Saturday, April 25, 2020

గురు చరిత్ర అధ్యాయము -11


అధ్యాయము  -11



                                శ్రీ గణేశాయనమః                             శ్రీ సరస్వత్యేనమః  

                                                               శ్రీ గురుభ్యోనమః 



కథారంభము 




                     నామధారకుడు అత్యంతాసక్తితో యిలా అన్నాడు : " అటు తర్వాత శ్రీ దత్తాత్రేయ స్వామి రెండవ పర్యాయము ఎక్కడ అవతరించారు? ఏయే  లీలలు ప్రదర్శించారు? అప్రమేయడైన ఆ భగవంతుని లీలలు మీరు చెబుతూ ఉంటే వినాలన్న  కోరిక నాలో పెరుగుతున్నదే గాని, తరగడం లేదు. ఆ రెండవ అవతార విశేషాలు కూడా వివరించండి". అంతటి శ్రద్ధాళువైన శ్రోత లభించినందుకు సిద్దునికి భగవంతుని లీలలు తనివితీరా వివరించి చెప్పే అవకాశం లభించింది. అట్టి అదృష్టానికి పొంగిపోయి  సిద్ధుడు, " నామధారకా! దీనులను ఉద్ధరించడానికి తనను తాను దత్తం చేసుకున్న పరమేశ్వరుని చేతలు యోగీంద్రులకు  కూడా ఊహించ సాధ్యం కానివి. కనుక నేనెంత వర్ణించినా అగాధమైన ఆ గాధలో లవలేశమే  అవుతుంది గాని, ఆయన లీలలన్నీ  చెప్పినట్లు కాదు సుమా! ఇక విను" అని ఇలా చెప్పారు :                     





           "శ్రీ పాదస్వామి ఆదేశించినట్లు అంబిక జీవిత శేషమంతా శివపూజలో గడిపింది. ఆమె మరుజన్మలో మహారాష్ట్రంలోని 'కారంజా', లేక 'లాడకారంజా ' అను గ్రామంలో (అకోలా జిల్లా ) వాజసనేయ శాఖకు చెందిన ఒక సద్భ్రాహ్మణుని కుమార్తెగా జన్మించింది. తల్లిదండ్రులు ఆమెకు 'అంబ' అని నామకరణం చేసారు. ఆమెకు పూర్వజన్మ సంస్కారం వలన సౌశీల్యంతో బాటు శివభక్తి కూడా అబ్బింది. ఆమెకు యుక్త వయస్సు రాగానే మాధవశర్మ అనే బ్రాహ్మణోత్తమునికిచ్చి  వివాహం చేసారు. అతడు మంచి శివభక్తుడు. ఆ ప్రాంతంలోని  స్మార్తులకు  శివ వ్రతం చేసుకునే అలవాటు ఉండేది గనుక, వారిని శివవ్రతులంటారు. పూర్వజన్మ సంస్కారానికి తోడు ఈ జన్మలో భర్త యొక్క సత్సాంగత్యం వలన ఆమె ప్రతిదినమూ సంధ్యా సమయంలో శివపూజ, భర్తతో కలిసి శని ప్రదోష పూజ, శని త్రయోదశి  నాడు విశేషమైన పూజ చేస్తుండేది. విశేషించి అంబ తన భర్తను, సూర్యుణ్ణి ఛాయాదేవి వలె విడనాడక సర్వోపచారాలూ చేస్తుండేది. ఇలా 16 సంవత్సరాలు గడిచాక అంబ గర్భవతియైంది. మాధవశర్మ సకాలంలో పుంసవనాది కార్యక్రమం నిర్వర్తించాడు. నెలలు నిండిన తర్వాత మహామహిమాన్వితమైన ఒక శుభ లగ్నంలో ఆమెకొక మగబిడ్డ కల్గాడు.     





                నామధారకా ! ఆ పిల్లవాడు పుట్టగానే అందరి పిల్లలవలె ఏడ్వలేదు. సరిగదా, స్పష్టంగా ప్రణవముచ్చరించాడు. అది విన్నవారు ఆశ్చర్యపోయారు. జ్యోతిష్య శాస్త్ర    విద్వాంసులు అతని జాతకం చూసి, 'మాధవశర్మా ! నీ భాగ్యం పండింది. ఈ శిశువు సాక్షాత్తూ భగవంతుడే ! ఇతడు మనవలె గృహస్థాశ్రమం స్వీకరించడు. చిన్న వయసులోనే సన్యాసం స్వీకరించి జగద్వంద్యుడవుతాడు. ఇతని చరణాలు ధ్యానించిన భక్తులకు కామధేనువు అవుతాడు. ఇతని దర్శనం చేతనే పతితులు  పావనులవుతారు. ఇతనిని కన్నందువలన మీకు కీర్తి, ప్రతిష్టలు, దివ్య సుఖాలు లభిస్తాయి" అని దైవజ్ఞులు చెప్పారు. మాధవ శర్మ ఆ విద్వాంసులను ఘనంగా దక్షిణ తాంబూలాలతో సత్కరించాడు. వారు సెలవు తీసుకుంటూ, 'మాధవశర్మా ! ఈ బాలునికి శ్రీ సిద్ధులు దాస్యం చేస్తాయి. నవనిధులు పరిచారికులవుతాయి' అని ఆశీర్వదించారు. 





                        ఆ బాలుడు పుట్టిన వెంటనే ప్రణవముచ్చరించిన సంగతి వాడవాడలా ప్రాకిపోయి, అతనిని చూడడానికి జనం ఇసుక వేస్తే రాలనంతగా వచ్చారు. పిల్లవానికి దృష్టిదోషం తగలకుండా తండ్రి రక్షా బంధనం చేయించాడు. తల్లి అతనికి ఉప్పు, మిరియాలు, ఎండు మిరపకాయలు,  వేపాకులతో దృష్టి తీసేది. తర్వాత ఒక సుముహూర్తంలో ఆ పిల్లవానికి 'శాల గ్రామదేవ' అని పేరు పెట్టారు. కానీ ఇంట్లో అందరూ అతనిని' నరహరి' అని పిలుచుకునేవారు. నరులంటే  అజ్ఞానబద్దులైన  మానవులు;         'హరి' యంటే మానవుల యొక్క అజ్ఞానం వలన కలిగిన దైన్య, తాప, పాపాలను పోగొట్టే వాడని అర్థం. ఆ పేరు ముందుగానే ఆయన అవతారమూర్తియని సూచిస్తున్నట్లున్నది.





                     బలహీనంగా ఉండటం వలన, అంబవద్ద పిల్లవానికి చాలినన్ని పాలు లేవు. పిల్లవానికోసం ఒక దాదిని గాని, పాడి మేకను గాని, ఏర్పాటు చేయాలని ఆ దంపతులు ఆలోచిస్తుండగా, ఆ పిల్లవాడు తన చిన్నారి చేతులతో తల్లి యొక్క వక్షస్థలాన్ని స్పృశించాడు. వెంటనే ఆమెకు స్థన్యం పెల్లుబికి, 32 ధారలుగా కారి నేలపైబడ్డాయి. ఈ విషయం అందరికీ తెలిస్తే బిడ్డకు దృష్టిదోషం తగులుతుందని వెరచి అంబ ఈ లీలను రహస్యంగా ఉంచింది. ఆ పిల్లవాడు ఉయ్యాలలో పడుకోబెడితే ఏడ్చేవాడు; నేల మీద పడుకోబెడితే ఆడుకునేవాడు. ఇలాంటి లీలలు ఎన్నో జరిగినప్పటికీ తల్లి వాటిని ప్రకటించలేదు. అందువలన ఆ ప్రభువు యొక్క సంపూర్ణమైన దివ్యత్వం అందరికీ తెలియలేదు.                     





                  ఇలా సంవత్సరము గడిచినా, అతనికి ఒక్క మాట కూడా రాలేదు. కులదేవతలనారాధించమని కొందరు, మర్రి ఆకుల విస్తళ్లలో బ్రాహ్మణులకు భోజనం పెట్టించమని కొందరూ, రావి ఆకుల విస్తళ్లలో భోజనం పెట్టించమని మరి కొందరు చెప్పారు. మాటలు చెబుతూ అతని చేత అన్పించడానికి యత్నిస్తుంటే క్రమంగా వస్తాయని కొందరు, అతడు మాత్రం మాటలు వచ్చినా కొంతకాలం తర్వాత మాత్రమే మాట్లాడుతాడు అని మరికొందరు అనేవారు. వారందరి మాటలు విని నరహరి నవ్వేవాడు. ఎవరేమడిగినా, 'ఓం' అన్నదే  అతని సమాధానం. ఆ సంగతి విని కొందరు పెద్దలు,'ఇతడు మన మాటలు వినగలుగుతున్నాడు. గనుక ఇతడు చెవిటివాడు గాదని స్పష్టమవుతున్నది' అనేవారు. ' అతడు మూగవాడు అయితే అంత స్పష్టంగా 'ఓం' అనడం సాధ్యం కాదు. అతడు మాటలొచ్చి గూడా ఎందుకో  మాట్లాడటం లేదు' అని కొందరు తల్లికి ధైర్యం చెప్పేవారు. ఆమె ఎవరు ఏది చేయమని చెప్పినా అదల్లా  చేసేది. తమ కులదైవమైన దత్తస్వామికి ప్రత్యేక పూజలు చేసేది.





                                       ఇలా నరహరికి ఏడవ సంవత్సరం వచ్చింది. కానీ అతడు మాట్లాడనేలేదు. బాలుడు మూగవాడవుతాడని తల్లిదండ్రులెంతో కలత చెందారు. ఒకనాడు అంబ అతని పరిస్థితికి కంటతడి పెట్టింది. అది చూచి నరహరి సైగలతో ఆమెను వారించి, ప్రక్కనేవున్న ఒక యినుప వస్తువును తెప్పించి చేతితో త్రాకాడు. తక్షణమే అది బంగారంగా మారింది. ఆశ్చర్యంతో తల్లిదండ్రులు మరికొన్నియినుప వస్తువులను అతనిచేత తాకించారు. అవి కూడా బంగారంగా మారాయి. తమ పిల్లవాడు సామాన్యుడు కాడని, ఆజన్మసిద్ధుడనీ వారు గుర్తించారు. అయినప్పటికీ ఆ దంపతులు అతడు మాట్లాడకపోవడం గురించి దిగులు పడుతూనే వుండేవారు. అతడు వేదాధ్యయనం చేసి స్వధర్మాన్నెలా  పాలించగలడన్నదే  మాధవ శర్మకున్న దిగులు. తల్లి ఒకరోజతనిని అక్కున జేర్చుకుని కన్నీరు కారుస్తూ, ' నా కన్నతండ్రీ, నీ మాటలు విని ఆనందించే భాగ్యం మాకు లేదా? ' అన్నది. అది విని నరహరి నవ్వి, తనకు ఉపనయనం చేస్తే మాట్లాడుతానని, మొట్టమొదటగా ఆమెతోనే మాట్లాడుతాననీ సైగల ద్వారా తెలిపాడు. ఆ సంగతి విని మాధవశర్మ ఆశ్చర్యపడి, అతని ఉపనయనానికి ఒక శుభ ముహూర్తం నిర్ణయించి, ఊరివారినందరినీ  ఆహ్వానించాడు. గ్రామస్తులందరూ అతడి ఆశలు అడియాశలై, నలుగురిలో తలవంపులకు గురి అవుతాడని తలచారు. కొందరు పెద్దలు మాత్రం, ' అయ్యా, ఆ పిల్లవాడు గాయత్రీ మంత్రం ఉచ్చరించగలిగితే మనకేమి,  లేకపోతేనేమి? మనకు మాత్రం మృష్టాన్న భోజనము, ఘనంగా దక్షిణ తాంబూలాలు లభిస్తాయి. కనుక ఈ ఉపనయన కార్యక్రమం జరుపుకోనివ్వండి' అన్నారు. అందరూ ఉపనయనానికి మాధవశర్మ ఇంట సమావేశమయ్యారు.  





                          నరహరి ముండనము, మాతృభోజనము అయ్యాక జింకచర్మము, పసుపు వస్త్రము  ధరించాడు. చెవిలో గాయత్రి మంత్రం ఉపదేశించినప్పుడు నరహరి ఆ మంత్రరాజాన్ని మనసులోనే జపించి దీక్ష తీసుకున్నాడు. తర్వాత అతడు తల్లికి నమస్కరించి, ఆమెను' భవతీ  భిక్షాం దేహి' అని బిక్ష కోరి, మొట్టమొదట ఆమెతోనే మాట్లాడుతానని తల్లికి తానిచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. తల్లి మొదటి భిక్ష ఇచ్చి,         'ఋగ్వేదం పఠించు, ఆచారం పాటించు' అనగానే నరహరి," అగ్నిమీళే  పురోహితం" అని ప్రారంభించి, ఋగ్వేదంలోని మొదటి మంత్రం చెప్పాడు. అంబ రెండవసారి భిక్ష ఇచ్చి, ' యజుర్వేదం పఠించు ఆచారం పాటించు!' అనగానే నరహరి, "ఇషేత్వా" అని ప్రారంభించి యజుర్వేదం లోని మొదటి మంత్రం పఠించాడు. తల్లి మూడవసారి భిక్ష ఇచ్చి, ' సామవేదం పఠించు, ఆచారం పాటించు!' అనగానే నరహరి "అగ్ని ఆయాహి" అని ప్రారంభించి, సామవేదంలోని మొదటి మంత్రం గానం చేశాడు! అది వినగానే తల్లిదండ్రుల ఆనందానికి, సభలోని వారి ఆశ్చర్యానికి అవధులు లేవు. జీవితంలో మొదటిసారిగా మాట్లాడడం ప్రణవోచ్చారణ, తర్వాత వేదపఠనతో కానీ చేయకూడదని నరహరి అంతకాలమూ మాట్లాడలేదని అందరు అనుకున్నారు. మూడు భిక్షలూ  అయ్యాక ఆయన నాల్గవ వేదం కూడా చదివాడు. ఆయన భగవదవతారం అని తెలుసుకొని అచటి బ్రాహ్మణులంతా నమస్కరించారు. సర్వశాస్త్రాలకూ జన్మస్థానమైన ఆ ప్రభువుకు ఇది ఒక లెక్కలోనిది కాదు.         





               క్రతువు పూర్తిగావచ్చింది. మాధవ శర్మ దంపతులు అమితోత్సాహంతో ఉన్నారు. వామనునివలె భాసిస్తున్న ఆ నూత్న బ్రహ్మచారి నరహరిని తల్లి ఆశీర్వదించి, 'నాయనా! ఇక నుంచి నీవు భిక్షతోనే జీవించాలి సుమా !' అన్నది. వెంటనే అతడు తల్లికి నమస్కరించి, ' అమ్మా ! మీ ఆజ్ఞ మేరకు నేను బిక్షువునవ్వుతాను. నేను సన్యాసాశ్రమం స్వీకరించడానికి అనుమతించండి' అని తండ్రి వైపు కూడా తిరిగాడు. ఆ మాటలకా  తల్లి నివ్వెరబోయి దుఃఖిస్తూ, 'నాయనా! ఒక్కగానొక్క మగబిడ్డవు. మేము 16 సంవత్సరాలు ఎంతగానో ఎదురుచూచి, ఎన్నో వ్రతాలాచరించాక పుట్టావు. తర్వాత ఏడు సంవత్సరాలు నీవు మాట్లాడనేలేదు. ఇంతకాలానికి పరమేశ్వరుని కృప వలన నేను చేస్తున్న పూజలు, వ్రతాలు ఫలించి ఈరోజే మొదటిసారిగా నీ మాటలు వినగలిగాను. అందుకు నేను సంతోషిస్తుండగా నీవిలా అంటావేమి? అప్పుడే నీవు ఇల్లు విడిచిపోతే మా గతేమిటీ ? నీవు గృహస్థువై బిడ్డలు కలిగాక సన్యసించవచ్చు గదా !'అని బ్రతిమాలింది.       




       అపుడు నరహరి తల్లిని కౌగలించుకుని ఓదార్చి, 'అమ్మా ! నా మాట విను. వివేకంతో ఆలోచించి ఈ వ్యర్థమైన దుఃఖాన్ని తొలగించుకో. నేను ధర్మరక్షణ కోసం అవతరించాను. నీకింకా నలుగురు బిడ్డలు కలిగి ప్రేమతో మీ సేవ చేస్తారు. వెనుకటి జన్మలో నీవు నిష్టతో శంకరుణ్ణి  పూజించడం వల్లనే నేను నీ గర్భాన జన్మించాను ' అని చెప్పి,  ఆమె శిరస్సుపై తన చేతినుంచి ఆశీర్వదించాడు. వెంటనే ఆమెకు తన పూర్వజన్మ స్మృతి కలిగింది. అతడు శ్రీపాదవల్లభుడుగా దర్శనమిచ్చాడు. వెంటనే ఆమె ఆనందంతో పరవశించి అతని పాదాలపైబడి ఇలా అన్నది. 'స్వామీ ! పూర్వజన్మలో కుపుత్రవతినైన  నేను  ఆత్మాహుతికి పాల్పడినప్పుడు రక్షించిన శ్రీ పాదుడవు నీవే! బ్రహ్మాండాలన్నీ నీలోనే వున్నాయి. అట్టి నీవు నా గర్భాన పుట్టినందువలన నా భర్త్రువంశము, పితృ వంశము గూడా పావనమయ్యాయి'.                     





               అతడామెను లేవదీసి, 'అమ్మా ! ఈ పూర్వవృత్తాంతం వెల్లడి చేయవద్దు. నీకొక రహస్యం చెబుతాను. గుప్తంగా ఉంచు. నేను సంసారమంటని  సన్యాసిని. నేను చేయవలసిన తీర్థాటనము  మొదలైన కార్యాలెన్నో వున్నాయి. అవి నేను ప్రకటించ వీలులేనివి, రహస్యమైనవి. ఈ కర్తవ్యం నాకు తప్పదు. కనుక నేనింట్లో వుండవీలుపడదు. కనుక నీవు అనుమతి ప్రసాదించు' అన్నాడు.    




పదకొండవ అధ్యాయం సమాప్తము 


శ్రీ దత్తాయ గురవేనమః 



శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః   



No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box

నూతనయజ్ఞోపవీత ధారణ విధానము

  నూతనయజ్ఞోపవీత ధారణ విధానము జంధ్యాల పౌర్ణమి శ్రావణ పౌర్ణమి నాడు వస్తుంది. ఈ రోజు జీర్ణమైన (పాత) జంధ్యమును తీసివేసి కొత్త జంధ్యమును (యజ్ఞోప...