక్తులు ఎక్కడ వున్నప్పటికీ శ్రీపాదస్మరణ చేస్తే చాలు. వారికి స్వామి అభీష్టాలనిచ్చి రక్షిస్తాడు. అట్టి స్మరణకనుగుణమైన నామం తరతరాలుగా యిలా వున్నది" అన్నారు సిద్ధముని-


          "దిగంబరా,  దిగంబరా, శ్రీపాద వల్లభ దిగంబరా | 

    దిగంబరా,  దిగంబరా - అవధూత చింతన  దిగంబరా ||                          

పదవ అధ్యాయం సమాప్తము           




శ్రీ దత్తాయ గురవేనమః 


శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః   


No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box

నూతనయజ్ఞోపవీత ధారణ విధానము

  నూతనయజ్ఞోపవీత ధారణ విధానము జంధ్యాల పౌర్ణమి శ్రావణ పౌర్ణమి నాడు వస్తుంది. ఈ రోజు జీర్ణమైన (పాత) జంధ్యమును తీసివేసి కొత్త జంధ్యమును (యజ్ఞోప...