Sunday, May 24, 2020

గురు చరిత్ర అధ్యాయము -35


అధ్యాయము  -35




                               

శ్రీ గణేశాయనమః                             
శ్రీ సరస్వత్యేనమః                                                                                                  
శ్రీ గురుభ్యోనమః 




కథారంభము 


                               సిద్ధయోగి అటుపై జరిగిన వృత్తాంతం ఇలా చెప్పారు: "సావిత్రి శ్రీగురుని పాదాలకు మ్రొక్కి 'స్వామీ! నిరంతరం మీ పాదాలను స్మరించేందుకు సాధనంగా నాకొక మంత్రం ఉపదేశించి అనుగ్రహించండి' అని వేడుకొన్నది. శ్రీ గురుడు 'అమ్మా,  స్త్రీలకు భర్తను సేవించడంకంటే మోక్షానికి వేరొక మార్గం లేదు. స్త్రీలకు మంత్రోపదేశం చేయకూడదు పూర్వం దేవాసుర యుద్ధంలో,  చనిపోయిన రాక్షసులందరినీ శుక్రాచార్యుడు మృతసంజీవిని మంత్రంతో బ్రతికించి, యుద్ధరంగానికి పంపుతున్నాడు. ఒకనాడు ఇంద్రుని వలన ఆ సంగతి విని శివుడు కోపించి, నందిని పంపి, ధ్యాననిమగ్నుడైయున్న  శుక్రాచార్యుని తెప్పించి అతనిని తన కడుపులో బంధించాడు. ఒకనాడు శివుడు ఏమారినప్పుడు శుక్రుడు ఆయన మూత్రంతోపాటు బయటకొచ్చి,  మరలా  యుద్ధంలో చనిపోయిన రాక్షసులను బ్రతికించసాగాడు. ఏ మంత్రమైనా  స్త్రీకి ఉపదేశం ఇస్తే నిర్వీర్యం అవుతుందని,  అందులో మృతసంజీవనీ మంత్రం మూడవ వాడికి ఉపదేశించగానే మృతమైపోతుందన్న విషయం స్మరించి శివుడు, బృహస్పతిని పిలిచి అతనికి ఒక ఉపాయం చెప్పాడు.                                         


                            బృహస్పతి తన కుమారుడైన కచుని అందుకు నియమించాడు. కచుడు వెళ్లి శుక్రాచార్యునికి నమస్కారం చేసి, 'అయ్యా, నేనొక విప్ర  కుమారుడను. అపారమైన మీ యశస్సు విని,  విద్యార్థినై  మీ వద్దకు వచ్చాను. నన్ను స్వీకరించండి' అన్నాడు. శుక్రుని కుమార్తె,  దేవయాని అతనిని చూచి మోహించి,  తన తండ్రిని అందుకు ఒప్పించింది. కానీ రాక్షసులు కొద్ది కాలానికి  కచుడు శత్రుపక్షం వాడని తెలుసుకొన్నారు గాని,  శుక్రాచార్యునికి చెప్ప  సాహసించలేదు. ఒకనాడు కచుడు సమిధలు తేవడానికి అడవికి వెళ్ళినప్పుడు రాక్షసులు అతనిని రహస్యంగా అక్కడే చంపేశారు. దేవయాని మొరపెట్టుకొనగా శుక్రుడు తన దివ్యదృష్టితో తెలుసుకొని,  మృతసంజీవనీ మంత్రంతో అతనిని తిరిగి బ్రతికించాడు. రాక్షసులు మరొక్కసారి అతనిని చంపి దహనం చేసి ఆ బూడిదను నలుదిక్కులకూ విరజిమ్మేశారు. కాని శుక్రుడు మరల అతనిని బ్రతికించాడు. రాక్షసులు అతనిని మళ్లీ చంపి బస్మం చేసి,  నీటిలో కలిపి శుక్రునిచేత త్రాగించారు. ఈసారి  దేవయాని మొరపెట్టుకొన్నప్పుడు,  శుక్రాచార్యుడు తన యోగదృష్టితో జరిగినది తెలుసుకుని ఆమెతో అన్నాడు, "అమ్మ ఈ రాక్షసులు అతనిని నాకడుపులోకి పంపేశారు. ఇప్పుడు కచుణ్ణి బ్రతికిస్తే, నేను చనిపోవలసింది వస్తుంది." అప్పుడామె, "తండ్రి! నేను అతనిని వివాహమాడాలని ఎంతో ఆశలు పెంచుకున్నాను.  అతడు లేక నేను బ్రతుకలేను" అన్నది. ఆ రాక్షసగురువు, "ఈ మంత్రం నాకు ఒక్కడికే తెలుసు,  ఇతరులకు చెప్పకూడదు"అన్నాడు. ఆమె,  "తండ్రి, నీ కుమార్తెనైన నాకు ఆ మంత్రం ఉపదేశించు. కచుడు బ్రతికి బయటకు రాగానే మరల నిన్ను కూడా బ్రతికిస్తాను" అన్నది. "అమ్మా,  స్త్రీలకు మంత్రజపం తగదు. వారికి భర్త సేవయే విధించబడింది. స్త్రీకి ఉపదేశించిన మంత్రం శక్తిహీనమౌతుంది" అన్నాడు శుక్రుడు. దేవయాని అలిగి,  "అలా అయితే మీరు మీ మంత్రంతో సుఖంగా ఉండండి. కచుణ్ణి  విడిచి జీవించలేని నేనే మరణిస్తాను" అని చెప్పి మూర్ఛపోయింది. వేరే దారిలేక,  ఆమెపై వాత్సల్యంతో శుక్రాచార్యుడు ఆమెను మేల్కొలిపి,  మంత్రం ఉపదేశించి, తర్వాత ఆ మంత్రంతో కచుణ్ణి  బ్రతికించాడు. అప్పుడు కచుడు శుక్రుని కడుపు చీల్చుకొని బయటకు రాగానే,  దేవయాని మూడుసార్లు ఆ మంత్రం ఉచ్చరించి తన తండ్రిని బ్రతికిస్తున్నప్పుడు, కచుడు గూడ ఆ మంత్రం  విన్నాడు.                                    


                             స్త్రీకి ఉపదేశించడం  వలన,  మూడవవాడుగా కచుడు వినిన  కారణంగానూ  ఆ మంత్రం నష్టమైంది.అలా  నిర్ధారణ చేసుకుని కచుడు,  శుక్రాచార్యుడికి నమస్కరించి,  "అయ్యా,  మీ  కృపవలన విద్యలన్నీ  నేర్చుకున్నాను. నా అభీష్టం నెరవేరింది. ఇక్కడుంటే నన్నీరాక్షసులు  బ్రతుకనివ్వరు. కనుక నాకు సెలవిప్పించండి" అన్నాడు. అది విని దేవయాని ఏడుస్తూ,  "నా తండ్రి నిన్ను శిష్యునిగా అంగీకరించేలా చేశాను. మూడుసార్లు నీకు ప్రాణం ఇప్పించాను.కనుక  నన్ను వివాహమాడి నా అభీష్టం నెరవేర్చు" అని పట్టుబట్టింది. కచుడు,  నీవు గురుపుత్రివి  గనుక నాకు సోదరివి. ప్రాణదానం చేసావు గనుక తల్లివి. నిన్ను వివాహమాడదలచడం  మహాపాపం. కనుక నన్ను వేళ్ళనివ్వు" అని ప్రార్థించాడు.  కానీ ఆమె కామవశయై, "కృతజ్ఞుడా, నా సహాయంతో నీవు నేర్చిన విద్యలన్నీ మర్చిపోదువుగాక!" అని శపించింది. కచుడు ఆమెను అసహ్యించుకొని,  తనను అనవసరంగా శపించినందుకు ప్రతిశాపమిచ్చి వెళ్ళిపోయాడు. నాటినుండి యుద్ధంలో దేవతలచేత చంపబడిన రాక్షసులు తిరిగి బ్రతకలేదు. ఇది తెలిసిన వారెవరూ స్త్రీకి  మంత్రోపదేశం చేయరు. కనుక సావిత్రీ, నీకేదైనా వ్రతం చెబుతాను, చేసుకో!" అన్నారు. సావిత్రి స్వామికి నమస్కరించి,  'స్వామి! మీ పాదసేవకు మించిన వ్రతమేమున్నది?  అయినప్పటికీ,  మీ ఆదేశమే నాకు వేదవాక్కు, మీకు నచ్చిన వ్రతం సెలవియ్యండి' అన్నది. శ్రీ గురుడు ఇలా చెప్పారు: 'అందరూ ఆచరించుకోడానికి అనువైనది ఉత్తమమైన సోమవారవ్రతం. దాని వెనుక సూత మహర్షి శౌనకాది మునులకు ఉపదేశించాడు. సోమవారంనాడు రాత్రి మాత్రమే భోజనం చేస్తూ ఇంద్రియ నిగ్రహంతో ఉండాలి. ఈ వ్రత మహిమ తెల్పే ఐతిహ్యము ఒకటి  చెబుతాను:           


                                        ఆర్యావర్తంలో చిత్రవర్మ అనే రాజు తన ప్రజలను ఎంతో ధర్మంగా పాలిస్తూ ఉండేవాడు. అతడు సంతానం కోసం శివుని పూజించగా,  ఆయన వరం వల్ల ఒక కుమార్తె జన్మించింది. ఆమెకు సీమంతిని అని పేరు పెట్టుకున్నారు. దైవజ్ఞులు ఆమె జాతకం చూచి,  ఆమె చిరకాలం సుమంగళిగా,  సుఖంగా జీవించగలదని చెప్పారు. కానీ కొంత కాలానికి ఒక జ్యోతిష్కుడు ఆమె చేయి చూచి,  14వ ఏట ఆమె భర్త మరణిస్తాడని చెప్పాడు. ఆమె వివాహం ప్రసక్తి వచ్చినప్పుడల్లా తల్లిదండ్రులు పడుతున్న మనోవేదన గుర్తించి,  సీమంతిని ఒకనాడు యజ్ఞవల్క్యమహర్షి భార్య, మహాపతివ్రత అయిన మైత్రేయిని  దర్శించి నమస్కరించి, తన దురదృష్టానికి నివారణ తెల్పమని ప్రార్ధించింది. అప్పుడు మైత్రేయి, "అమ్మాయి,  ప్రతి సోమవారమూ  భక్తితో శివపార్వతులను పూజించు.  అభిషేకము వలన పాపం నశిస్తుంది. పీఠాన్ని అర్పించినందువలన సామ్రాజ్యము, గంధ  పుష్పాక్షతలు సమర్పించినందువల్ల సౌభాగ్యము, దూపమార్పించడం వలన సౌగంద్యము, దీపదానం వలన కాంతిమత్వము, నైవేద్యం వలన సకల భోగాలు, తాంబూల సమర్పణ వలన నాల్గు పురుషార్థాలూ చేకూరుతాయి. జపం వలన అష్టైశ్వర్యాలు, హోమం చేసినందువలన సిరిసంపదలు, స్తోత్రం వలన బహుముఖమైన సమృద్ధి, విప్రులకు భోజనం పెట్టడం వలన సర్వ దేవతా సంతృప్తి కలుగుతాయి. కనుక ఆ రీతిన ఈ వ్రతమాచరించు" అని చెప్పింది.


                సీమంతిని ఆమెకు నమస్కరించి ఇంటికి వచ్చి, ఎంతో శ్రద్ధతో ఆ వ్రత మాచరించింది. ఆమెకు యుక్త వయస్సు రాగానే, ఇంద్రసేన మహీపాలుడి కుమారుడైన చంద్రాంగదుడికిచ్చి  వివాహం చేశారు. ఆ దంపతులు ఎంతో అన్యోన్యంగా జీవిస్తుండగా ఒకరోజు ఆ రాజకుమారుడు జలక్రీడకని  వెళ్లి, ప్రమాదవశాత్తు కాళింది నదిలో మునిగిపోయాడు. ఎందరు ఈతగాళ్లు వెతికినా దొరకలేదు. అది తెలిసి 14 సంవత్సరాలు నిండిన సీమంతిని ప్రాణత్యాగానికి సిద్ధమైనది, కానీ రాజు ఆమెను వారించాడు. బంధువులందరూ నది ఒడ్డుకు చేరి, దుఃఖించారు. సీమంతిని తాను వ్రతమాచరించినా కూడా తన భర్తను రక్షించనందుకు శివపార్వతులకు మొరపెట్టుకొని, సహగమనం చేయడానికి సిద్ధమైంది. అప్పుడు పురోహితులు, "శవం కనిపించకుండా ఉంటే సహగమనం చేయకూడదు. ఇంతకు అతడు మరణించాడో లేదో ఎలా నిశ్చయించగలము? కనుక నీవు వేచి ఉండాలి" అని చెప్పారు. పుత్రశోకంతో ఇంద్రసేనుడు మతిస్థిమితం కోల్పోగానే దాయాదులు అతని రాజ్యం అపహరించి, ఆ రాజదంపతులను చెరసాలలో పెట్టారు. చిత్రవర్మ, శాస్త్రానుసారం ఒక సంవత్సరము వేచిచూసిన తర్వాత తన కుమార్తెకు వైధవ్యం ఇప్పించాలని నిశ్చయించుకున్నాడు. సీమంతిని మాత్రం అంత దుఃఖంలోనూ తదేకదీక్షతో ఆ వ్రతం ఆచరిస్తూనే ఉన్నది.    


                                      నీట మునిగి చనిపోయిన చంద్రాంగదుడిని నాగకన్యలు అమృతం పోసి బ్రతికించి, పాతాళలోకంలో మహోజ్వలమైన పట్టణంలో మణులతో వెలిగిపోతున్న పడగలుగల తమ రాజయిన తక్షకుని దగ్గరకు తీసుకువెళ్లారు. అతనికి చంద్రాంగదుడు నమస్కరించాడు. తక్షకుడు అతని వృత్తాంతమెరిగి, సంతోషించి, సకల భోగాలూ అనుభవిస్తూ, తమ లోకంలోనే ఉండిపొమ్మని అతనిని ఆహ్వానించాడు. చంద్రాంగదుడు వారి ప్రేమకు సంతోషించి, తన తల్లిదండ్రులు, తన భార్య తన కోసం దుఃఖిస్తుంటారని, కనుక తాను వెంటనే వెళ్లిపోవాలని చెప్పాడు. అప్పుడు తక్షకుడు అతని చేత అమృతం త్రాగించి, అతని భార్యకోసం ఒక పాత్రలో అమృతం ఇచ్చి అతనిని సత్కరించి,తనను  ఎప్పుడు స్మరించినా ఆపదలో రక్షించగలనని చెప్పి పంపాడు. తక్షకుడు ప్రసాదించిన దివ్యాశ్వంమీద చంద్రాంగదుడు తిరిగి నది ఒడ్డుకు చేరాడు. అమృతం త్రాగడం వలన దివ్యవర్ఛస్సుతో వెలిగిపోతూ, దివ్యాశ్వం  పై నీటినుండి పైకి వచ్చిన చంద్రాంగదుని జూచి సీమంతిని ఆశ్చర్యపోయింది. ఆ రోజు సోమవారం. సీమంతిని తన పరిచారికలతో స్నానం చేయడానికి నదికి వచ్చింది. కానీ ఆమె మెడలో ఆభరణాలు, మంగళసూత్రము,నొసట కుంకుమ కనిపించక పోయేసరికి, ఆమెను నిశ్చయంగా గుర్తుపట్టలేక, చంద్రసేనుడు తక్షకుణ్ణి స్మరించి మారు రూపం ధరించి రాజకుమార్తెను విచారించి, ' నీ వ్రత ప్రభావం వలన మూడవ నాటికి నీ భర్త తిరిగి రాగలడు' అని ఆమెతో చెప్పి. మొదట తన తల్లిదండ్రులను రక్షించడానికి వెళ్లాడు. వారి రాజ్యం అపహరించిన దాయాదులకు, తాను తక్షకుని వరం పొంది వచ్చిన సంగతి తెలుపుతూ, రాజ్యం తిరిగి అప్పగించమని, లేకుంటే వారిని యుద్ధంలో శిక్షించగలననీ  హెచ్చరిస్తూ చంద్రాంగదుడు కబురు చేశాడు. నదిలోపడి మరణించిన చంద్రాంగదుడు  తిరిగి వచ్చాడని తెలియగానే ఆ దాయాదులు భయపడి, రాజ్యం అతనికి తిరిగి అప్పగించి,  క్షమాపణ కోరారు. చంద్రాంగదుడు తాను నాగలోక సౌందర్యం తిలకిస్తూ, తిరిగి రావడం ఆలస్యం చేసినందుకు తనవారు ఎంత దుఃఖించారో, ఎన్ని కష్టాలు అనుభవించారో తెలుసుకొని, తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పుకున్నాడు. తిరిగి తమ కొడుకును,  రాజ్యాన్ని పొందిన అతని తల్లిదండ్రులు సంతోషించి అదంతా సీమంతిని చేసిన శివారాధనకు ఫలితమేనని గుర్తించి ఆమెను తీసుకొచ్చి, ఎంతో వైభవంగా చంద్రాంగదుడికి పట్టాభిషేకం చేశారు. '                                  


                                  శ్రీ గురుడు చెప్పినది విని దత్తుడు నమస్కరించి, 'స్వామీ, పరమ పవిత్రము, శ్రేయోదాయకమూ అయిన మీ పాదసేవ మాకు చాలదా? త్రిమూర్తి స్వరూపులైన మీ పాదస్మరణ మాలో నిరంతరం జరిగేలా మమ్ము దీవించరాదా? వేరొక వ్రతంఎందుకు? ' అన్నాడు. శ్రీ గురుడు, ' ఇది మా ఆజ్ఞ! ఈ వ్రతం చేస్తే గాని మీ సేవ మాకుఅందదు. కనుక ఈ వ్రతం చేసుకోండి!' అని చెప్పి వారిని ఆశీర్వదించి పంపివేశారు. ఇంతలో తమ పుత్రుడు ఆరోగ్యంతో సుఖంగా గురుసన్నిధిలో ఉన్నాడని తెలిసిన గోడేనాథుడు,  అతని భార్య వాళ్లను చూడడానికి అక్కడకు చేరుకున్నారు. వారు శ్రీగురుని దర్శించి, జరిగినదంతా తెలుసుకుని, వేయిమంది బ్రాహ్మణులకు సమారాధన చేసి, కొడుకు-కోడళ్లనూ తీసుకొని స్వస్థానం చేరుకున్నారు. సావిత్రీ  - దత్తాత్రేయులు శ్రీ గురుడు చెప్పిన వ్రతమాచరించి, కాలాంతరంలో పూర్ణాయువులైన కొడుకులను కన్నారు. చనిపోయిన ఒక వ్యక్తిని తిరిగి బ్రతికించి, శ్రీ గురుడు ఒక విధవరాలికి తిరిగి సౌభాగ్యం ప్రసాదించారన్న వార్త నలుదిక్కులకు ప్రాకిపోయింది.                           

ముప్పైఐదవ అధ్యాయం సమాప్తము 

శ్రీ దత్తాయ గురవేనమః 

శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః  
 

*** ఆదివారం పారాయణ సమాప్తము ***


No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box

నూతనయజ్ఞోపవీత ధారణ విధానము

  నూతనయజ్ఞోపవీత ధారణ విధానము జంధ్యాల పౌర్ణమి శ్రావణ పౌర్ణమి నాడు వస్తుంది. ఈ రోజు జీర్ణమైన (పాత) జంధ్యమును తీసివేసి కొత్త జంధ్యమును (యజ్ఞోప...