Friday, May 29, 2020

గురు చరిత్ర అధ్యాయము -39


అధ్యాయము  -39


                               

శ్రీ గణేశాయనమః                             

శ్రీ సరస్వత్యేనమః                                                                                                  

శ్రీ గురుభ్యోనమః 



కథారంభము 




                        సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు: 'గంధర్వపురంలో సోమనాథుడనే సదాచార సంపన్నుడైన వృద్ధ బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనిది ఆపస్తంబశాఖ, శౌనక  గోత్రం. అతని భార్య గంగమ్మకు 60 ఏళ్లునిండినా సంతతి కలగలేదు. ఆమె నిత్యమూ శ్రీగురుని దర్శించి,  వారి పాదాలను పూజించి,  హారతిచ్చి సాష్టాంగ నమస్కారం చేసి తిరిగి వస్తూ ఉండేది. ఇలా ఆమె కొన్ని సంవత్సరాలు తదేక దీక్షతో చేస్తూ ఉండేది. ఒకనాడు స్వామి నవ్వుతూ ఆ మహా ఇల్లాలితో,  'అమ్మా! ఇన్నాళ్లుగా  మమ్మల్ని సేవిస్తున్నావు. నీ అభీష్టం ఏమిటో ఎన్నడూ చెప్పలేదే? ఇప్పటికైనా చెబితే గౌరీనాధుని  కృపవలన నీకోరిక నెరవేరుతుంది' అన్నారు. ఆమె ఎంతో సంతోషించి దోసిలి యోగ్గి  కన్నీరు కారుస్తూ ఇలా చెప్పుకున్నది: 'స్వామి! కొడుకులు లేని వారికి ఉత్తమగతులు ఉండవుగదా. అందువలన గొడ్రాలుగా ఉండడమే మహాదోషమైంది. నేను మహా పాపిష్టినైన కారణంగానే నాకు బిడ్డలు కల్గలేదని అందరూ నన్ను ఏవగించుకొంటున్నారు. దానికి తోడు మాతృత్వం లేకుంటే స్త్రీల జీవితాలకు సంతృప్తి కలుగదు కదా! పితృదేవతలు కూడా, తమ కులంలో ఒక మగ బిడ్డ జన్మిస్తే తమకు తిలోదకాలు లభిస్తాయని ఎంతో ఆశతో ఎదురు చూస్తుంటారు. బిడ్డలు లేని ఇల్లు ఇల్లే గాదు అటువంటప్పుడు చంకన బిడ్డనెత్తుకునే  అదృష్టానికి నేను నోచుకోలేదు. అలాగే నాకు 60 ఏళ్లు నిండిపోయాయి. మాకు,  మా పితృదేవతలకు తిలోదకాలిచ్చే వాడు లేకుంటే మాకు పున్నామ నరకం తప్పదాయె! స్వామీ, అయిందేదో అయిపోయింది. మరుజన్మలోనైనా నాకు బిడ్డలు కలిగేలా అనుగ్రహించండి. చాలు అని ఆయన పాదాలకు నమస్కరించింది. శ్రీ గురుడు నవ్వుతూ,  'ఓసి పిచ్చి తల్లి. ఏమి కోరిక కోరావమ్మా? ఎప్పుడో రాబోయే జన్మసంగతి ఇప్పుడెందుకు?  అప్పుడు బిడ్డలు గలిగినా, వాళ్లు మేమిచ్చిన వరంవలన కలిగినట్లు నీకు ఎలా తెలుస్తుంది? నీవు  నిత్యమూ  మమ్మల్ని ఇంత శ్రద్ధగా సేవించినందుకు మాకెంతో సంతోషమైంది. కనుక నీవు కోరినది ఈ జన్మలోనే లభించేలా వరమిస్తున్నాము.  కొద్దికాలంలోనే నీకు ఒక కూతురు,  ఒక కొడుకు కలుగుతారు' అని ఆమెను దీవించారు.                                    


                        అప్పుడు గంగాంబ తన కొంగును ముడివేసుకుని స్వామికి నమస్కరించి, 'స్వామీ,  ఒక మనవి చేసుకుంటాను, నాపై కోపగించివద్దు,  నేను బిడ్డలకోసం ఎన్నో తీర్థయాత్రలు చేశాను. పుణ్యతీర్ధాలలో స్నానం చేశాను. రావిచెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే బిడ్డలు కలుగుతారని లోకులు చెప్పింది నమ్మి, కనిపించిన రావిచెట్టుకల్లా ఇంతవరకూ ప్రదక్షిణలు, నమస్కారాలు చేసి చేసి అలసిపోయాను. అలానే నా వయస్సంతా చెల్లిపోయింది. ఇటువంటి నాకు మీ వరమెలా  ఫలించగలదా అని ఆలోచనగా ఉన్నది అలా అని త్రిమూర్తి స్వరూపులైన  మీ వాక్కు ఎన్నటికీ వ్యర్థం కాదన్న ధైర్యం లేకపోలేదు. అట్టి విశ్వాసంతోనే ఇలా కొంగును ముడివేసుకున్నాను. ఇంతకూ నాకు కలిగిన సందేహం ఇది- నేను వచ్చే జన్మలో నైనా బిడ్డలు కలగాలని కోరుకుంటుంటే,  మీరు ఇప్పుడే ప్రసాదిస్తామన్నారు. అయినప్పటికీ ఇన్నాళ్లుగా నేను కాళ్ళునొప్పులు పుట్టేలాగా రావిచెట్టుకు ప్రదక్షిణలు చేసినందువల్ల కలిగిన ప్రయోజనమేమిటి?' అని విన్నవించింది. ఆమె ఆవేదన చూచి నవ్వి,  శ్రీ గురుడు ఇలా చెప్పారు: 'అమ్మాయి! నీవు చేసిన అశ్వత్థపూజ వలన నీకు ఎంతో పుణ్యం లభించింది. ఇప్పుడు అవివేకంతో నీవు దాన్ని నిందించి, పోగొట్టుకోకు. నా మాటవిని,  ఇక నుండి ఈ సంగమంలో ఉన్న యీ  రావి చెట్టుకు,  మాకూ  కలిపి నిత్యమూ  ప్రదక్షిణ, పూజ  చేస్తూ ఉండు. మేమెప్పుడూ అశ్వత్థ వృక్షంలో ఉంటాము. అందువల్లనే పురాణాలన్నీ దానిని 'అశ్వత్థనారాయణుడని ' కీర్తించాయి.                 


                              గంగాంబ, 'స్వామీ అతి విశ్వాసం నాలో నిలిచేందుకు అశ్వత్థ వృక్షం యొక్క ప్రాశస్త్యం  వివరించండి. అప్పుడు తగిన శ్రద్దాభక్తులతో దీనిని సేవించ గలుగుతాను' అన్నది. శ్రీ గురుడు ఇలా చెప్పసాగారు. 'అశ్వత్థవృక్షంలో సర్వదేవతలూ  ఉంటారు. దాని మహత్యం గురించి బ్రహ్మాండపురాణంలో నారద మహర్షి చెప్పాడు. అశ్వత్థమే నారాయణ స్వరూపం. ఆ వృక్షం యొక్క మూలమే బ్రహ్మ: దాని మధ్య భాగమే విష్ణువు: దాని చివరి భాగమే శివుడు. కనుక దానిని పూజిస్తే త్రిమూర్తులను పూజించినట్లే.  అలానే,  త్రిమూర్తులు దాని యొక్క దక్షిణ,  పడమర,  ఉత్తర దిక్కులలోని కొమ్మలు. తూర్పు దిక్కుకున్న కొమ్మలలో ఇంద్రాది దేవతలు ఉంటారు. దాని వ్రేళ్లలో మహర్షులు,  గోబ్రాహ్మణులు,  నాలుగు వేదాలు ఉంటాయి. సప్త సముద్రాలు, పుణ్యనదులు తూర్పు కొమ్మలలో ఉంటాయి. ఆ చెట్టు యొక్క మూలంలో '' కారము,   మానులో ' ' కారము. దాని పండ్లు '' కారము. - ఆ వృక్షం అంతా కలిసి ప్రణవస్వరూపమే ఇక ఆ చెట్టుయొక్క మహిమ ఎవరు వర్ణించగలరు? అది సాక్షాత్తూ కల్పవృక్షమే,  ఈ వృక్షాన్ని సేవించవలసిన విధానం నారదమహర్షి ఇలా చెప్పాడు: "అశ్వత్థ ప్రదక్షిణం చైత్ర, ఆషాడ, పుష్యమాసాలలోనూ, గురు,  శుక్ర మౌడ్యాలలోనూ,  కృష్ణ పక్షంలోనూ  ప్రారంభించకూడదు. శుభ సుముహూర్తంలో స్నానాదులు చేసుకుని శుచియై  ఉపవసించి మరీ ప్రారంభించాలి. ఆది, సోమ, శుక్రవారాలలోనూ, సంక్రమణ సమయాలు మొదలైన నిషిద్ధసమయాలలోనూ,  రాత్రి భోజనం అయ్యాక ఈ వృక్షాన్ని సేవించకూడదు. సాధకులు మొదట ఆత్మస్తుతి, పరనింద, జూదము, అసత్యములను విడిచిపెట్టాలి. ప్రవహిస్తున్న నీటిలో గుడ్డలతోనే స్నానంచేసి,  ఉతికిన గుడ్డలను ధరించి మొదట గణపతిని పూజించి కలశాలలో గంగా యమునలను పూజించాలి. అప్పుడు సంకల్పం చెప్పి అశ్వత్థవృక్షానికి  భక్తితో ఏడుసార్లు అభిషేకం చేయాలి. అప్పుడు మరల స్నానంచేసి,  దేవతామయమైన ఆ వృక్షానికి పురుషసూక్త విధానంగా షోడశోపచారపూజ చేయాలి. అప్పుడు పీతాంబరం ధరించిన నారాయణుని ఎనిమిది బాహువులు గలవానిగా ధ్యానించాలి. తర్వాత విష్ణు సహస్రనామం చదువుతూ గాని, మౌనంగా గాని, యెంతో నెమ్మదిగా ప్రదక్షిణలు చేయాలి. ప్రతి ప్రదక్షిణానికి మొదట,  చివరా  నమస్కారం చేయాలి. ఇలా రెండు లక్షలు ప్రదక్షిణలు చేస్తే సర్వ పాపాలు నశించి,  నాలుగు పురుషార్థాలు సిద్ధిస్తాయి. త్రికరణశుద్ధిగా దానిపై దృష్టిని నిలిపి, బిడ్డలు కలగాలన్న సంకల్పంతో ప్రదక్షిణ చేస్తే తప్పక కలుగుతారు. శనివారంనాడు ఈ చెట్టును త్రాకి మృత్యుంజయ మంత్రం జపిస్తే మృత్యుభయం తొలగుతుంది. అశ్వత్థాన్ని పూజించాక-


                 శ్లో||   కోణస్థ:   పింగళో బభ్రు:  
                                                     
                                      కృష్ణోరౌద్రాంతకో  యమః                
                                                      
                      శౌరిశ్శనైశ్వరో మందః      
                 
                              పిప్పలాదేవ సంస్తుతః ||           

         అనే మంత్రం దృఢవిశ్వాసంతో జపిస్తే శనిదోషం కూడా తొలగి, అభీష్టసిద్ధి కలుగుతుంది. గురువారము అమావాస్య కలిసిన రోజున రావిచెట్టు నీడన స్నానంచేస్తే పాపం నశిస్తుంది. అక్కడ వేదవిప్రునికి మృష్టాన్నం పెడితే కోటిమంది బ్రాహ్మణులకు సమారాధన చేసిన ఫలితముంటుంది. అక్కడ చేసిన గాయత్రీ మంత్ర జపంవలన నాలుగు వేదాలూ చదివిన ఫలితముంటుంది. రావిచెట్టును స్థాపిస్తే నలభై రెండు తరాల వారికి స్వర్గం లభిస్తుంది. దానిని కొట్టివేయడం మహాపాపం. పైన తెలిపిన రీతిన ప్రదక్షిణలు చేశాక,  ఆ సంఖ్యలో పదవ వంతు హోమము,  అందులో పదవవంతు బ్రాహ్మణ సమారాధనమూ  చేయాలి. ఈ వ్రత కాలంలో బ్రహ్మచర్యమవలంభించాలి. ఉద్యాపన  తర్వాత బంగారు రావిచెట్టును,  అలంకరించిన ఆవు - దూడలను, గుడ్డతో కప్పిన నువ్వుల  రాశిని, ఉదారమైన దక్షిణలతో సౌశీల్యవంతులూ,  కుటుంబీకులూ అయిన వేద విప్రులకు దానమివ్వాలి. ఇలా చేస్తే తప్పక అభీష్టం సిద్ధిస్తుంది. 


                    అమ్మా! అశ్వత్థ మహత్యం తెలిసింది కనుక ఇంక దానిని నిందించక, యెట్టి సంశయమూ  పెట్టుకోకుండా అలా చేయి. నీ అభీష్టం నెరవేరుతుంది.' అప్పుడు గంగాంబ, 'స్వామీ ! 60 సంవత్సరాలు నిండిన నేను పుట్టుకనుండి వంధ్యను.  నాకు బిడ్డలెలా  కలుగుతారు?  అయినా నాకేమి? ప్రత్యక్షంగా మీ  పాదాలుండగా మరలా యీ రావిచెట్టును సేవించడం ఎందుకు?' అనిపిస్తున్నది. ఏమైనప్పటికీ,  గురువు మాట కామధేనువని వేదాలు,  శాస్త్రాలు చెబుతున్నాయి. కనుక నమ్మి త్రికరణశుద్ధిగా సేవిస్తాను అని చెప్పింది. ఆమె నాటినుండి మూడు రోజులూ ఉపవసించి,  మూడుపూటలా ష్టట్కుల  తీర్థంలో స్నానం చేసి, గురువు చెప్పినట్లు అశ్వత్థాన్ని  సేవించి,  దానికి ఏడు బిందెల నీళ్లు పోసి,  శ్రీ గురుసహితంగా దానిని పూజించింది. ఆ మూడు  రాత్రులూ  ఆ దంపతులు సంగమంలోనే ఉన్నారు. మూడవనాటి రాత్రి ఆమెకు స్వప్నంలో ఒకబ్రాహ్మణుడు కనిపించి,  'అమ్మాయీ,  నీ కోరిక తీరింది. ఉదయమే శ్రీ గురిని పూజించి,  ఆయనిచ్చిన ప్రసాదం అక్కడికక్కడే తిను' అన్నాడు. అలాగే నాలుగవరోజు ఉదయం సంగమంలో అశ్వత్తాన్నిసేవించి,  ఆ దంపతులు మఠానికి వచ్చారు. ఆమె ప్రదక్షిణం చేసి నమస్కరించగానే శ్రీ గురుడు నవ్వి,  రెండు పండ్లు ఆమెకిచ్చి,  'మీ లక్ష్యం నెరవేరింది. పారణ అయ్యాక నీవీ పండ్లు తిను. నీకు ఒక కూతురునూ,  కొడుకునూ  ఇస్తున్నాము. ఇంటికి వెళ్ళి పారణ భోజనం చేసి బ్రాహ్మణులకు దానమివ్వు' అని చెప్పారు. ఆమె అలానే చేసింది. ఆ రోజే సూర్యా స్తమయ సమయానికి ముందే ఆమె రజస్వల అయ్యింది. నాలుగవ రోజున స్నానం తర్వాత ఆమె భర్తతో గూడ శ్రీ గురుని  వద్దకు వచ్చి గురు పూజ చేసింది.శ్రీ గురుడు, 'నీకు పూర్ణాయుష్కులైన బిడ్డలు  కలుగుతారు; నీకు ముక్తి లభిస్తుంది' అన్నారు. ఐదవ రోజున భర్త్రుసమాగమం వలన ఆమె గర్భం ధరించింది. ఆమెభర్త ఎంతో సంతోషించి పుంసవనము,  ఎనిమిదవనెలలో సీమంతము మొదలైన సంస్కారాలన్నీ  ఘనంగా జరిపించాడు. ఆమె ఏడవ మాసంలో మళ్లీ శ్రీగురుని దర్శించి ఆశీస్సులు పొందింది. అప్పుడు శ్రీగురుని ఆజ్ఞమేరకు ఆ పండుముత్తైదువ వాయనదాన మిచ్చింది. నల్లని వెంట్రుక ఒక్కటైనా లేకుండా జుట్టు నెరిసి, పళ్ళన్నీ  పట్టు తప్పిన తర్వాత కూడా ఆ వయసులో ఆమె గర్భవతి ఎలా అయిందని ఆశ్చర్యంతో అందరూ ముక్కున వేలేసుకున్నారు. శ్రీ గురుని మహిమ ఎంతటిదో అందరికీ అర్థమైంది. ఆమెకు నవమాసాలు నిండాక,  ఒక శుభ ముహూర్తంలో ఆమెకు ఆడపిల్ల పుట్టింది. దైవజ్ఞులు ఆమె శుభజాతకురాలని చెప్పారు. ఆ బిడ్డకు శ్రీగురుని  పేరిట 'సరస్వతి' అని పేరు పెట్టుకున్నారు. పదకొండవ రోజున ఆ బాలింతరాలు నడుముకట్టు వేసుకుని,  బిడ్డనెత్తుకుని,  భర్తతో కలిసి శ్రీగురుని దర్శించింది. బిడ్డను ఆయనముందుంచి, 'వంద్యమైన వృక్షం మీ కటాక్షంతో ఫలించింది. అది సుపాలమైతే బాటసారులు సేవిస్తారు. వ్యర్థఫలానికంటే వంధ్యాత్వమే మేలు!' అని శ్రీగురుని పాదాలకు నమస్కరించింది. స్వామి వాత్సల్యంతో, 'పుత్రవతీ! లేవవమ్మ!' అని బిడ్డను చూచి, 'ఇది ఆడపిల్లే గాని మగపిల్లవాడు గాడే!' అంటూ ఆమెను చూచి నవ్వి, 'ఇంక సందేహించనక్కరలేదు,  నీకు కొడుకుగూడా పుడతాడు' అని చెప్పారు. అప్పుడా పసిబిడ్డను తమ చేతిలోకి తీసుకుని నిమురుతూ,  'ఈబిడ్డ  దీర్ఘాయువు, సౌభాగ్యము,  సౌశీల్యములతో ప్రసిద్ధికెక్కుతుంది. ఆమెకు పుత్రపౌత్రాభివృద్ధి కలుగుతుంది. ఈమె సౌశీల్యం గురించి విని ఈమె దర్శనానికి దక్షిణదేశం నుండి ఒక రాజు కూడా వస్తాడు. మీకు వేదశాస్త్ర పారంగతుడు,  మహా ఐశ్వర్య  సంపన్నుడు అల్లుడుగా దొరుకుతాడు. కానీ మీకు ఎలాంటి కొడుకు కావాలి?  వంద సంవత్సరాలు జీవించే మూర్ఖుడు కావాలా?, లేక 30 సంవత్సరాల ఆయుస్సు  గల విధ్వాంసుడు కావాలా?' అన్నారు. గంగాంబ, 'విద్యావంతుడు, సుగుణాల సంపన్నుడు అయిన కొడుకునే ప్రసాదించండి. అతనికి ఐదుగురు పిల్లలు కలిగేలా దీవించండి' అని చెప్పి స్వామికి నమస్కరించింది.  స్వామి, 'తథాస్తు' అని ఆమెను  దీవించి పంపివేశారు. ఒక సంవత్సరంలో ఆమెకు  కొడుకు పుట్టాడు. అతనికి గూడా 'నృసింహ' అని శ్రీ గురుని  పేరే  పెట్టారు. వాడు కొంత కాలానికి మహాపండితుడై ఐదుగురు బిడ్డలను కన్నాడు. గంగమ్మ కూతురు సరస్వతికి కూడా గొప్ప యజ్ఞదీక్షితునీతో వివాహమైంది. అతని చేత యజ్ఞాలు చేయించుకోడానికి కాశీ నుండి శ్రీమంతులు,  పండితులు వచ్చి,  అతనిని తీసుకు వెళుతూ ఉండేవారు. శ్రీ గురుకృప ఎంతటిదో చూచావా? నామధారకా ! వారి అనుగ్రహంతో అసాధ్యమైనది కూడా సాధ్యమవుతుంది. వారిని దృఢ విశ్వాసంతో సేవించడమే మన కర్తవ్యం". 

ముపై తొమ్మిదవ అధ్యాయం సమాప్తము.

శ్రీ దత్తాయ గురవేనమః 

శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః   

No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box

నూతనయజ్ఞోపవీత ధారణ విధానము

  నూతనయజ్ఞోపవీత ధారణ విధానము జంధ్యాల పౌర్ణమి శ్రావణ పౌర్ణమి నాడు వస్తుంది. ఈ రోజు జీర్ణమైన (పాత) జంధ్యమును తీసివేసి కొత్త జంధ్యమును (యజ్ఞోప...