Wednesday, May 27, 2020

గురు చరిత్ర అధ్యాయము -38


అధ్యాయము  -38




                               

శ్రీ గణేశాయనమః                             
శ్రీ సరస్వత్యేనమః                                                                            శ్రీ గురుభ్యోనమః 




కథారంభము 



                        నామధారకుడు, "స్వామీ, శ్రీ గురుడుపదేశించిన కర్మానుష్టాన రహస్యం మీనుండి విని ధన్యుడినయ్యాను. ఇక దయచేసి అటుపై జరిగిన శ్రీ గురుని వృత్తాంతం తెల్పండి" అని వేడుకొన్నాడు. సిద్ధయోగి ఇలా చెప్పసాగారు : "నాయనా, నీవంటి గురుభక్తుడు, శ్రోతా  లభించినందువల్లనే శ్రీ గురుచరిత్ర తనివితీరా స్మరించుకొనే భాగ్యం నాకు కూడా కలిగింది.            


          శ్రీ గురుని కీర్తి అన్ని దిక్కులా వ్యాపించడం వలన శ్రీమంతులయిన గురుభక్తులెందరో  గంధర్వ నగరం వచ్చి వారికి భిక్ష, వారి ప్రీతికోసం బ్రాహ్మణ సంతర్పణలు చేస్తుండేవారు. ఒకసారి కాశ్యప గోత్రానికి చెందిన భాస్కరశర్మ అనే పేదబ్రాహ్మణుడు వచ్చాడు. అతడు తనతో ముగ్గురికి మాత్రమే సరిపడే ధాన్యము మొదలగునవి మూటగట్టుకొని తెచ్చి, శ్రీ గురునికి నమస్కరించాడు. కానీ ఆరోజు అందరితోపాటు అతనిని కూడా ఎవరో భక్తులు సంతర్పణకు ఆహ్వానించారు. అతడు తాను తెచ్చుకున్న మూట మఠంలో ఒక మూల ఉంచి, భోజనానికి వెళ్లాడు. ఈ రోజు ఇలానే జరుగుతూ ఉండటం వలన మూడుమాసాలు అలాగే గడిచింది. అతనిని చూచిన బ్రాహ్మణులందరూ,  'ఏమయ్యా బ్రాహ్మణుడా! నీవు వచ్చింది ఎందుకు?  చేస్తున్నదిఏమిటి? నీవు భిక్ష ఇవ్వడానికి ముహూర్తం ఇంకా కుదరలేదా? పోనీలే, ఇక్కడ జరుగుతున్న సంతర్పణలలో భోజనం చేసి ఇప్పుడు లావెక్కావు. నీకు ఇంటివద్దకంటే ఇక్కడే బాగున్నట్లున్నది. నీకు సిగ్గువేయడం లేదా?" అని ఎగతాళి చేయసాగారు. పాపమాభాస్కరశర్మ కొంతకాలం తనను కానట్లు ఇదేమీ పట్టించుకోకుండా కాలక్షేపం చేస్తున్నాడు. అతనిపై ఇట్టి విమర్శలు, నిష్టూరాలు, పెరిగిపోయి, ఒకనాడు ఆ విషయం శ్రీగురునికి తెలిసింది. ఆయన అది సహించలేక, అతనిని పిలిచి, 'నాయనా, నీవు రేపు ఇక్కడనే  స్వయంగా వంట చేసి మాకు భిక్ష సమర్పించు' అని ఆదేశించారు. అతడు అంగీకరించి మరుసటి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి నెయ్యి, పెరుగు సమకూర్చుకుని, స్నానానుష్టాలు పూర్తిచేసుకుని, తాను తెచ్చిన ధాన్యంతోనే వంట చేస్తున్నాడు.  


                     ఆ సమయంలో వేరే ఒక భక్తుడు వచ్చి, తానారోజు శ్రీ గురునికి భిక్ష చేయడానికి అన్నము, మొదలైన పదార్థాలన్నీ సిద్ధం చేసుకుని ఆహ్వానించడానికి స్వామి వద్దకు వచ్చాడు. కానీ శ్రీ గురుడు, తాము ఆరోజున భాస్కరశర్మ ఇచ్చే భిక్ష తీసుకుంటామని, అతడు మరుసటిరోజు బిక్ష చేయవచ్చునని చెప్పారు. అతడు నిరుత్సాహపడి, 'అయ్యో! ఇప్పుడీ దరిద్రుడు వండినదాంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క మెతుకు అయినా  వస్తుందా? ఈరోజు ఎవరి కొంపలకు వాళ్ళు వెళ్ళి భోజనం చేయవలసిందే!' అనుకుంటూ వెనుకకు మరలాడు. శ్రీ గురుడు ఆ మాటలు విని అతనికి, అక్కడున్న వారందరికీ ఎలా చెప్పారు: 'నాయనలారా! ఈరోజు మీరెవరూ  భోజనానికి ఎక్కడికీ  వెళ్ళవద్దు. మీరందరూ భార్యాబిడ్డలతోనూ, స్నేహితులతోనూ కలసి ఈ మఠంలోనే భోజనం చేయాలి. కనుక అందరూ స్నానాలు చేసిరండి' అనిచెప్పారు. అందరూ ముఖముఖాలు చూచుకొని నవ్వుకుంటూ, 'ఈ దరిద్రుడు తెచ్చుకున్నది సోలెడు బియ్యమేకదా ! ఎవరికీ తెలియదు? మఠంలో అందరికీ భోజనం పెట్టడానికి అదేమి  సరిపోతుంది? ' అనుకుంటూ స్నానానికి వెళ్లారు. ఇంతలో శ్రీ గురుడు భాస్కరశర్మతో, 'నాయనా,  కొద్దిసేపట్లో అందరూ వస్తారు. త్వరగా సిద్ధంచేయి!' అని చెప్పారు. అతడు వెంటనే మరో పొయ్యికూడా వెలిగించి మిగిలిన వంటకాలు సిద్ధంచేసి, అంతా సిద్ధమైందని స్వామికి విన్నవించాడు. అప్పుడు స్వామి నది ఒడ్డునున్న ఇతర బ్రాహ్మణులందరినీ  ఆహ్వానించమని భాస్కరశర్మను ఆదేశించారు. అతడు అలాగే వెళ్ళి చెప్పగానే, వాళ్లు పకపకా నవ్వి, 'ఏమయ్యా! నీవు పెట్టినట్లే,  మేము తిన్నట్లే! ఈ రోజున మా ఇళ్ళల్లో ఉన్నదేదో మేము భోజనం చేస్తాము కానీ నీవు కనీసం శ్రీ గురుడికైనా కడుపునిండా పెట్టగలిగితే అంతేచాలు, పో,  పో!' అన్నారు. భాస్కరశర్మ తిరిగివచ్చి, వారందరూ తనను ఎగతాళిచేసి భోజనానికి రామన్నారని చెప్పాడు. శ్రీ గురుడు, 'నాయనా, మాకు బ్రాహ్మణులతో కలిసి భోజనం చేయడమే సమ్మతముగాని, మేము ఒక్కరమే బిక్ష చేయము' అన్నారు. స్వామి నోటిమాట తప్పక జరిగి తీరుతుందన్న దృఢ విశ్వాసం గల భాస్కరశర్మ అది నిరూపించుకోదలచి దీనంగా, స్వామి, నేనేం చేసేది? నేను మీరు ఆజ్ఞాపించిన ప్రకారం ఎంత బలవంత పెట్టిన వారు రావడంలేదు. సరిగదా, నన్ను ఆక్షేపిస్తున్నారు' అన్నాడు. అప్పుడాయన వెంటనే మరో శిష్యుని పంపి నదివద్దనున్న బ్రాహ్మణులందరిని వెంట తీసుకురమ్మని ఆజ్ఞాపించారు. అతడు పరుగున పోయి శ్రీగురుని ఆజ్ఞగా చెప్పి, అందరిని ఆహ్వానించాడు. ఇక తప్పక అందరూ మఠం  చేరుకున్నారు. శ్రీ గురుడు వారందరితో, 'బ్రాహ్మణోత్తములారా! మీరందరూ మీ భార్యాబిడ్డలను తీసుకొని మఠానికి రావాలి. ఈ రోజు ఇక్కడే నాలుగువేల మందికి సమారాధన చేయాలి. అందరూ విస్తళ్లలో అన్నం కట్టుకొని తీసుకుపోవాలి' అని భాస్కరశర్మతో, ఏమయ్యా, చూస్తావేమిటి? లేచి నమస్కరించి అందర్నీ ఆహ్వానించు' అన్నారు. అతడు వెంటనే లేచి నమస్కరించి, వారందరూ సకుటుంబ బంధుమిత్రులతో కలసి తానుచేయనున్న సమారాధనకు విచ్చేసి. తనను కృతార్థుడను చేయమని వేడుకున్నాడు. వారిలో కొందరు బ్రాహ్మణులు నవ్వి, 'ఓరి వెర్రి బ్రాహ్మణుడా! సిగ్గులేకుండా తగదుననుకొని, నీవుపిలిస్తే వచ్చామటయ్యా? నీవు చేసినది ఒక్కొక్కరికి ఒక్కొక్క మెతుకైనా  సరిపోతుందా?' అన్నారు. కొందరు పెద్దలు వారిని వారించి, 'తప్పు అతనిని నిందించవద్దు. ఇందులో అతని దోషమేమీ లేదు. గురువు చెప్పిన ప్రకారం చేస్తున్నాడు, అని మందలించారు. భాస్కరుడు శ్రీగురుపాదాలను పూజించి, ఆయనకు హారతి ఇచ్చి విస్తళ్ళు వేసాడు. అప్పుడు శ్రీగురుని ఆజ్ఞ కోరాడు. అంతట శ్రీ గురుడు అతనికి ఒక వస్త్రం ఇచ్చి, దానిని వంటకాలపై కప్పమని  ఆదేశించారు. అతడలా చేయగానే, శ్రీ గురుడు తమ కమండలంలోని నీరు అభిమంత్రించి ఆ వస్త్రంపై చల్లి, వస్త్రం తీయకుండా వడ్డన చేయమని ఆదేశించాడు. వెంటనే భాస్కరశర్మ, మరికొంతమంది ఆ వస్త్రం క్రింద నుండి పళ్ళాలతో వంటకాలు తీసుకుని తిరిగి తిరిగి వడ్డిస్తున్నారు. నెయ్యి కూడా ధారలుగా వడ్డీస్తూనేవున్నారు. అది చూచి భక్తులందరూ ఆశ్చర్యచకితులయ్యారు. అప్పుడు మొదట శ్రీగురుడు, తర్వాత మిగిలినవారూ ఆపోసనం తీసుకొని భోజనం చేయడం మొదలుపెట్టారు. భాస్కరశర్మ ఒక్కొక్కరి వద్దకు వెళ్లి, నెమ్మదిగా కూర్చుని కావలసినవి అడిగి వేయించుకుని తృప్తిగా భోజనం చేయమని చెప్పాడు. భోజనాలయ్యాక, అందరికీ తాంబూలాలిచ్చి, స్త్రీలకు,  పిల్లలకు, అన్ని వర్ణాలవారికి బంతులు బంతులుగా కూర్చోబెట్టి వడ్డన చేశారు. చివరకు ఊరిలో విచారించి, భోజనం చేయనివారు ఎవరూ లేరని నిర్ధారణ చేసుకున్నాక, శ్రీ గురుని ఆజ్ఞ తీసుకొని భాస్కరుడు గురు ప్రసాదం స్వీకరించాడు. అప్పుడతడు వెళ్లిచూచి అతడు వండిన వంటకమంతా అలానే ఉన్నదని స్వామికి మనవి చేశాడు. దానిని జలచరాలకు వేయమని స్వామి ఆదేశించగా అతడు అలానే చేశాడు. కొద్దిపాటి అన్నంతోనే వేలాదిమందికి గొప్పగా సమారాధన జరగడం వలన గురుమహిమ అందరికీ తెలిసింది. శ్రీ గురుడు సాక్షాత్తూ అన్నపూర్ణేశ్వరుడని, వారి అనుగ్రహానికి పాత్రులైనవారికి ఎట్టి కొరతా ఉండదని అందరూ కీర్తించారు. అప్పుడు శ్రీ గురుడు భాస్కరశర్మను ఆశీర్వదించి ఇంటికి పంపివేశారు. శ్రీ గురుని కీర్తి మరొక్కసారి అన్ని దిక్కులా మారుమ్రోగింది."
                           

ముప్పై ఎనిమిదవ అధ్యాయం  సమాప్తము 

శ్రీ దత్తాయ గురవేనమః 

శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః   

*** సోమవారం పారాయణ సమాప్తము ***


No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box

నూతనయజ్ఞోపవీత ధారణ విధానము

  నూతనయజ్ఞోపవీత ధారణ విధానము జంధ్యాల పౌర్ణమి శ్రావణ పౌర్ణమి నాడు వస్తుంది. ఈ రోజు జీర్ణమైన (పాత) జంధ్యమును తీసివేసి కొత్త జంధ్యమును (యజ్ఞోప...