Monday, May 25, 2020

గురు చరిత్ర అధ్యాయము -36

***సోమవారం పారాయణ ప్రారంభము ***

అధ్యాయము  -36




                               

శ్రీ గణేశాయనమః                             
శ్రీ సరస్వత్యేనమః                                                                            శ్రీ గురుభ్యోనమః 


కథారంభము 



                            నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి, "స్వామీ, అజ్ఞానమనే గాఢనిద్రలో మునిగివున్న నాకు ఈ గురుచరిత్ర వినిపించి మేలుకొలిపారు. దయతో అటుపై వృత్తాంతం తెల్పి, ఈ జ్ఞానాన్ని దృఢం చేయండి" అని ప్రార్థించాడు. సిద్ధయోగి సంతోషించి, ఇలా చెప్పసాగారు: "నాయనా, శ్రీ గురులీలలు ఎన్నని చెప్పగలను?  కొన్నింటిని మాత్రమే ఉదహరిస్తాను,  శ్రద్ధగా విను.                 


                గంధర్వ పురంలో సత్యవంతుడైన ఒక పేద బ్రాహ్మణుడు భిక్షాన్నంతో తృప్తిగా జీవిస్తూ ఉండేవాడు గాని, ఎవరి ఇంటికి భోజనానికి వెళ్ళేవాడు కాదు. అతడెంతో నిష్ఠతో వైదిక కర్మలన్నీ ఆచరిస్తూ, తనకున్న దాంట్లోనే అతిధులను సేవిస్తూ ఉండేవాడు. ఆ కాలంలో శ్రీ గురు నీ మహిమ వలన అచ్చటికి ఆకర్షింపబడి వచ్చిన భక్తులెందరో బ్రాహ్మణ సమారాధనలు చేస్తుండేవారు. ఈ పేద బ్రాహ్మణుడు మాత్రం వెళ్లే వాడు కాదు. ఒక సంవత్సరం మహాలయాలలో ఒక శ్రీమంతుడు గ్రామస్తులు అందరినీ దంపత సహితంగా భోజనానికి ఆహ్వానించాడు. ఈ పేద బ్రాహ్మణుడు మాత్రం వెళ్లడానికి ఒప్పుకోలేదు. అతని భార్యకు అటువంటి సమారాధనలకు వెళ్లి భోజనము, దక్షిణలు, కొత్త వస్త్రాలు, దానము తీసుకొని సుఖంగా జీవించాలని ఉండేది. ఆమె ఎంత చెప్పినా అతడు ఎప్పటివలే ఈసారి కూడా ఒప్పుకోలేదు. అతనితో తననొక్కదానన్నా పంపమని,లేకపోతే అతనిని గూడా రమ్మనీ పట్టుబట్టింది !అతడు, 'నేను రాను, నీకంత ఆశవుంటే నీవు వెళ్ళవచ్చు' అన్నాడు. అప్పుడామె ఆ శ్రీమంతునితో, 'నేను ఒక్కదాన్నైనా భోజనానికి రావచ్చా? 'అనడిగింది. అతడు, దంపతులే రావాలన్నాడు. నిరాశ చెంది, తన భర్తపై కోపంతో శ్రీగురుని వద్దకు వెళ్లి తన బాధనంతా వెళ్లబోసుకుని, తన భర్తకూడా ఆరోజు సమారాధనకు వెళ్లేలా ఆదేశించమని కోరింది. అందుకు శ్రీనృసింహసరస్వతి నవ్వి,  ఆమె భర్తను పిలిపించి, 'ద్విజోత్తమా, నామాటవిని ఈరోజుకు నీవుసమారాధనకు వెళ్ళు,  భార్య యొక్క కోరిక తీర్చడం భర్తయొక్క ధర్మం' అని హితం చెప్పారు. ఆ విప్రుడు, 'స్వామి మీ ఆజ్ఞానుసారం నా  నియమం విడిచి నేడు సంతర్పణకు వెళ్తాను. గురువు ఆజ్ఞను ఉల్లంఘించకూడదు కదా? అని చెప్పి ఆమెతో సమారాధనకు వెళ్ళాడు.


                 ఆనాడు అతడు జీవితంలో మొదటిసారిగా ఒక సత్రంవద్ద వందలాది బ్రాహ్మణుల పంక్తిన  భోజనానికి కూర్చున్నాడు. అందరూ భోజనాలకు కూర్చోగానే ఆ దంపతులిద్దరికీ అక్కడ తమ విస్తళ్ళలోనూ,  మరికొందరి విస్తళ్ళలోనూ ఉన్న అన్నాన్ని ఒక కుక్క, ఒక పంది త్రాకి అపవిత్రం చేసినట్లు దర్శనమైంది. ఆమె ఆశ్చర్యపోయి పరికించి చూడగా, నిజంగానే ఒక కుక్క దడిలోంచి దూరివచ్చి,  అన్నపురాశిని ముట్టుకున్నది. వెంటనే ఒకరు దానిని తరిమివేసి వడ్డన కొనసాగిస్తున్నారు. అది ఆ బ్రాహ్మణి చూచి,  వెంటనే కోపంతో విస్తరిముందు నుండి లేచి,  అందరితో ఆ విషయం చెప్పింది. ఆమె భర్త తల బాదుకుని,  'బుద్ధిలేనిదానా! నీ వలన ఈ రోజు నా కర్మ ఇలా కాలింది!' అని చెప్పి,  విస్తరిముందు నుండి లేచిపోయాడు. అప్పుడు ఆమెను తీసుకుని శ్రీగురుని వద్దకు వెళ్ళాడు. ఆయన ఆమె కేసి చూస్తూ, 'ఏమమ్మా!పరాన్నసుఖం అనుభవించావా? నీ కోర్కె   నెరవేరిందా?' అని అడిగి, నవ్వారు.  ఆమె సిగ్గుతో తలవంచుకొని,  'స్వామి! నా బుద్ధిహీనత వలన మావారిని  కూడా ఈ కుక్క కూటికి బలవంతాన  తీసుకుపోయాను. నా తప్పు  ఎలాగైనా మీరే సవరించాలి' అని వేడుకొన్నది. ఆమె భర్త ఆమెను నిందించి తన వ్రతం భంగం  అయినందుకు ఎంతగానో వాపోయాడు. అప్పుడు శ్రీ గురుడు అతనిని ఊరడించి ఇలా చెప్పారు: 'పోనీలే,  ఏమైతేనేమి?  నేటితో నీ భార్య మనసు కుదుట పడ్డ ది కదా? ఆమె ఇంక ఎన్నడు నిన్నలా వేధించదు.  ఇంతమాత్రానికే నీకెట్టి  దోషమూ  రాదు. నీకు నియమభంగమూ  కాదు. ఎప్పుడైనా దేవ, పితృకార్యాలలో భోక్త లభించక ఎవరికైనా కర్మానుష్టానానికి ఆటంకం ఏర్పడినప్పుడు దానిని రక్షించడానికి భోక్తగా వెళ్లినందువలన ఎట్టి  దోషమూ  ఉండదు' అని చెప్పారు. 'స్వామి,  ఎలాంటి భోజనం చేయవచ్చు,  ఎలాంటిది చేయకూడదో వివరించండి' అని కోరాడు. శ్రీ గురుడు ఇలా చెప్పారు:                                       

                 'గురువులు,  మేనమామలు,  ఆచారవంతులైన వేదవిదులు,  అత్తమామలు,  తోబుట్టువులూ  పెట్టిన భోజనం చేయవచ్చు. తల్లిదండ్రుల చేత సేవ చేయించుకునే వాడు భార్యాబిడ్డలను ఏడిపించి,  పేరు కోసం దానాలు  చేసేవాడు,  పొగరుబోతు,తగాదాలకోరు,  వైశ్వదేవం చేయనివాడు డబ్బుకాశించి అపాత్రులకు మంత్రోపదేశం చేసేవాడు, క్రోదవంతుడు,  భార్యను విడిచిపెట్టినవాడు,  క్రూరుడు,  పిసినారి,  స్త్రీ లోలుడు,  దురాచారి,  దొంగ, జూదరి,  స్నానం చేయకుండానే భోజనం చేసేవాడు,  భగవన్నామస్మరణ పట్ల శ్రద్దాభక్తులు లేనివాడు,  కనీసం సంధ్యావందనమైనా చేయని వాడు,  డబ్బు తీసుకుని డాంబికంగా జపాలు చేసేవాడు,  విశ్వాసఘాతకుడు,  పక్షపాతంతో అన్యాయం పలికేవారు,  స్వధర్మం విడిచి పరధర్మం అవలంబించేవారు,  బ్రాహ్మణులను,  గురువులను,  సాధువులను,  తన ఇంటి భోజనాన్ని నిందించేవారు,  తన ఇంటి కులదేవతను విడిచినవారు,  దురాశాపరులు,  భగవంతునికి నివేదించకుండా  భోజనం చేసేవారు- ఇలాంటి వారి భోజనం తిన్నవారు పతితులు అవుతారు.                                         


                కూతురును,  అల్లుణ్ణి  బాదించేవారికి మరుజన్మలో బిడ్డలు కలుగరు. కేవలం అద్వైతం చెప్పి  దేవపూజ చెయ్యనివాడు,  పొట్టకూటికోసం కపటంగా  ప్రవర్తించేవాడు పెట్టిన భోజనం వలన మరుజన్మలో గ్రుడ్డితనము, అల్పాయుష్షు,  లేక చెవుడు కలుగుతాయి. నిత్యమూ  ఇతరుల ఇంట్లో భోజనం చేసేవారి  పుణ్యమంతా నశించి వారి పాపమంతా సంక్రమిస్తుంది. పూర్ణిమ,  అమావాస్యలలో పరుల ఇంట భోజనం చేస్తే మాస మార్జించిన పుణ్యఫలం నశిస్తుంది. సాటివారికి కర్మానుష్టానంలో  లోపం తీర్చడానికి తప్ప ఇతరుల ఇంటికి భోజనానికి వెళ్ళకూడదు. అలా చేసిన దోషం గాయత్రీ జపంతో తొలుగుతుంది. సేవకుల ద్వారా ఆహ్వానం పంపిన వారి ఇంటికి కూడా వెళ్ళకూడదు. మనుమడు పుట్టేదాకా అల్లుని ఇంట్లో కూడా భుజించకూడదు. గోవు,  భూమి,  బంగారం మొదలైనవి దానం తీసుకోవడం కూడా అంత చెడ్డవి కాదు కానీ,  గ్రహణ సమయంలోనూ, సూతకమప్పుడు,  పుణ్యతీర్థాలలోనూ దానాలుతీసుకుంటే దోషంవస్తుంది. ఇటువంటి అనుచిత భోజనం చేయకుండా స్వధర్మమాచరించే వారికి దైన్యమెన్నటికీరాదు. దేవతలు,  సిద్ధులు,  కామదేనువూ  కూడా వారిని సేవిస్తుంటాయి.      


                                  అప్పుడా విప్రుడు  నమస్కరించి,  'స్వామి,  స్వధర్మం అంటే ఎలాటిదో కొంచెం వివరించండి' అని ప్రార్థించాడు. స్వామి ఇలా చెప్పారు: 'నాయనా,  పూర్వము ఒకప్పుడు నైమిశారణ్యంలో పరాశరమహర్షిని మునులిలా  కోరారు: "మునీంద్రా, స్వధర్మానుష్టానంలో మాకు అడుగడుగునా సందేహాలు కలుగుతున్నాయి. ఆచారము,  మంత్రము గురువు నుండి తప్ప తెలుసుకోగూడదంటారు. కనుక దయతో మాకవి వివరించండి". అప్పుడా మహర్షి ఇలా చెప్పారు: "ఋషులారా, సదాచారం వలన సర్వమూ సిద్ధిస్తుంది. బ్రాహ్మణుడు బ్రాహ్మణుని ముహూర్తంలో నిద్రలేచి,  భక్తితో త్రిమూర్తులను,  నవగ్రహాలు, సనకాది సిద్ధులను,  పితృదేవతలను,  సప్త సముద్రాలు, చతుర్దశ భువనాలు,  సప్తద్వీపాలు,  సప్త ఋషులను మొదట స్మరించాలి. అప్పుడు గోవుకు మ్రొక్కి,  ఆచమనం చేశాకనే  కాలకృత్యాలు తీర్చుకొవాలి. స్నానము,  భోజనాలకు ముందు,  తరువాత కూడా కూర్చుని ఆచమనం చేయాలి. చూడకూడనివి చూచినప్పుడు,  మాట్లాడకూడనివి మాట్లాడినప్పుడు,  వినరానివి వినినప్పుడు ఆచమనం చేస్తే శుద్ధి కలుగుతుంది. అందుకు మీరు లేకుంటే కుడి చెవును తాకాలి. కారణం, అందులో అగ్ని,  జలము,  వరుణుడు,  సూర్యుడు,  వాయువు మొ||గా గల సకల దేవతలు ఉంటారు. తర్వాత మానసిక స్నానం తో పరిశుద్ధుడై సూర్యోదయం వరకూ గాయత్రీ తప్ప మిగిలిన వేద భాగంలో ఏ ప్రార్థనా శ్లోకాలైనా  చదువుకోవచ్చు. తర్వాత ఊరికి నైరుతి దిక్కున ఆరుబయట దేవాలయాలు,  పవిత్రమైన చెట్లు లేని చోట, బాటకు,  నీరుకూ దూరంగాను,  ఆకులూ - గడ్డీ లేని చోట మలవిసర్జన చేయాలి. ఆ సమయంలో జందెము వేరుగా వేసుకుని,  అంగవస్త్రం తలకు చుట్టుకుని ఉండాలి. దిక్కులకేసి, ఆకాశంకేసి చూడకూడదు. పగటివేళ ఉత్తర దిక్కుకు, రాత్రివేళ దక్షిణ దిక్కుకూ  తిరిగి కూర్చోవాలి. తర్వాత ఆచమించి కుల దేవతను స్మరించాలి'.                                  

         ఇలా శ్రీ గురు ఆచారకాండ  గురించి ఇంకా ఎన్నో అంశాలు బోధించారు."


 ముప్పై ఆరవ అధ్యాయం సమాప్తము.



శ్రీ దత్తాయ గురవేనమః 


శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః   


No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box

నూతనయజ్ఞోపవీత ధారణ విధానము

  నూతనయజ్ఞోపవీత ధారణ విధానము జంధ్యాల పౌర్ణమి శ్రావణ పౌర్ణమి నాడు వస్తుంది. ఈ రోజు జీర్ణమైన (పాత) జంధ్యమును తీసివేసి కొత్త జంధ్యమును (యజ్ఞోప...